ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం” కార్యక్రమం విజవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. జూన్ రెండో తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేయబడిన 35,000 మంది అభ్యుదయ రైతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మరియు అధికారుల చేతుల మీదుగా విత్తన పాకెట్లను లాంచనంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు సుమారు 2500 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనాన్ని రాష్ట్రంలోని అన్ని రెవిన్యూ గ్రామాల్లో ఎంపిక చేయబడిన 35,000 మంది అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని మంత్రిగారు తెలపారు. వరిలో 20,000, జొన్నలో 1,522, కందిలో 4,568, పెసరలో 8,910 విత్తన కిట్లను రైతాంగానికి అందించడం జరిగిందని, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2,192 కిట్లను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లాలో అత్యల్పంగా 379 విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా వ్వయసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… ఈ నాణ్యమైన విత్తనాన్ని అందుకున్న రైతులు, సరైన యాజమాన్య పద్దతులు పాటించి వచ్చిన దిగుబడిని గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా రానున్న రెండు, మూడు సంవత్సరాలలో ప్రతీ గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతాంగానికి నాణ్యమైన విత్తనం అందించాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి రైతు ప్రయోజనకరమైన వినూత్న కార్యక్రమాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరిన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులను మంత్రిగారు అభినందించారు.
Leave Your Comments