మన రాష్ట్రంలో పండిస్తున్న పంటలలో వరి ప్రధానమైన పంట. దీనిని రైతులు సుమారు 25.04 లక్షల హెక్టారులలో సాగు చేయడం గమనార్హం. జీవనోపాధి కొరకు అధిక శాతం రైతాంగం వరి పంటను సాగు చేస్తూ 131.0 లక్షల టన్నుల దిగుబడిని సాధించడం జరిగినది. వరి పంటలో రైతులు నికర ఆదాయం పెంచుకోవాలంటే సరైన యాజమాన్య పద్ధతులను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వరిలో అధికోత్పత్తి కొరకు పాటించవలసిన నియమాలలో నాణ్యమైన నారు పెంపకం అనేది అతి ప్రధానమైనది. కాని సకాలంలో వర్షాలు పడకపోవడం, వర్షాభావ పరిస్థితులు, కూలీల కొరత వలన వరి పెంపకంలో రైతులు అధిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది.
ముఖ్యంగా వరి పంటలో కూలీల వినియోగం ఎక్కువగా ఉండటం వలన ఎకరాకు పంట కాలంలో 50 – 70 రోజులు పని దినాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా నాట్లు వేసే సమయంలో అధికంగా కూలీల అవసరం పడుతుంది. కాని వ్యవసాయ కూలీల ఖర్చు అధికంగా పెరగడం వలన సకాలంలో నాట్లు వేయలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సకాలంలో నాట్లు వేయనప్పుడు అది పంట దిగుబడిపై కూడా ప్రభావం చూపించి రైతులు నష్టపోవడం జరుగుతుంది. దీనికి సరైన ప్రత్యామ్నాయ మార్గం వరిలో యాంత్రీకరణను ప్రోత్సహించడం.
వరి నారును యంత్రాల ద్వారా పెంచడం వలన దిగుబడులు పెరగడానికి గల కారణాలు :-
. 15 – 25 రోజుల వయస్సు గల లేత నారుని వినియోగించడం వలన అధిక సంఖ్యలో పిలకలు ఏర్పడి దిగుబడి పెరుగుతుంది.
. వరుసల మధ్య మరియు మొక్కల మధ్య దూరం ఒకే విధంగా ఉండటం వలన ఈనిక ఒకే విధంగా ఉండి తాలు గింజల శాతం తగ్గుతుంది.
. నాట్లు తక్కువ లోతులో వెయ్యడం వలన మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండి దిగుబడి పెరుగుతుంది.
. ఈ పద్ధతి వలన వేరు వ్యవస్థ దృఢంగా ఉండి అధిక పిలకలు మరియు దిగుబడి పెరుగుతుంది.
యాంత్రీకరణ ద్వారా నారును పెంచే విధానము :-
. ఎంచుకొన్న రకాన్ని బట్టి 12 – 15 కిలోల విత్తనం నారుమడి పెంచడానికి సరిపోతుంది.
. యంత్రాలతో నారును (నాటేటప్పుడు) ట్రేలలో నారును పెంచుకోవాలి.
. ముందుగా ఎకరానికి 12 – 15 కిలోల విత్తనాన్ని, 2 కిలోల ఉప్పు నీటిలో వేసి, తర్వాత 4 – 5 సార్లు బాగా కడిగి, 24 గంటలు నీటిలో నానబెట్టి, 12 గంటలు మండె కట్టిన విత్తనాన్ని ట్రేలలో సీడింగ్ మిషన్ ద్వారా వేయాలి.
. 2 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు, ఒక అంగుళం ఎత్తు కలిగిన ట్రేలు ఎకరానికి 70 – 80 అవసరం అవుతాయి.
. ఒక్కొక్క ట్రేలో 3.5 – 4 కిలోల మెత్తని మట్టిని 120 – 160 గ్రాముల విత్తనాన్ని ఆటోమేటిక్ సీడింగ్ మిషన్ ద్వారా నారు కోసం వేసుకోవాలి.
. మట్టి మరియు విత్తనం నింపిన ట్రేలను దమ్ము చేసిన నారుమడులలో పెట్టి నీటిని చిలకరించి, మొదటి రెండు రోజులు వరి గడ్డితో కప్పవలెను. విత్తనం మొలచిన తర్వాత పొలంలో నీటిని పలుచగా పెట్టి నారును తయారు చేసుకోవాలి.
. ఈవిధంగా తయారైన నారును రకాన్ని బట్టి 15 నుండి 20 రోజుల లోపు ప్రధాన పొలంలో నాట్లు వేసి యంత్రం ద్వారా నారును నాటుకోవాలి.
మరింత సమాచారం కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెం 85002 74685
డా. యస్. కిరణ్ కుమార్, శాస్త్రవేత్త (సేద్య శాస్త్రం), డా. కె. భాగ్యలక్ష్మీ, శాస్త్రవేత్త, కార్యక్రమ సమన్వయ కర్త, డా. యస్. నీలవేణి, శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం), కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస.


























