రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రైతు భరోసా పథకం కింద మొదటి విడత నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు నేరుగా బదిలీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నదని ఆయన పేర్కొన్నారు.
అలాగే రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దశల వారీగా నిధుల పంపిణీ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
అదే విధంగా ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మిగిలిన రైతు భరోసా నిధులను విడుదల చేసి మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మూడు విడతలుగా కలిపి రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు చేరనున్నాయని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఇదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
రైతు భరోసా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి రాష్ట్ర రైతాంగం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.
Leave Your Comments


























