ఆంధ్రప్రదేశ్తెలంగాణమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

వ్యవసాయ భూములలో సౌర ఫలకాలు (అగ్రివోల్టాయిక్స్ / సౌర వ్యవసాయం): ఆధునిక వ్యవసాయానికి నాంది

0

భారతదేశంలో 2030 లోపు 500 గిగావాట్ల సౌర శక్తి లేదా పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్న సందర్భంలో, విద్యుత్ ఉత్పత్తి మరియు భూమి కొరత అనే రెండు ప్రధాన సమస్యలకు వ్యవసాయ భూములలో సోలార్ ఫలకాలు (ప్యానెల్లు) సరైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. సాగుభూమిలో సౌర వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా, ఆహార ఉత్పత్తిని ప్రభావితం చేయకుండానే విద్యుత్ ఉత్పతి లక్ష్యాలను సాధించవచ్చు. ఎందుకంటే భారతదేశంలోని భూమిలో 60% సాగు కోసం ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా కేవలం 1% భూమి పై మాత్రమే సౌరఫలకాలు ఏర్పాటు చేయడం ద్వారా అదనంగా 630 గిగావాట్లు సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలో 20 అగ్రివోల్టాయిక్ వ్యవసాయ ప్రాజెక్టులు నెలకొల్పడం జరిగినది.

వ్యవసాయ భూములలో సౌర ఫలకాల (అగ్రివోల్టాయిక్స్ లేదా ఫోటోవోల్టాయిక్) వ్యవసాయం అనగా ఒకే భూమిని పంటలు పండించడానికి మరియు సౌర శక్తిని ఉత్పత్తి చేయడానికి వినియోగించే పద్ధతి. ఈ పద్ధతిలో వ్యవసాయ భూమిలో పంటలపై లేదా పంటల మధ్యలో లేదా పశువుల గడ్డని పెంచే భూముల పై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా స్వచ్ఛమైన సౌర శక్తిని ఉత్పత్తి చేయడమే కాకుండా. సుసంపన్నమైన వ్యవసాయానికి కూడా దోహదపడుతుంది. దీనివల్ల ఆహార ఉత్పత్తి మరియు సొరక్తి ఉత్పత్తి రెండూ కలిసికట్టుగా జరుగుతాయి. ప్రస్తుత కాలములో వాతావరణ మార్పులు పెరుగుతున్న కొద్దీ, పునరుత్పాదక శక్తి అవసరాలు అధికమవుతున్న సమయంలో, అగ్రివోల్టార్స్ వ్యవసాయ విధానం ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతంగా వినియోగించడం జరుగుతుంది. ఇది భూమిపై ఎటువంటి అవరోధాలు లేకుండా ఆహారం మరియు సౌరశక్తి అవసరాలు రెండింటినీ తీర్చగలదు. ఈ విధానంలో భూమిని సమర్ధవంతం గా వినియోగించవచ్చు. అంతే కాకుండా నీడను కల్పించడం ద్వారా పంటలను కాపాడడంలో సహాయపడుతుంది మరియు రైతులకు కొత్త ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఆర్థిక మద్దతు కలిగిస్తుంది.

ఈ అగ్రివోల్టెక్స్ వ్యవసాయ విధానం 1980 లో జర్మన్ భౌతిక శాస్త్రవేత్తచే తొలిసారిగా ప్రారంభించబడి పంటలను పండించడంలోను మరియు పునరుత్పాదక విద్యుత్ ను  తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందుతోంది. ఇది ముఖ్యంగా భూమి పరిమితం గాను మరియు విద్యుత్ అవసరాలు అధికమున్న భారత్ వంటి దేశాలకు మరింత ప్రయోజనకరం. భారతదేశంలో అగ్రివోల్టాయిక్స్ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సాంకేతిక ప్రయోగాలు చేసి మరియు రైతులకు సరైన సబ్సిడీ సహకారం వల్ల దీనిని విస్తరించే అవకాశం కలదు.

భారతదేశంలోనే అతిపెద్ద అగ్రివోల్టాయిక్ పొలం మధ్యప్రదేశ్ లోని  సాగర్ లో  16 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించారు. ఈ పొలంలో ఎత్తైన సౌర ఫలకాల కింద స్ట్రాబెర్రీలు, లేట్టుస్ వంటి పంటలను సాగు చేస్తూ, రోజూ సుమాకు రు 25,000 యూనిట్లు శుద్ధ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నూతన వ్యవసాయ పద్ధతి ఆదాయాన్ని పెంచడమే కాకుండా, నీటి వినియోగాన్ని ఆదా చేయడంలోను, తీవ్ర వాతావరణపరిస్థితుల నుంచి పంటలను కాపాడడంలోను సహాయపడుతుంది. ఇదే పద్ధతిలో మహారాష్ట్ర లోని నాసిక్ లో ద్రాక్ష సాగుతోపాటు సౌరశక్తిని ఉత్పత్తి చేసే ప్రాజెక్టును నిర్వహిస్తోంది. నాగ్ పూర్ లోని మురద్ పూర్  లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో తేలియాడే సౌర ప్యానెల్లు 465 ఎకరాల్లో సాగు కోసం నీటి పారుదలకు ఉపయోగిస్తున్నారు. దీని వలన ప్రతి సంవత్సరం మూడు పంటల వరకూ సాగు చేయుటకు తోడ్పడుతూ, నీటిని పెట్టడానికి అయ్యే ఖర్చులు తగ్గాయి. అలాగే రాజస్థాన్ లోని సెంట్రల్ ఎరిడ్ జోన్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CAZHI), జోధ్పూర్, 105 కిలోవాట్ సామర్థ్యం గల వ్యవస్థను ప్రయోగించి, ఎడారి ప్రాంతాల్లో నీటి వినియోగాన్ని మెరుగుపరిచింది.

అగ్రివోల్టెయిక్స్ వ్యవసాయం ఎలా పనిచేస్తుంది? అగ్రివోల్టెయిక్స్ అనేది ఒకే భూమిపై వ్యవసాయం మరియు సౌరశక్తిని ఉత్పాదన చేసి భూమిని పూర్తిగా ఉపయోగించుకోవడమే. వ్యవసాయానికి భూములలో సోలార్ ఫలకాలు (ప్యానెలు) నేలపై నేరుగా ఉంచడానికి బదులుగా పంటల లేదా పశువుల పాకల పై తగినంత ఎత్తులో పొలాలకు సూర్యకాంతి మరియు వర్షం చేరేలా వరుసగా అమర్చబడుతాయి. ఈ ఫలకాలు సూర్యరశ్మిని సంగ్రహించుకొని విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎత్తుగా ఉన్న సౌరఫలకాలు రైతులు తమ వ్యవసాయ పరికరాలను సులభంగా క్రిందుగా తరలించుకునే వీలును కూడా కల్పిస్తాయి.

అగ్రివోల్టాయిక్ వ్యవస్థల రకాలు : వ్యవసాయ-సౌర వ్యవస్థల వినియోగాల ఆధారంగా భారత దేశంలో ప్రధానంగా అయిదు రకాలు ఉన్నాయి.

  1. ఎత్తైన సౌర ఫలకాలు (ఎలివేటెడ్ సౌర ప్యానెల్స్) : వ్యవసాయానికి ఉపయోగించే సౌర ఫలకాలు నేలపై నేరుగా ఉంచడానికి బదులుగా సరైన ఎత్తులో పొడవైన నిర్మాణాలపై పెట్టబడతాయి. ఇలా చేయడంతో క్రింద ఉన్న పంటలకు సూర్యకాంతి ప్రసరించడం తో పాటు వ్యవసాయ యంత్రాలు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
  2. పంట వరుసల మధ్య సౌర ఫలకాలు : పంటల వరుసల మధ్య నేలపై ఈ సౌర ఫలకాలు అమర్చబడతాయి. ఇవి పంటలకు కొంత మేరకు నీడనివ్వడం ద్వారా భూమిని మెత్తగా ఉంచడం లో ఉపయోగపడతాయి.
  3. ఫోటోవోల్టాయిక్ హరిత గృహాలు (గ్రీన్హౌసులు) : సౌర ఫలకాలను ను హరిత గృహాల పైకప్పులు లేదా గోడలలో భాగంగా అమరుస్తారు. ఇవి విద్యుత్ను ఉత్పత్తి చేయడమే కాకుండా లోపల ఉన్న మొక్కలకు ఉష్ణోగ్రత మరియు తేమను నియంత్రించడంలో సహాయపడతాయి.
  4. తేలియాడే సౌర ఫలకాలు : వ్యవసాయ భూములకు దగ్గరలో ఉండే నీటి కుంటలు లేదా సాగునీటి చెరువులపై సౌర ప్యానెల్స్, తేలియాడేలా అమర్చుతారు. ఇవి అదనపు భూమిని వినియోగించకుండానే విద్యుత్ ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.
  5. సౌర మేత (గ్రేజింగ్) పద్ధతి : పశువులు స్వేచ్చగా తిరగదగిన మేత భూములపై సౌర ఫలకాలను ఏర్పాటుచేస్తారు. దీనివల్ల జీవాలు తిరుగుటకు, మేత మేయటానికి మరియు సౌర విద్యుత్ ఉత్పత్తిని కలిపి వినియోగించవచ్చు.

పౌర వ్యవసాయ పద్ధతుల వలన కలిగే ప్రయోజనాలు :

రైతులు ఒకే భూమిలో వ్యవసాయ పంటలను పండిస్తూనే సౌర శక్తి వంటి పునరుత్పాదక శక్తిని సృష్టించేందుకు ఉపయోగించడం ద్వారా భూమి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

సోలార్ ఫలకాల వలన పొలాల్లో పాక్షికంగా నీడ ఏర్పడి నేలలో తేమ స్థాయిని స్థిరంగా ఉంచుతాయి, దానితో పాటుగా నీటి బాష్పీభవనాన్ని తగ్గించి ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించి పంటల దిగుబడులు పెంపొందించుటలో తోడ్పడతాయి. ముఖ్యంగా నీరు తక్కువగా లభించే చోట్ల ఇది చాలా ఉపయోగకరం.

రైతుల వ్యవసాయానికి సోలారు పంటలు లేదా నశు పోషణతో మిళితం చేసి ఉత్పత్తితో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

రైతులు విద్యుత్ వినియోగం తగ్గించుకుని తమ వ్యవసాయ పనులకు సౌర శక్తిని ఉపయోగించుకోవచ్చు మరియు మిగిలిన విద్యుత్ను గ్రిడ్ కు  అమ్మి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఉదాహరణకు నీటిపారుదల పంపులు, లైటింగ్, కంచెలు, ఇంకా ఇతర వ్యవసాయ పనుల కోసం అవసరమైన పరికరాలను నడిపించడానికి వ్యవసాయంలో సౌర విద్యుత్ ఉపయోగించడం వలన, ఇంధన ఖర్చులు తగ్గిపోవడంతో పాటు రైతులు డబ్బు కూడా ఆదా చేసుకోగలరు, అలాగే పర్యావరణాన్ని కలుషితం చేయడాన్ని తగ్గించవచ్చు.

ఈ పద్దతి ద్వారా రైతులు పర్యావరణాన్ని కాపాడుకుని పరాగసంపర్కకానికి ఉపయోగపడే తేనెటీగలు సంఖ్యను మెరుగు పరచుకోవచ్చు. దీని వలన జీవ వైవిధ్యం పెరుగుతుంది మరియు పర్యావరణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఈ పద్ధతిలో ఏర్పాటు చేసిన సౌర ఫలకాల క్రింద మేకలు, కోళ్లు వంటి పశువులకు పెంచడం ద్వారా వాటికి నీడ మరియు రక్షణ కల్పించడం తో పాటు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా వ్యవసాయ కూలీలకు నీడను కల్పించడం ద్వారా ఎక్కువ సమయం పనిచేసే సామర్థ్యం ను పెంచుతాయి.

అగ్రివోల్టాయిక్స్ ద్వారా స్వచ్ఛమైన మరియు పునర్వినియోగమయ్యే ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా, జీవ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తుంది. తద్వారా ప్రాంతీయ మరియు జాతీయంగా హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో మరియు వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులను స్థిరీకరించుటలో సహాయపడుతుంది,

గ్రీన్ హౌస్ పై భాగం లేదా బయట ఈ ప్యానల్లు ఏర్పాటు చేయడం వలన గ్రీన్ హౌస్ లో  ఉష్ణోగ్రత మరియు తేమను నియంత్రిస్తాయి, దీని వల్ల వాతావరణ నియంత్రణ కోసం ఖర్చయే విద్యుత్ తగ్గుతుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తో గ్రీన్ హౌస్ కు సరిపడా. ఉపయోగించుకొని ఖర్చులను తగ్గించవచ్చు మరియు స్థిరమైన వ్యవసాయాన్ని సాధించవచ్చు.

పౌర వ్యవసాయానికి ఎదురయ్యే సవాళ్ళు లేదా ప్రతికూలపరిస్థితులు :

  1. భారతదేశంలో సౌర వ్యవసాయానికి ఆశాజనకమైన అవకాశాలు ఉన్నప్పటికీ అనేక సాంకేతిక, ఆర్థిక, వ్యవసాయ మరియు సంబంధిత సంస్థల నుండి సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి, సౌర వ్యవసాయాన్ని విస్తరించడానికి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
  2. సౌర వ్యవసాయానికి కావలసిన ఉన్నత నిర్మాణాలు మరియు వాటి పరికరాలు ఖరీదైనవి. రాయితీలు అమలు చేయని పక్షంలో రైతులకు అధిక ఎత్తులో సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం కష్టతరం అవుతుంది.
  3. సౌర ఫలకాల వల్ల కలిగే నీడ వలన కొన్ని పంటలలో ముఖ్యం గా వరి మరియు గోధుమల వంటి వంటలకు దిగుబడులు తరచుగా తక్కువగా ఉంటాయి.
  4. ఈ సౌర వ్యవసాయం లో సౌరఫలకాలు కదిలించుటకు వీలులేకుండ ఒకే ప్రాంతం లో నిర్మించబడటం వలన పంట కొత సమయములో వ్యవసాయ పనులకు ఆటంకంలా అనిపిస్తాయి.
  5. ఈ సౌరఫలకాల ఆపరేషన్, నిర్వహణ మరియు భద్రత లో పాటించవలసిన నైపుణ్యం మరియు సాంకేతిక పరిజ్ఞానం రైతులు లేకపోవడం వలన సౌర వ్యవసాయం చేస్తున్నప్పుడు సౌర పరికరాలకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. దీని వల్ల రైతు ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులపై ఆధారపడటం వలన అధిక నిర్వహణ ఖర్చులకు దారితీస్తుంది.
  6. సౌర వ్యవసాయాన్ని సరియైన పద్ధతి లో పాటించుటకు జాతీయ స్థాయిలో స్పష్టమైన నియమావళీలు లేకపోవడం అలాగే వ్యవసాయ భూమి రక్షణ చట్టాలు ఈ సౌర వ్యవసాయాన్ని అనుమతికి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం.
  7. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉండే అగ్రివోల్టాయిక్ నమూనాలు అందుబాటులో లేకపోవటం మరియు రైతులకు మరియు అభివృద్ధిదారులకు సరయిన ఆర్థిక ప్రోత్సాహకాలు అందించకపోవడం.

భారతదేశంలో పౌర వ్యవసాయాన్ని (ఆగ్రివోల్టాయిక్) ప్రోత్సహించే పథకాలు మరియు కార్యక్రమాలు : జాతీయ పథకాలు వ్యవసాయంలో సోలారు ప్రోత్సహించడం ద్వారా మరియు పలు భాగస్వామ్యుల మధ్య సహకారాన్ని సాధించడం ద్వారా అగ్రివొల్టాయిక్  ను  ప్రోత్సహిస్తున్నాయి. ఇవి పునరుత్పత్తి శక్తిని పెంచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని మెరుగుపరచగలవు. అవి ముఖ్యంగా

  1. ఇండియా అగ్రివొల్టాయిక్స్ అలయెన్స్ (IAA): నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NSSFI) స్థాపించిన ఇండియా అగ్రివొల్టాయిక్స్ అలయెన్స్ (IA), వ్యవసాయం మరియు సౌర శక్తిని సమన్వయ పరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ప్రభుత్వ సంస్థలు, సోలార్ అభివృద్ధికారులు, రైతులు, ఆర్థిక సంస్థలు వంటి భాగస్వాముల మధ్య సమన్వయం పెంచి భారత దేశ వ్యాప్తంగా ఆగ్రివొల్టాయిక్స్ స్వీకరణకు ప్రోత్సహించే సులువైన విధానాల కోసం చర్యలు చేపడుతోంది.
  2. PM – KUSUM :- (ప్రధాన్ మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఇవం ఉత్తాన్ మహాభియాన్): 2019లో ప్రారంభమైన ఈ పథకం, రైతులు తమ పంటల కోసం సౌర శక్తి తో నడిచే పంపులు మరియు గ్రిడ్ కి కనెక్ట్ అయ్యే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు తోడ్పడుతుంది. ఈ పథకం ద్వారా సోలార్ ఎనర్జీని సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి రైతులకు సబ్సిడీలు అందించడంతో పాటు బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తోంది. అన్నీ రాష్ట్రాలలో ప్రత్యేకమైన అగ్రివోల్టాయిక్ ప్రోగ్రామ్స్ ను ప్రారంభించుటకు ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నాయి.PM-KUSUM పథకం ద్వారా 2014 నుండే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి 3HP నుండి 10HP AC/DC సోలార్ పంపులకు భారీగా 60 – 80% వరకు సబ్సిడీకి (కేంద్ర రాష్ట్రం) అందిస్తుంది.
  3. ప్రధానమంత్రి సౌర కృషి వాహిని యోజన (MSKVY) ఈ పధకం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం 2026 నాటికి వ్యవసాయ ఫీడర్లను 1,600 మెగావాట్ల సౌర శక్తిపైకి మార్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రం ఇప్పటికే 5 లక్షల సౌర పంపులను సంస్థాపించింది. ఇది భారత్లోని ఇతర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. ఈ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్టులకు యూనిట్కు 23.10 నిర్దిష్ట టారిఫ్ను అందిస్తున్నారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL), అమలుకు సౌకర్యం కల్పిస్తోంది.
  4. సూర్యశక్తి కిసాన్ యోజన (SKY)- గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పధకం ద్వారా రైతులకు సౌర ప్యానెళ్లు అమర్చుకోవడానికి సబ్సిడీలు మరియు లోన్లు అందిస్తున్నారు. రైతులు అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రీడ్ కు అమ్మి అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. మొదటి 7 సంవత్సరాలకు ప్రతి యూనిట్కు ₹7, తరువాత 18 సంవత్సరాలకు ప్రతి యూనిట్కు 23.50 ఫీడ్-ఇన్ టారిఫ్ కలిగి ఉంది. వ్యవస్థాపనా ఖర్చులో ప్రభుత్వము 60%ను భరిస్తుంది, మిగతా 40% లోన్ల ద్వారా సమకూర్చాలి.
  5. సూర్య రైతు కార్యక్రమం – కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా సౌరశక్తి ఆధారితంగా నడిచే వ్యవసాయ పంపులను అందించడం పై దృష్టి పెడుతోంది తద్వారా రైతులు గ్రిడ్ విద్యుత్తు మరియు డీజీల్ పై ఆధారపడకుండ చేయవచ్చు. సోలార్ పంప్ సెట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడమే కాక, రైతులు అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్ కు అమ్మేందుకు ప్రోత్సహిస్తుంది.
  6. ముఖ్యమ లీజుకు డౌన్ అ య్ బడోతరి సౌర యోజన- ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా సంబంధిత సంస్థలు రైతుల పొలాలను అక్కడ సౌర ఫలకాలు ఏర్పాటుచేస్తారు, తద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. దీని వలన రైతులకు ప్రతి ఎకరాని ఏ 28,333 స్థిర ఆదాయం వస్తుంది, ప్రతి సంవత్సరం 6% పెరుగుతుంది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయ మార్గాన్ని గించడంతోపాటు, స్వయం శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడంలో దోహదం చేస్తోంది.
  7. ఆంధ్రప్రదేశ్ అగ్రివోల్టాయిక్స్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అగ్రివోల్టాయిక్స్ ప్రారంభిచినది. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NSEFI) స్థానిక, రాష్ట్ర మరియు వ్యవసాయ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని విభిన్న వాతావరణ మండలాలకు అనుగుణంగా అగ్రివోల్టాయిక్ ను అమలు చేయడానికి పని చేస్తోంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం రైతులకు పంట అమ్మకాలతో పాటు సౌర ఆదాయం అందించడమే కాకుండా వాతవరణములో వచ్చే మార్పులు తట్టుకునే సుస్ధిరమైన వ్యవసాయం. ఉదాహరణకు కర్నూలు లో నెలకొల్సిన అల్ట్రా మెగా సోలార్ పార్క్ రాష్ట్ర సామర్థ్యానికి ప్రతీకగా నిలిచి. సమీకృత వ్యవసాయానికి పునాది వేస్తోంది.

తెలంగాణాలో అగ్రివోల్టాయిక్స్ తెలంగాణ ప్రభుత్వం PM-KUSUM పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు తమ భూమిపై 500 కిలో వాట్ లనుంచి 2 మెగా వాట్ ల వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది.తద్వారా వ్యవసాయ మరియు సౌర శక్తి ఉత్పత్తి కలిసివచ్చేలా సహాయపడుతోంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ రిన్యూవబుల్ఎనర్జీ డెవలప్మెంట్  కార్పొరేషన్ లిమిటెడ్ (TGREDCO) పర్యవేక్షిస్తూ, రాష్ట్ర స్థాయి వ్యవసాయ కార్యక్రమాలతో చేస్తుంది. అలాగే ఇండియా అగ్రివోల్టాయిక్స్ అలయన్స్ (IAA) కూడా తెలంగాణాలో పైలట్ ప్రాజెక్టులను రూపొందించడంపై పనిచేస్తోంది.

డా. పి. వి. రమేష్ బాబు, డా. బి. సహదేవ రెడ్డి, డా. సి. హెచ్. శ్రీనివాస్, డా. యం. వి. కృష్ణాజి, సి. హెచ్. అప్పారావు, మరియు డా.టి.శ్రీనివాస్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,మారుటేరు, ప.గోదావరి జిల్లా, ఫోన్ : 9866787072

Leave Your Comments

మిరప కోతలు మరియు కోతల అనంతర పరిజ్ఞానం

Previous article

ఆత్మ నిర్భర పప్పు ధాన్యాల ఉత్పత్తి భారతదేశానికి సాధ్యమయ్యేనా!

Next article

You may also like