ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం వెస్ట్రన్ సిడ్ని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయాన్ అండర్సన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మరియు ఇతర అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. గత ఆరు మాసాలుగా వివిధ స్థాయిల్లో జరిగిన చర్చల అనంతరం వ్యవసాయ విద్య, మరియు పరిశోధన రంగాలలో ఈ రెండు విశ్వవిద్యాలయాలు కొన్ని కీలక భాగస్వామ్య రంగాలపై చర్చించి ఇటీవలనే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన ఒప్పందాల ప్రకారం వ్యవసాయ విద్య, మరియు పరిశోధన రంగాలలో వివిధ కార్యక్రమాలను సంయుక్తంగా చేపట్టేందుకు నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మొదటిది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ సంయుక్తంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు సంవత్సరాలు PJTAU రాజేంద్రనగర్ లోనూ మరియు నాలుగో సంవత్సరం సిడ్నీ లోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో చదువుకునే విధంగా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం పై ఒప్పందం కుదిరింది. ఈ విధంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు PJTAU నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీని మరియు వెస్ట్రన్ సిడ్ని యూనివర్సిటీ నుంచి బీఎస్సీ వ్యవసాయ ఆహార శాస్త్రంలో డిగ్రీని పొందుతారు. విద్యార్థులు తదుపరి పీజీ, పీహెచ్డీ కోర్సులను వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో నేరుగా చేసుకొనే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ విధంగా తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం 25 నుంచి 30 మంది విద్యార్థులకు ఆస్ట్రేలియాలో నేరుగా చదువుకునే అవకాశం కలుగుతుంది.
* అదేవిధంగా, వ్యవసాయ రంగంలో వేగంగా వస్తున్న కృత్రిమ మేధా ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రైతాంగానికి అందే విధంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో పి జె టి ఏ యు మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అయాన్ అండర్సన్ మాట్లాడుతూ.. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఇప్పటికే డబ్ల్యూ.ఎస్. యుతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, దాని ప్రకారం భారతదేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో సంయుక్తంగా విద్య, పరిశోధనా రంగాలలో కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో భాగంగా పిజేటీఏయు తో గత కొన్ని నెలలుగా చర్చల అనంతరం ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం ఈ సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని, అంతేకాకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే విధంగా అగ్రి రోబోటిక్స్ మరియు కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలపై ఒప్పందం కుదరటం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ గత ఏడాది కాలం నుండి 4 అంతర్జాతీయ మరియు 5 జాతీయ సంస్థలతో వ్యవసాయ విద్య మరియు పరిశోధన రంగాలలో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని వివిధ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరంలో 25 మంది విద్యార్థులకు పీ జే టి ఏ యు – వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కింద ప్రవేశాలు కల్పించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూ.ఎస్.యు ప్రొఫెసర్ మార్క్, డాక్టర్ నిషా రాకేష్, డాక్టర్ కోపల్ చౌబే తో పాటు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డీన్స్ డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ ఈశ్వరి, డాక్టర్ రమణారావు, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అంతర్జాతీయ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డా. రాములు మరియు రిజిస్ట్రార్ డాక్టర్.జీ. ఈ. సిహెచ్. విద్యాసాగర్ తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Leave Your Comments


























