రాష్ట్రంలోని పశుపోషకులకు నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచి పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ,పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. 2024 ఎన్నికల మ్యానిఫెస్ట్ లో చెప్పిన విధంగా పశుపోశకులకు సబ్సిడీపై మందుల పంపిణీ అందచేసేలా చేసిన హమీని నేడు నేరవేర్చనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 150 పశు ఔషధ విక్రయ కేంద్రాలు (PAVKs)ను మొదటి దశలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పశుపోషకులకు తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలు అందించడంతో పాటు జంతువుల చికిత్స ఖర్చులను గణనీయంగా తగ్గించగలమన్నారు. గ్రామ స్థాయి గొర్రెల పెంపక సహకార సంఘాల ద్వారా మాత్రమే ఈ కేంద్రాలు నిర్వహించబడతాయని, మహిళా సభ్యులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆశావహ జిల్లాల్లో ఒక్కో కేంద్రానికి రూ.1.5 లక్షల ప్రత్యేక సహాయం అందిస్తామని వెల్లడించారు. యూనిట్కు రూ.3.61 లక్షల వ్యయంతో మొత్తం రూ.5.41 కోట్ల ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, కొనుగోలు మరియు నిల్వలపై 20 శాతం ప్రోత్సాహకం, విక్రయాలపై 20 శాతం మార్జిన్ లభిస్తుందని తెలిపారు. PMBI సమన్వయంతో నాణ్యత నియంత్రణ, సరఫరా నిర్వహణ జరుగుతుందని, ఈ కేంద్రాలు పశు వైద్యశాల ఆవరణలో నిర్వహించబడతాయని, అన్ని లావాదేవీలు POS వ్యవస్థ (పాయింట్ ఆఫ్ సేల్) ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి, పశుసంవర్ధక రంగం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
పిఆర్వో – వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రివర్యుల కార్యాలయం.
Leave Your Comments


























