పంట విత్తిన మొదలు చేతికి వచ్చే వరకు పలు రకాల చీడ – పీడలు దాడి చేస్తూ ఉంటాయి. వ్యవసాయంలో ప్రకృతి వైపరిత్యాల కంటే ఎక్కువ నష్టం చీడ – పీడల వల్లే జరుగుతుంది. ప్రకృతి అంతా అనుకూలించి ఆశించిన స్థాయిలో వర్షాలు పడినా పంట నాటిన దగ్గర నుంచి చేతికొచ్చే దశ వరకు అనేక రకాల చీడ – పీడలు పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు రైతులు రకరకాల రసాయన పురుగు మందులను పిచికారి చేస్తూ ఉంటారు. దీని వల్ల పర్యావరణానికి, ప్రజలకు హాని జరగడమే కాకుండా పెట్టుబడి భారం పెరుగుతుంది. అయితే సాగులో పంటను ఆశించే రకరకాల పురుగులను కట్టడి చేసేందుకు కొన్ని రకాల ట్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కాకుండా పర్యావరణానికి, మనుషులకు, మిత్ర పురుగులకు, పశువులకు ఎలాంటి హాని కలగదు. రైతులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల ట్రాప్స్ వాటి వినియోగం గురించి తెలుసుకుందాం.
లింగాకర్షక బుట్టలు :-
లింగాకర్షణ బుట్టలో ఉండే “ల్యూర్” మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగాకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండు ఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్ లో కొమ్మ పురుగులకు ప్రత్యేకమైన “ల్యూర్” అందుబాటులో ఉన్నాయి. సామూహికంగా ఎక్కువ మొత్తంలో వీటిని పొలంలో అమార్చుకుంటే అధిక సంఖ్యలో రెక్కల పురుగులను ఆకర్షించి దాని ద్వారా కలిగే నష్టాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
జిగురు అట్టలు :-
ఈ అట్టల ఉపరితలం పై జిగురు ఉంటుంది. ఇవి పురుగులను ఆకర్షిస్తాయి వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. ఈ జిగురు అట్టలు ముఖ్యంగా రసం పీల్చే పురుగుల నిర్మూలనకు ఉపయోగపడతాయి. తెలుపు, నీలం రంగులో ఉండే జిగురు అట్టలు తామర పురుగులను, పసుపు పచ్చ అట్టలు తెల్ల దోమను ఆకర్షిస్తాయి.
లైట్ ట్రాప్స్ :-
సాధారణంగా కొన్ని రకాల కీటకాలు లైట్ కాంతికి ఆకర్షించబడతాయి. ముఖ్యంగా వరిలో సూది దోమ, పచ్చ దోమ ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్ తో పాటు ఒక టబ్ లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్ కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.
విషపు ఎరువులు :-
ఈ విషపు ఎరలు పొగాకు లద్దె పురుగులకు, కత్తెర పురుగు మొక్క ఎదిగిన లార్వాలను సమర్థవంతంగా నివారిస్తాయి. ఈ విషపు ఎరలు వరి తవుడు, బెల్లాన్ని పాకంలాగా చేసుకొని 24 గంటలు పులియనిచ్చి పొలంలో వేసే ముందు 100 గ్రా -థయోకార్బ్ (కత్తెర పురుగులు ఉంటే) 500 మి.లీ “మోనోక్రోటోఫాస్” లేదా 50 మి. లీ . “క్లోరి పైరిఫాస్” కలిపి ఉండలుగా చేసుకొని పొలంలో చల్లుకోవాలి. వీటిని తినే పొగాకు లద్దెపురుగులు, కత్తెర పురుగులు చనిపోతాయి.
వివిధ పురుగులకు అవసరమయ్యే లింగాకర్షణ బుట్టల సంఖ్య :-
Agricu
పొలంలో “ట్రాప్స్” వాడే విధానం :-
ఈ ట్రాప్స్ ని పొలంలో పంట కంటే 3 – 4 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలి. పంట ఎత్తు పెరిగే కొద్దీ ఈ ట్రాప్స్ ని పైకి అమర్చుకోవాలి. ప్రతి 20 – 25 రోజులకు ల్యూర్ మర్చాలి. అదేవిధంగా జిగురు అట్టలకు జిగురు పోతే మార్చుతూ ఉండాలి.


డా. ఓ . శైల, డా.పి. శ్రీదేవి, ఆర్. రఘువన్ సింగ్, యం. రాజేష్ కుమార్, వి. పుష్పలత, డా.బి. రాజశేఖర్, బి. హరీష్, వై. సుల్తాన్, ఆర్. గౌతమి, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్ కర్నూల్, ఫోన్ : 8333818261.


























