ముసాయిదా విత్తన చట్టం 2025 లో రైతుల ప్రయోజనం దృష్ట్యా చేర్చవల్సిన/మార్చాల్సిన అంశాలపై తుది నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం – మంత్రి తుమ్మల.
ముసాయిదాలో బయో సేఫ్టీ వారసత్వ విత్తనాలకు డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ చేర్చాలని సూచన.
నకిలి విత్తనాల వలన కలిగే పంట నష్ట పరిహారం విషయంలో స్పష్టత కోసం సూచన.
విత్తన చట్టం 2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా చట్టం -2025 పై అభ్యంతరాలను డిసెంబర్ 11 లోపు రాష్ట్రాలు తెలపాలని కోరగా, అందుకను గుణంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు నేడు సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమై తుది నివేదిక రూపకల్పనలో చేర్చాల్సిన / చట్టంలో మార్చాల్సిన అంశాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ. తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు విత్తనోత్పత్తి కీలకమని, సాంప్రదాయ మరియు స్వదేశీ రకాలు సహా అధిక-నాణ్యత గల విత్తనాల సాగు మరియు సంరక్షణలో వేలాది మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి వారి సహకారం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ, విత్తన రైతులు తరచుగా అధికారిక గుర్తింపు లేకపోవడం, లోపభూయిష్ట ఒప్పంద నిబంధనలు, సరైన పరిహారం అందకపోవడం వంటి ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గత పదేళ్ళ కాలంలో విత్తనోత్పత్తి సమస్యలతో పాటు, ముఖ్యంగా పత్తి, మిరప, మొక్కజొన్న మరియు కూరగాయలు పండించే రైతులు నకిలీ, నాసిరకం, అనుమతి లేని మరియు అధిక ధర కలిగిన విత్తనాల వ్యాప్తి కారణంగా నష్టాలను చవిచూశారు. నాణ్యత లేని హైబ్రిడ్ మరియు బిటి విత్తనాల లభ్యత, విత్తనాలు మరియు ఇన్పుట్ ఖర్చులు బాగా పెరగడంతో కలిపి, సాగు ఖర్చు గణనీయంగా పెరిగడంతో పాటు వ్యవసాయ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేసింది అని అన్నారు.
విత్తనచట్టం, 1966 మరియు తదనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన 2004,2010 మరియు 2019 నాటి విత్తన బిల్లు ముసాయిదాలో అనేక నిబంధనలు ఉన్నప్పటికి, రైతుల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించడంలో ప్రభావవంతమైన చట్టాలు లేకపోవడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారుతున్న పరిస్థితులు మరియు వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని కఠిన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇదే విషయమై వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు రైతు సంఘాల నుండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని చట్టాల మార్పుల కోసం విజ్ఙప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ దశలో గత నెలలో కేంద్ర ప్రభుత్వం విత్తన బిల్లు ముసాయిదా 2025 ని తీసుకొచ్చి, దానిలో అభ్యంతరాలు తెలిపి మార్పులు, చేర్పులు చేసేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించే విధంగా, వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది’ అని మంత్రిగారు అన్నారు.
అందుకు అనుగుణంగా రాష్ట్రస్థాయి, జిల్లాల స్థాయిలో రైతులతో, రైతు సంఘాల ప్రతినిధులతో, డీలర్లతో, విత్తనోత్పత్తి దారులతో, విత్తన కంపెనీ ప్రతినిధులతో, పూర్తి స్థాయి చర్చలు జరిపి, ఆ చర్చల ద్వారా వారు తెలిపిన అభిప్రాయాలను క్రోడికరించి ఒక నివేదికను తయారుచేయడం జరిగిందని మంత్రిగారు తెలిపారు.
ఇందులో భాగంగా ముసాయిదా చట్టం 2025 లోని నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సవరణలుః
సెక్షన్ 13 లోని నిబంధనః ఏదైనా వ్యవసాయ విత్తనాన్ని రైతులకు అమ్మకానికి విడుదల చేసే ముందు, కేంద్ర విత్తన కమిటీతో ముందస్తు నమోదు తప్పనిసరి.
సూచించిన సవరణ. రాష్ట్ర విత్తన కమిటీకి, రాష్ట్రానికి ప్రత్యేకమైన రకాలను నమోదు చేయడానికి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రం తమ రైతులకు విత్తన రకాల అనుకూలత మరియు అవసరాల గురించి బాగా తెలుసు.
సెక్షన్17(3)లోని నిబంధన: ఉత్పత్తిదారు లేదా ప్రాసెసింగ్ ప్లాంట్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు చేసుకోకపోతే ఉత్పత్తిదారు, విత్తన ఉత్పత్తి సంస్థ లేదా విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్ విత్తనాన్ని విక్రయించకూడదు లేదా పంపిణీ చేయకూడదు.
సూచించిన సవరణ: ప్రతి విత్తన ఉత్పత్తి సంస్థ నిర్వాహకుడు వ్యవసాయంలో డిగ్రీ లేదా డిప్లొమా కనీస విద్యార్హతను కలిగి ఉండాలి లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో కనీసం మూడు నెలల సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసి ఉండాలి.
సెక్షన్18(1)లోని నిబంధన: విత్తన డీలర్లు మరియు పంపిణీదారులు విత్తన అమ్మకాలను ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో నమోదు చేసుకోవాలి.
సూచించిన సవరణ: విత్తన డీలర్లు మరియు పంపిణీదారులు రిజిస్ట్రేషన్కు అర్హత సాధించడానికి వ్యవసాయంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి విత్తనోత్పత్తిలో సర్టిఫికేట్ కోర్సు యొక్క కనీస విద్యా అర్హతను కూడా కలిగి ఉండాలి.
సెక్షన్21(1d)లో నిబంధన: ఏదైనా నమోదిత రకం విత్తనాన్ని అమ్మకానికి ఉంచినప్పుడు, అది కేంద్ర కనీస విత్తన ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఉత్పత్తిదారుడు కంటైనర్పై విత్తన ప్రమాణాలను స్పష్టంగా ప్రదర్శించాలి మరియు కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా జారీ చేయబడిన QR కోడ్ను చేర్చాలి. ఈ QR కోడ్ విత్తనం అధీకృత ధృవీకరణ సంస్థ ద్వారా ధృవీకరించబడిందా లేదా ఉత్పత్తిదారుచే స్వీయ ధృవీకరించబడిందా అనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది.
సూచించిన సవరణ: ప్రస్తుత ముసాయిదా చట్టం ప్రకారం విత్తన ఉత్పత్తి సంస్థల స్వీయ-ధృవీకరణ అనుమతించబడుతుంది. స్వీయ-ధృవీకరణ కారణంగా రైతుల పొలాల్లో విత్తన వైఫల్యం గురించి అనేక ఫిర్యాదులు తలెత్తాయి. అందువల్ల, మార్కెటింగ్ కోసం ఉద్దేశించిన అన్ని విత్తనాలు గుర్తింపు పొందిన ధృవీకరణ సంస్థ ద్వారా ధృవీకరించబడాలి మరియు స్వీయ-ధృవీకరణను అనుమతించకూడదు.
సెక్షన్ 22లోని నిబంధన: అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విత్తనాల ధరలను నియంత్రించవచ్చు.
సూచించిన సవరణ: రైతుల ఫిర్యాదులు తలెత్తినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు విత్తన ధరలను నియంత్రించే అధికారం కల్పించాలి. రాష్ట్ర విత్తన కమిటీ విత్తన ధరలను సమీక్షించి, హేతుబద్ధమైన ధరల పరిమితిని సిఫార్సు చేయడానికి అనుమతించాలి.
సెక్షన్ 33 లో నిబంధనః ఎగుమతి చేసే దేశంలో నిర్వహించబడే వివిధ ప్రదేశాల పరీక్షల ఆధారంగా విత్తనాల దిగుమతికి అనుమతి ఉంది.
సూచించిన సవరణ: స్థానిక అనుకూలతను పరీక్షించకపోతే దిగుమతి చేసుకున్న విత్తనాలు భారతీయ వ్యవసాయ-వాతావరణ పరిస్థితులలో వైఫల్యం చెందవచ్చు. దీనివల్ల పంట నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల దిగుమతి చేసుకున్న విత్తనాలన్నింటికీ కనీసం రెండు (02) సంవత్సరాలు ICAR/SAU కేంద్రాలలో బహుళ-స్థాన పరీక్షలను తప్పనిసరి చేయడం చాలా అవసరం.
సెక్షన్34లోని నిబంధనః రిజిస్ట్రేషన్ లేకుండా విత్తనాల అమ్మకం, నకిలీ లేదా నాసిరకం విత్తనాల సరఫరా, లేదా సరైన లేబులింగ్ లేకుండా విత్తనాల అమ్మకం వంటి వాటికి పాల్పడిత రూ. 50,000 నుండి రూ. 30 లక్షల వరకు జరిమానాతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష.
సూచించిన సవరణ: ఉత్పత్తి సంస్థలు చేసిన నేరాలకు పైన పేర్కొన్న జరిమానాలు మరియు శిక్షలతో పాటు, విత్తన ఉత్పత్తిదారు లేదా కంపెనీని కనీసం ఐదు సంవత్సరాల పాటు విత్తన ఉత్పత్తి మరియు అమ్మకాల నుండి నిషేధించాలి.
ఈ సవరణలతో పాటు రాష్ట్ర రైతాంగం, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపినపుడు ముసాయిదా చట్టం 2025 లో చేర్చాల్సిన అంశాలను తెలియజేశారు. అవిః
– నకిలీ లేదా నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టపోయే రైతులకు చట్టబద్ధమైన, కాలపరిమితితో కూడిన పరిహార విధానాన్ని ఏర్పాటు చేయడానికి బిల్లులో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రవేశపెట్టి, సాధారణ పరిస్థితుల్లో రైతు పొందగలిగే అత్యధిక దిగుబడి ఆధారంగా పరిహారం లెక్కించాలి. రైతు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోపు క్లెయిమ్లను ప్రాసెస్ చేసి పరిష్కరించాలి.
– విత్తనోత్పత్తి చేసే రైతులను రక్షించడానికి ముసాయిదా విత్తన బిల్లులో ఒక ప్రత్యేక విభాగాన్ని చేర్చాలి.
– విత్తనాలను సరసమైన ధరలలో రైతులకు అందించడానికి విత్తన ధరల నియంత్రణ తప్పనిసరి చట్టబద్ధమైన నిబంధనగా ఉండాలి.
– సాంప్రదాయ విత్తనాలు మరియు వారసత్వ విత్తన రకాలను లేదా వాటి డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ (DSI)ను రక్షించడానికి ప్రత్యేక చర్యలు ఉండాలి.
– విత్తన కంపెనీలకు లైసెన్స్ లు జారీ చేయడానికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు రూపొందించాలి. అందులో లైసెన్సింగ్ కమిటీ కూర్పు, పరిశోధన అవసరాలు, విద్యార్హతలు, రకాల నమోదు కోసం బఫర్ వ్యవధి వంటి అంశాలను జోడించాలి.
ఈ అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు చేసి వీటన్నిటిని మూసాయిదా విత్తన బిల్లులో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కొరినట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి మరియు ఇతర వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
Leave Your Comments


























