ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఈ వానాకాలంలో వాతావరణంలోని మార్పులు, వర్షాల వలన పసుపు పంటలో చీడ, పీడలను గుర్తించాము. కావున రైతులు పురుగులను మరియు తెగుళ్ళు లక్షణాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.
పురుగులు :
పసుపులో ఆకు పురుగు, ఎర్రనల్లి మరియు దుంప తొలుచు ఈగ ఆశించి తీవ్ర నష్టం చేయును. కావున క్రింది పురుగులను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవలెను.
ఆకు పురుగు :
- ఈ పురుగు లార్వా ఆకులను కత్తిరించి వేస్తూ మడిచి దానిలోనే జీవిస్తూ ఆకులను తింటు బతుకుతుంది.
- ఈ పురుగు నివారణకు 1. 5 గ్రా “ఎసెఫేట్” లేదా “కార్బరిల్” 0.1 శాతం 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఎర్ర నల్లి లక్షణాలు :-
తల్లి పిల్ల పురుగులు మొదట ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వడిలిపోయి రాలిపోతాయి.
నివారణ :-
ఒక లీటరు నీటిలో 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. “స్పిరోమెసిఫెన్” మందులతో “సాండోవిట్” 1 మి.లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
దుంప తొలుచు ఈగ :-
- ఈ ఈగ పిల్ల పురుగులు తెల్ల రంగులో బియ్యం గింజ వలే ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకొనిపోయి దుంపను నాశనం చేస్తాయి.
- ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగులో మారి ఎండిపోయి రాలిపోతాయి. పుచ్చిన దుంపలో బియ్యపు గింజను పోలిన పురుగులు ఉంటాయి.
- మువ్వును పీకినట్లయితే సుడిలాగా ఊడివస్తుంది.
నివారణ :-
ఈ పురుగు లక్షణాల పోలంలో కనపడినప్పుడు ఎకరాకు 100 కిలోల వేప పిండిని మొక్కు మధ్యలో వేయాలి. లేదా వేప పండిని వేయలేని సమయంలో 10 కిలోల “కార్బోఫ్యూరాన్” (Carbofuran) 3జి గుళికలను అదే పరిమాణం గల ఇసుకతో కలపి ఒక ఎకరం పొలంలో సమపాళ్ళలో చల్లాలి.
తెగుళ్ళు :-
ఆకుమచ్చ తెగులు లక్షణాలు :-
- మొదటి ఆకులపైన చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు తీవ్రమై ఆకు ఎండిపోతుంది.
- అధిక తేమ కలిగిన వాడవరణంలో కనబడుతుంది.
నివారణ :-
- “ప్రొపికోనజోల్” 1 మి.లీ. + “సర్ఫు”(Surf ) 5 గ్రా. ఒక లీటర్ నీటికి కలిపి ఆకులపై పికారి చేసుకోవాలి.
- ఒక గ్రా. “కార్బెండజిమ్” లేదా 2.5 గ్రా. “మాంకోజెబ్” + “కార్బెండజిమ్” మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో ఆకులపై రెండుసార్లు పిచికారి చేయాలి.
తాటాకు మచ్చ తెగులు లక్షణాలు :-
- మూడు గోధమ రంగులో పెద్ద పెద్ద మచ్చలు ఆకుల పై ఏర్పడతాయి.
- అధిక తేమ కలిగిన వాతావరణంలో కనబడుతుంది.
నివారణ :-
ఒక గ్రాము “కార్బెండజిమ్” (Carbendazim) లేదా 2.5 గ్రా “సాఫ్” (SAAF) “మాంకోజెబ్” (Mancozeb)” + కార్బెండజిమ్” (Carbendazim) మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆకులపై పిచికారి చేయాలి.
దుంప కుళ్ళు లక్షణాలు :-
- ఆకులు ఎండినట్లు ఉండి సులువుగా ఊడి రావడంతో పాటు కుళ్ళిన వాసన వస్తుంది.
- దుంపలు, కొమ్మలు కుళ్ళి, మెత్తబడి లోపల పసుపురంగుకు బదులు మట్టి రంగులో ఉండును.
- మొక్కలను లాగితే భూమట్టానికి ఊడి వస్తాయి.
నివారణ :-
- ఒక గ్రా. “మెటా-లాక్స్” + “మాంకోజెబ్” లేదా 2.5 గ్రా. సాఫ్ “మాంకోజెబ్” + “కార్బెండజిమ్” మందును లీటరు నీటికి కలిసి మొక్క మొదళ్ళు తడిచేలాగా పిచికారి చేయాలి.
- ఎకరానికి 2 కిలోల “ట్రైకోడెర్మా” జీవ నియంత్రకాలను మరియు 10 కిలోల వేప పిండిని 90 కిలోల పశువుల ఎరువులో వృద్ధి చేసి, మొక్క మొదళ్ళ భాగంలో వేసుకోవాలి.
- ఎకరానికి 200 కిలోల వేపపిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
- అధిక వర్షం నీటిని తీసివేయాలి.
పైన చెప్పిన విధంగా పసుపు పంటలో తొలి దశలో పురుగులకు కీటక నాశిని మందులను మరియు తెగుళ్ళకు శిలీ0ద్ర నాశిని మందులను సరైన సమయంలో సరైన మోతాదులో కలుపుకొని పిచికారి చేసినట్లయితే పసుపు పంటలో అధిక దిగుబడి పొందవచ్చును.
డా. ఎ. విజయ భాస్కర్, సీనియర్ శాస్త్రవేత్త. ఏరువాక కేంద్రం వరంగల్. డా. విశ్వతేజ, డా.నాగభూషణం మరియు డా. వెంకట రెడ్డి, ఎ. డి. ఆర్. ఆర్. ఎ. ఆర్ ఎస్, వరంగల్, ఫోన్ : 98498 17896.


























