రబీకి సరిపడా యూరియా సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.
• యూరియా నిల్వలను త్వరితగతిన తరలించేందుకు కేంద్ర రైల్వే, పోర్టుల మంత్రులకు లేఖలు రాసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.
• పోర్టుల వద్ద యూరియా హ్యాండ్లింగ్కు అత్యవసర ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి.
రబీ సాగు సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో యూరియా వినియోగం అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో రైతులకు సరిపడా ఎరువుల సరఫరా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, డిమాండ్ను తట్టుకునేలా బఫర్ నిల్వలను అందుబాటులో ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులలో అక్టోబర్ నుండి డిసెంబర్ నెల వరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను అందించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి గారు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని, ఈ నిల్వలును డిసెంబర్ ఆఖరికి ఇంకా యెక్కువ మొత్తం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
కేంద్ర ఎరువుల శాఖ ద్వారా డిసెంబర్ నెలకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో 86000 మెట్రిక్ టన్నుల ఇప్పటికే కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, తుత్తుకుడి, గంగవరం, కారైకాల్, జైగఢ్ వంటి వివిధ పోర్టులకు చేరిందని మంత్రి గారు వెల్లడించారు. ఈ నిల్వలను త్వరితగతిన రాష్ట్రానికి తరలించడం అత్యవసరం కాబట్టి, యూరియా రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే కేంద్ర పోర్టులు, షిప్పింగ్ & వాటర్వేస్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా లేఖల ద్వారా అభ్యర్థించారు. యూరియా రవాణాకు అవసరమైన ఖాళీ రైల్వే రేకులను తక్షణమే కేటాయించడం, పోర్టుల వద్ద క్లియరెన్స్ మరియు హ్యాండ్లింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడం, యూరియా రవాణాకు ఇతర సరుకుల కంటే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే పోర్టు అధికారులు, షిప్పింగ్ లైన్లు, హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, రైల్వే అధికారుల మధ్య సమన్వయం పెంచి రవాణాలో ఆలస్యాలను నివారించడం వంటి అంశాలను లేఖల ద్వారా కేంద్ర మంత్రులను కోరినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ రవాణా ప్రక్రియను పర్యవేక్షించేందుకు, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను కూడా పోర్టులకు పంపి, సంబంధిత అధికారులతో సంప్రదించాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Leave Your Comments


























