పసుపు అనేది జింజిబరేసీ(అల్లం) కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్యం మరియు ఔషధ మొక్క. పసుపు యొక్క శాస్త్రీయ నామం కుర్కుమా లాంగా. పసుపుకు ఉన్న ఆకర్షణీయమైన బంగారు వర్ణం కారణంగా దీనిని “గోల్డెన్ స్పైస్ ఆఫ్ ఇండియా” అని పిలుస్తారు. భారతదేశం ప్రపంచంలోనే పసుపు ఉత్పత్తిలో అగ్రగామి దేశం. పసుపు రైతులకు ముఖ్యమైన నగదు పంట. ప్రపంచవ్యాప్తంగా పసుపు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. భారతదేశం మొత్తం పసుపు ఉత్పత్తిలో సుమారు 80% ఉత్పత్తి చేస్తుంది. ప్రధానంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, శ్రీలంక, యూరప్ లకు పసుపు ఎగుమతులు జరుగుతున్నాయి. వివాహాలు, పూజలు శుభ కార్యాలలో పసుపును ఉపయోగించే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో పాతుకుపోయింది.
భారతీయ సంప్రదాయంలో శుభ్రత, ఆరోగ్యం, శాంతి, శుభకార్యాల సూచకం. వంటకాల రుచిని, రంగును పెంచడమే కాకుండా, పసుపులో ఇమిడి ఉన్న రోగనిరోధక గుణాలు, శరీర శుద్ధి లక్షణాలు కారణంగా దానిని మంగళప్రదమైన పదార్థంగా పరిగణించారు. పసుపు యొక్క సువాసన మరియు సుగంధ పరిమళం పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చి, మనసుకు ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తుంది. మన దేశం 2023-24లో 10.42 లక్ష టన్నుల పసుపును ఉత్పత్తి చేయగా, 2024-25లో 12.04 లక్ష టన్నులను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ పసుపు ఉత్పత్తిలో సుమారు 75 శాతం గా ఉంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే పసుపులో సుమారు 80 శాతం భారతదేశం నుంచే సరఫరా అవుతోంది.
పసుపు యొక్క ఔషధ గుణాలు :-
పసుపు భారతీయ సాంప్రదాయ వైద్యంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఔషధ మొక్క. ఇది ఆయుర్వేదం, సిద్ధ, యూనాని, మరియు చైనీస్ వైద్య విధానాలలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపులో ప్రధాన క్రియాశీల పదార్థం “కుర్కుమిన్ ”, ఇది పసుపుకు పసుపు రంగు ఇవ్వడమే కాకుండా అనేక వైద్య గుణాలకు కారణమవుతుంది. కుర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ కేన్సర్ లక్షణాలు కలిగి ఉంటుంది.
పసుపులోని కుర్కుమిన్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) కలిగించే రసాయనాలను తగ్గిస్తుంది. ఇది ముఖ్యంగా ఆర్థరైటిస్, కండరాల నొప్పులు మరియు గాయాల వాపు వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. పసుపులోని కుర్కుమినోయిడ్స్ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను నిర్వీర్యం చేస్తాయి. ఇవి కణజాల నష్టం నుండి రక్షణ కల్పించి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఇది హృద్రోగాలు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులోని కుర్కుమిన్ మరియు టర్మెరోన్లు బ్యాక్టీరియా, ఫంగస్ మరియు వైరస్ ల వృద్ధిని నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయి. పసుపు పొడిని గాయాలపై వేస్తే అది గాయం శుభ్రం చేసి, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. పసుపు గార్గిల్ లేదా పసుపు పాలు తాగడం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్, జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. అనేక పరిశోధనల్లో కుర్కుమిన్ కణాల్లో జరిగే అసాధారణ వృద్ధిని నియంత్రించి, కేన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటుందని నిర్ధారించబడింది. ఇది ముఖ్యంగా బ్రెస్ట్, కొలన్, ప్రోస్టేట్ మరియు లివర్ కేన్సర్లపై రక్షణాత్మక ప్రభావం చూపుతుంది. పసుపు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల గ్యాస్, బ్లోటింగ్, అపచయం వంటి సమస్యలు తగ్గుతాయి. కాలేయంలో విషపదార్థాలను తొలగించడంలో పసుపు సహాయపడుతుంది. పసుపు చర్మానికి సహజమైన శుభ్రకారి మరియు యాంటీసెప్టిక్. ముఖంపై మొటిమలు, మచ్చలు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు లేపనం చర్మానికి కాంతిని, మృదుత్వాన్ని ఇస్తుంది. అందుకే పసుపు అనేది అనేక కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ప్రధాన పదార్థం. కొత్త పరిశోధనల ప్రకారం, పసుపులోని కుర్కుమిన్ మెదడులో స్థాయులను పెంచి, మతిమరుపు మరియు డిప్రెషన్ లాంటి నాడీ వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.
పసుపులోని పోషక విలువలు :-
పసుపు వంటల్లో రంగు, రుచి, సువాసన ఇవ్వడమే కాకుండా, అనేక పోషక పదార్థాలను కూడా అందిస్తుంది. పసుపులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్, ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల పసుపు పొడిలో సగటుగా 354 కిలో క్యాలరీల శక్తి, 64–65 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 7–8 గ్రాముల ప్రోటీన్ , 10 గ్రాములకొవ్వు , 21 గ్రాముల ఫైబర్ , 183 మి. గ్రా కాల్షియం, 41.4 మి. గ్రా. ఇనుము, 7.8 మి. గ్రా. మాంగనీస్, 193 మి. గ్రా. మెగ్నీషియం, 268 మి. గ్రా. ఫాస్పరస్, 2525 మి. గ్రా. పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.
పసుపులో కాల్షియం, ఇనుము, మాగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఖనిజాలు శరీరంలోని ఎముకల బలాన్ని, రక్తనిర్మాణాన్ని, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇనుము (Fe) ఎక్కువగా ఉండడం వలన పసుపు రక్తహీనత నివారణలో సహాయపడుతుంది. అలాగే పొటాషియం అధికంగా ఉండడం వలన రక్తపోటు నియంత్రణలో దోహదం చేస్తుంది.పసుపులో విటమిన్ C, విటమిన్ B6, విటమిన్ E వంటి విటమిన్లు కూడా ఉన్నాయి. విటమిన్ C శరీరానికి రోగ నిరోధక శక్తి ఇస్తుంది; విటమిన్ B6 నాడీ వ్యవస్థకు అవసరం కాగా, విటమిన్ E చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఈ విటమిన్లు కలిసి శరీరంలోని కణజాల నష్టాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పసుపులో డైట్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం తగ్గిస్తుంది. పసుపు ఫైబర్ మలినాలను బయటకు తీయడంలో సహాయపడుతుంది మరియు గట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. పసుపులోని ముఖ్యమైన జీవసక్రియ పదార్థం కుర్కుమిన్. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం. కుర్కుమిన్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నిర్వీర్యం చేసి కణజాలాన్ని రక్షిస్తుంది. అదేవిధంగా డీమెథాక్సీ కుర్కుమిన్, బిస్డీమెథాక్సీ కుర్కుమిన్ వంటి ఇతర సమ్మేళనాలు కూడా ఉన్నాయి, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు యొక్క పోషక పదార్థాలు మరియు జీవసక్రియ పదార్థాలు కలిసి శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు ఇస్తాయి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేసి, రక్తపోటును నియంత్రిస్తాయి. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు హృద్రోగాలు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే, చర్మ ఆరోగ్యానికి కూడా పసుపు ప్రయోజనకరం.
పసుపు యొక్క విలువ ఆధారిత ఉత్పత్తులు :-
కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటీ ఆర్ ఐ) జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (ఎన్ ఐ ఆర్ సి ఏ) గా రూపాంతరం చెంది, ప్రస్తుతం పొగాకు తో పాటు వాణిజ్య పంటలైన పసుపు, మిరప, అశ్వగంధ, ఆముదం వంటి పంటల్లో ముఖ్యంగా విలువ ఆధారిత ఉత్పత్తులపై మరింత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలఫై పరిశోధనలు చేసి పసుపుతో ముఖ్యమైన విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నది. సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వారి లైసెన్స్లు కూడా పొందటం జరిగింది. ఈ ఉత్పత్తులు రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
పసుపు పొడి :-
పసుపు పొడి తయారీ అనేది పసుపు పంటలో అత్యంత ముఖ్యమైన దశ. ఇది పసుపు యొక్క మార్కెట్ విలువను పెంచడమే కాకుండా, నిల్వ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పసుపు తయారీని శాస్త్రీయ పద్ధతిలో చేయడం ద్వారా దాని రంగు, వాసన, రుచి మరియు కుర్కుమిన్ పరిమాణం కాపాడబడతాయి. పసుపు కొమ్ములు అనగా రైజోమ్స్ ను నేల నుండి తవ్వి తీసి మట్టి మరియు వేరు భాగాలను తొలగించి, నీటిలో వేసి శుభ్రం చేసి, మలినాలు, మట్టిని తొలగించాలి. కడిగిన రైజోమ్స్ ను స్టీమ్ బాయిలర్ లో కానీ పెద్ద పాత్రలో కానీ వేసి నీటితో మరిగించాలి. సాధారణంగా 30–45 నిమిషాలు మరిగిం మరిగించే ఈ ప్రక్రియను “క్యూరింగ్ ” అని అంటారు. ఈ పద్ధతిలో రైజోమ్స్ లోని పచ్చి వాసన తగ్గి, కుర్కుమిన్ రంగు స్థిరపడి, ఎండబెట్టే సమయం తగ్గుతుంది. మరిగించిన పసుపును సూర్యరశ్మి లో కానీ, మెకానికల్ డ్రయర్లు ఉపయోగించి 10–15 రోజులపాటు ఎండబెట్టాలి. రైజోమ్స్ తగినంతగా ఎండకపోతే పొడి నాణ్యత తగ్గుతుంది. పూర్తిగా ఎండిన పసుపు ముక్కలను పల్స్ మిల్లులు లేదా హామర్ మిల్లులు ద్వారా పొడి చెయ్యాలి. గ్రైండ్ చేసిన పొడిని 100–120 మైక్రాన్ సీవ్ ద్వారా వడకడతారు. ఇలా తయారైన పసుపు మంచి నాణ్యతను కలిగి సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది. తయారైన పసుపు పొడిని ఎయిర్టైట్ పాలిథిన్ బ్యాగ్లు లేదా కాగితం కవర్లలో నింపి, చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమ లేదా కాంతి ఎక్కువగా ఉంటే పసుపు రంగు మరియు వాసన తగ్గిపోతాయి. ఎండిన కొమ్ములు ప్రకాశవంతమైన పసుపు రంగు కలిగి, తక్కువ తేమ (8–10%) మరియు అధిక కుర్కుమిన్ కంటెంట్ (3–5%) కలిగి ఉండాలి.
కుర్కుమిన్ బేవరేజ్ మిక్స్ :-
కుర్కుమిన్ బేవరేజ్ మిక్స్ అనేది పసుపులోని ముఖ్యమైన క్రియాశీల పదార్థమైన కుర్కుమిన్ ఆధారంగా తయారుచేసే ఆరోగ్య పానీయ మిశ్రణం. ఇది పసుపు ఎక్స్ట్రాక్ట్, పాలు పొడి, నేచురల్ స్వీట్నర్, అల్లం, దాల్చినచెక్క, యాలకలు, మిరియాలు వంటి సహజ పదార్థాలతో తయారవుతుంది. ఈ మిశ్రణాన్ని నీటిలో లేదా పాలలో కలిపి తాగుతారు. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కుర్కుమిన్ బేవరేజ్ మిక్స్ సహజంగా ఆరోగ్యాన్ని కాపాడే మరియు శక్తినిచ్చే పానీయంగా NIRCA సంస్థ లో తయారు చేస్తున్నారు. fssai వారి లైసెన్సు పొందటం జరిగింది.
పసుపు బిస్కెట్లు :-
పసుపు బిస్కెట్లు ఆరోగ్యకరమైన, విలువ ఆధారిత ఆహార పదార్థాలలో ఒకటి. వీటిని గోధుమపిండి, వెన్న లేదా నూనె, చక్కెర, బేకింగ్ పౌడర్, పాలు మరియు తగిన మోతాదులో పసుపు పొడి కలిపి తయారు చేస్తున్నాము. మొదట అన్ని పొడి పదార్థాలను బాగా కలిపి, వెన్న మరియు పాలు చేర్చి మృదువైన ముద్దగా తయారు చేస్తారు. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని బిస్కెట్ ఆకారంలో మలచి, 160–180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 15–20 నిమిషాలు బేక్ చేస్తారు. పసుపు చేర్చడం వల్ల బిస్కెట్లకు సహజమైన పసుపు రంగు, సువాసన మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతూ, రుచి మరియు ఆరోగ్యం రెండింటినీ అందించే ఆహారంగా ప్రసిద్ధి పొందాయి.
పసుపు గుళికలు :-
పసుపు గుళికలు లేదా కుర్కుమిన్ న్యూట్రాస్యూటికల్స్ అనేవి పసుపులోని ప్రధాన క్రియాశీల పదార్థమైన కుర్కుమిన్ ఆధారంగా తయారుచేసే పదార్ధాలు. ముందుగా పసుపు రైజోమ్స్ నుండి కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ ను తీసుకొని, దీనికి మాల్టోడెక్స్ట్రిన్ మరియు పిపిరినే వంటి సహాయక పదార్థాలతో కలిపి పొడి రూపంలో తయారుచెయ్యాలి. తరువాత ఈ పొడిని ఆటోమేటిక్ క్యాప్సుల్ ఫిల్లింగ్ యంత్రాల ద్వారా వెజిటేరియన్ లేదా జెలటిన్ క్యాప్సూల్లలో నింపాలి. పసుపు గుళికలు శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను అందిస్తూ, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి ఆరోగ్య పరిరక్షణలో విస్తృతంగా ఉపయోగించే సహజ న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులలో ఒకటి. పోషక లోపాలను సరి చేయటానికి కూడా పసుపును గుళికల రూపంలో తయారు చేస్తున్నాము.
పసుపు ఫ్లేక్స్ :-
పసుపు ఫ్లేక్స్ అనేవి పసుపును పొడి రూపంలో కాకుండా పలుచని ముక్కలుగా ఎండబెట్టి తయారుచేసే విలువ ఆధారిత ఉత్పత్తి. ముందుగా పసుపు రైజోమ్స్ను శుభ్రంగా కడిగి, కొద్దిగా వినేగార్ (2%) కలిపిన నీటిలో కొంత సేపు ఉంచి, బ్లాంచింగ్ చేసి, ఆ తరువాత వాటిని చల్లబెట్టి, స్లైసింగ్ యంత్రంతో పలుచని ముక్కలుగా కొయ్యాలి . ఈ ముక్కలను సూర్య కాంతిలో లేదా హాట్ ఎయిర్ డ్రైయర్ లేదా సోలార్ డ్రైయర్ లో తేమ పూర్తిగా తొలగే వరకు ఎండబెట్టాలి. ఎండిన తర్వాత పసుపు ఫ్లేక్స్ బంగారు పసుపు రంగుతో మెరుస్తూ , దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. వీటిని మసాలా ఉత్పత్తుల తయారీలో, టీ మిశ్రమా లలో, ఔషధ ఉత్పత్తుల్లో లేదా నేచురల్ కలర్ యాజెంట్లుగా ఉపయోగించే పసుపు ఫ్లేక్స్ రైతులకు అధిక విలువ ఇచ్చే, తక్కువ ఖర్చుతో చేయగల వినూత్న ఉత్పత్తి.
పసుపు సాండల్ సబ్బులు :-
పసుపు సాండల్ సబ్బులు అనేవి సహజ సౌందర్య మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఒక ముఖ్యమైన విలువ ఆధారిత పసుపు ఉత్పత్తి. వీటిని సహజ నూనెలు (కోకనట్ ఆయిల్, కాస్టర్ ఆయిల్, పామ్ ఆయిల్), సాండల్ వుడ్ సుగంధం , పసుపు పొడి లేదా కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్, మరియు కార్రోట్ పొడి, అలో వెరా జెల్, రోజ్ పెటల్ పొడి ఇత్యాది పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. ముందుగా నూనెల మిశ్రమాన్ని కాస్టిక్ సోడా ద్రావణంతో కలిపి సబ్బు బేస్ తయారు చేసుకొని, పిదప అందులో పసుపు పొడి, సాండల్ సువాసన చేర్చి బాగా కలిపి అచ్చులలో పోసి గట్టిపడే వరకు ఉంచి పచ్కింగ్ చేయాలి. పసుపు చర్మానికి సహజ కాంతి, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను అందిస్తుంది, సాండల్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ సబ్బులు చర్మం మృదువుగా, మచ్చలేని మరియు ప్రకాశవంతంగా ఉండేందుకు సహాయపడతాయి.
పసుపు అశ్వగంధ టీ పొడి :-
పసుపు అశ్వగంధ టీ పొడి అనేది ఆరోగ్యానికి మేలు చేసే సహజ హెర్బల్ పానీయ పదార్థం. దీనిని పసుపు పొడి, అశ్వగంధ పొడి, అల్లం పొడి, దాల్చినచెక్క, యాలకులు, రోజ్ పెటల్స్, తులసి మరియు పుదీనా వంటి సహజ దినుసులతో కలిపి తయారు చేస్తున్నాము. ఈ మిశ్రమం శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచి, ఒత్తిడి తగ్గించి, శక్తివంతంగా ఉంచుతుంది. తయారీ విధానం సులభం. అన్ని పొడి పదార్థాలను సరైన నిష్పత్తిలో కలిపి, వడకట్టి గాలి రానివ్వని ప్యాకెట్లలో భద్రపరచాలి. వాడేటప్పుడు ఒక టీ స్పూన్ పొడిని వేడి నీటిలో కలిపి 5 నిమిషాలు ఉంచి వడకట్టి తాగాలి. ఈ టీ శరీరానికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు రిలాక్సేషన్ గుణాలను అందించే ఫంక్షనల్ హెల్త్ డ్రింక్గా ప్రసిద్ధి పొందుతోంది.
పసుపు అల్లం ఊరగాయ :-
పసుపు అల్లం ఊరగాయ అనేది ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఉత్పత్తి, ఇది శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీని తయారీకి తాజా పసుపు మరియు అల్లం సమాన మోతాదులో తీసుకుని శుభ్రంగా కడిగి పలుచని ముక్కలుగా కోయాలి. తరువాత వీటిని ఉప్పు, నిమ్మరసం లేదా వెనిగర్లో కొంతసేపు నానబెట్టి, ఆ తరువాత ఆవాల పొడి, కారం, మెంతుల పొడి, ఉల్లిగడ్డల పొడి, నువ్వుల నూనె చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన సీసాలో నింపి 3-4 రోజులు గది ఉష్ణోగ్రతలో ఉంచితే రుచికరమైన పసుపు అల్లం ఊరగాయ సిద్ధమవుతుంది. ఇది భోజనానికి రుచిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచి శరీరాన్ని శీతాకాలంలో చల్లదనం నుండి కాపాడుతుంది.
ముగింపు :-
ఈ ఉత్పత్తులు కేవలం వినియోగదారులకు ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా, రైతులకు అదనపు ఆదాయం అందించే గొప్ప అవకాశాలను సృష్టిస్తాయి. ముడి పసుపును మార్కెట్లో అమ్మడం కంటే, విలువ ఆధారిత ఉత్పత్తుల రూపంలో ప్రాసెసింగ్ చేస్తే ఉత్పత్తి విలువ సుమారు 3–5 రెట్లు పెరుగుతుంది. కావున సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, గ్రామీణ ఉపాధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రైతుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి.తద్వారా, రైతులకు ఆర్థికంగా లాభదాయకామే కాక దేశానికి ఎగుమతి అవకాశాలను పెంచడానికి మార్గం సుగమం అవుతుంది.
డా.కె.సుమన్ కల్యాణి, డా.ఎం.శేషు మాధవ్, డా. ఎల్.కే ప్రసాద్, ఉషా ఏంజెల్, పూజిత నాగవల్లి, జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ, ఫోన్ : 94409 99035


























