కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025 పై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల .
- రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే విధంగా విత్తన బిల్లు.
- సర్టిఫికేషన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి.
- నకిలీ విత్తనాల పై నియంత్రణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి.
- విత్తన ముసాయిదా బిల్లు పై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు సవరణలు పరిగణలోకి తీసుకోవాలి.
- పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదు – మంత్రి తుమ్మల.
కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025 పై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ ముసాయిదా రైతులకు మేలు చేసేలా కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరించే విధంగా రూపుదిద్దుకుందని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయం పూర్తి బాధ్యత రాష్ట్రాలదైనా, ఈ బిల్లులో కీలక అధికారాలు కేంద్రానికి కట్టబెట్టడం ఆందోళన కరమైన విషయం అని మంత్రి అన్నారు.
ఈ ముసాయిదా చట్టంలో విత్తనాల రిజిస్ట్రేషన్ నుంచి లైసెన్సింగ్ వరకు, మార్కెట్ నియంత్రణ నుంచి నాణ్యత పర్యవేక్షణ వరకు అన్నిటినీ కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలనే ధోరణి కనిపిస్తోందని, ఇది రాజ్యాంగ భావనకు వ్యతిరేకం మాత్రమే కాక, రైతుల ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. విత్తన సర్టిఫికేషన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని, ఎందుకంటే విత్తనాల నాణ్యతపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే సామర్థ్యం రాష్ట్ర యంత్రాంగానికే ఉండాలన్నారు.
కేంద్రం ఇచ్చే లైసెన్స్ గనుక తీసుకుంటే అది ఏ రాష్ట్రంలో అయినా వ్యాపారం చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. లైసెన్స్ రద్దు చేయాలన్నా మళ్ళీ కేంద్రానికి సిపార్సు చేయాల్సిందే తప్ప రాష్ట్ర పరిధిలో ఇలాంటి అంశాలలో చర్య తీసుకోవడానికి అవకాశం లేదు.
మార్కెట్ లో ఏ కంపెనీ ఎంత ధరకు అమ్ముతుందో దాని మీద నియంత్రణ లేదు. ఎంత ధరకు అమ్మాలనే నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేవలము అత్యవసర పరిస్థితి లో మాత్రమే ధర నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి అన్నారు.
నాణ్యమైన విత్తనం రైతుకు అందుబాటులో తేవటం ఎంత కీలకమో, నాణ్యత లోపం ఉన్నప్పుడు నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగినప్పుడు రైతులకు సకాలంలో నష్ట పరిహారం అందించే ఏర్పాటు ఉండడం కూడా అంతే కీలకమని మంత్రిగారు అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న 1966 విత్తన చట్టంలో కానీ ,ఈ ముసాయిదా బిల్లులో కానీ నష్ట పరిహారానికి సంబంధించిన నియమం చట్టంలో లేదని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. భారతదేశంలో పండిస్తున్న విత్తనాలలో 40% పైగా విత్తనాల ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం నుండి జరుగుతున్నది. తెలంగాణలో రైతులు కంపెనీల కోసం విత్తనాలని పండించి ఇచ్చేటప్పుడు వారికి నష్టం జరిగితే నష్ట పరిహారం ఇచ్చే ఏర్పాటు ఉండాలని డిమాండ్ చేశారు.
సాంప్రదాయ విత్తనాల రక్షణ కోసం తెలంగాణలో రైతుల కోసం పనిచేసే కొన్ని సంస్థలు సీడ్ బ్యాంకులు పెడుతున్నామని, పాతకాలం నాటి విత్తనాలు, మూల విత్తనాలు దాచిపెట్టడం లేదా పాత విత్తనాలను రైతుకు అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ విత్తనాలన్నింటిని కూడా ఈ చట్టం నుంచి మినహాయింపు చేశారే తప్ప వీటి కోసం ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు తేలేదని వాపోయారు.
ఇక ఇతర దేశాల్లో పండించిన విత్తనాలు కూడా అక్కడ సర్టిఫికేషన్ ఏజెన్సీలు గనుక విత్తనాలను సర్టిఫై చేస్తే మన దేశంలో వాటిని తీసుకొచ్చి అమ్ముకొనే వెసులు బాటు చట్టం కల్పిస్తుందని, దీనివల్ల విదేశీ కంపెనీలకు మేలు జరుగుతుంది కానీ రైతాంగానికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. విదేశాలలో ఉత్పత్తయిన విత్తనాలకు మన దేశంలో ట్రయల్స్ జరిగిన తర్వాత, మన దేశంలో ఉన్న సర్టిఫికేషన్ ఏజెన్సీ సర్టిఫికేట్ చేస్తేనే మన దగ్గర అమ్మే విధంగా ఉండాలి. లేదంటే నకిలీ విత్తనాలు దేశంలోకి వచ్చే అవకాశం పెరుగుతుందన్నారు. అందుకు తగ్గట్టుగా ఈ ముసాయిదాల మార్పు చేయాలని కోరారు.
విత్తనాల నాణ్యత, నియంత్రణ కోసం ఈ చట్టం ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికి, రైతుల రక్షణ, రాష్ట్రాల హక్కులు, నష్టపరిహారం విధానం, విత్తన రైతుల సమస్యలు వంటి కీలక అంశాల్లో అవసరమైన మార్పులు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. అలాగే రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోనిక తీసుకొని, అందుకనుగుణంగా బిల్లులో మార్పులు చేయాలని కోరారు. కేంద్రం ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని, దేశంలోని ప్రతి రైతుకు మేలు చేసేలా బిల్లు సిద్ధం చేస్తుందని ఆశిస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రిగారు తెలిపారు.
ఈ సమావేశంలో ప్రొ. కొదండరామ్, తెలంగాణ రాష్ట్ర విత్తనభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డె శోభనాధ్రిశ్వరరావు, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, వైస్ ఛాన్సలర్ లు జానయ్య, రాజిరెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, విత్తనరంగ నిపుణులు మరియు అధికారులు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Leave Your Comments


























