మల్లె మొక్కలు మంచి పరిమళంతోపాటు ఆకర్షణీయమైన పువ్వులను అందిస్తాయి. కానీ ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి, పెరుగుదలకు మరియు పువ్వుల సమృద్ధి కోసం సరైన పద్ధతిలో మల్లె మొక్కలను కత్తిరించడం (ప్రూనింగ్ చేయడం) చాలా ముఖ్యం. మల్లె మొక్కలను కత్తిరించడంలో కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి.
సరైన సమయాన్ని ఎంచుకోవడం :
శీతాకాలం చివరలో లేదా వసంత ఋతువు ప్రారంభంలో మల్లె మొక్కలను కత్తిరిస్తారు. ఈ సమయంలో మొక్కలు నిర్జీవంగా ఉంటాయి, అందువల్ల కొమ్మ కత్తిరింపులు ఈ సమయంలో చేసినట్లయితే మొక్క ఆరోగ్యం మెరుగుపడి, కొత్త కొమ్మలు త్వరగా పెరుగుతాయి మరియు పూల సమృద్ధి అధికంగా ఉంటుంది, అలాగే, పువ్వుల పరిమాణం మరియు నాణ్యత కూడా బాగా పెరుగుతాయి.
పరికరాలు శుభ్రంగా ఉంచడం :
కత్తిరించడానికి ఉపయోగించే పరికరాలను అనగా ప్రూనర్స్ లేదా సికేచర్స్ లేదా కత్తులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రంగా ఉన్న పరికరాల వల్ల మొక్కలకు ఎక్కువ గాయాలు కాకుండా మరియు గాయాల వల్ల సంక్రమించే వ్యాధులను నివారించవచ్చు.
కత్తిరింపు యొక్క కోణం( %aఅస్త్రశ్రీవ):
కొమ్మలను 450 డిగ్రీల కోణంలో కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్క, వేరు కుళ్ళిపోకుండా మరియు నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది.
దృఢమైన పెరుగుదలకు ప్రోత్సాహం :
చనిపోయిన కొమ్మలను, బలహీనమైన కొమ్మలను, అనారోగ్యకరమైన కొమ్మలను తొలగించడం ద్వారా, మొక్క యొక్క మిగిలిన భాగాలకు శక్తి, మరియు పోషకాలు అంది మొక్క దృఢంగా పెరగడానికి తోడ్పడుతుంది.
ఛాంద్రమాన పద్ధతులు పాటించడం :
పలు రైతులు చంద్రుని దశల ఆధారంగా కత్తిరింపులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా విస్తారమైన పువ్వుల ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.
నేల నుండి మొక్క యొక్క కొమ్మల కత్తిరింపుల దూరం:
ప్రతి కొమ్మను నేల నుండి 6-12 అంగుళాల ఎత్తులో కత్తిరించాలి. ఈ దూరంలో కొమ్మలు కత్తిరించినట్లయితే కొత్త కొమ్మలు బాగా చిగురిస్తాయి.
అతిగా కత్తిరించకూడదు :
ఒకేసారి మొక్కలో ఎక్కువ భాగాన్ని తొలగించడం వల్ల పువ్వుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, ప్రతి సీజన్లో 25-30% కొమ్మలను మాత్రమే తొలగించాలి.
ఎరువుల వినియోగం :
కత్తిరింపు తరువాత సేంద్రియ ఎరువులను సరైన విధంగా మొక్కకు అందించడం వల్ల, కొత్త కొమ్మల పెరుగుదల కోసం అవసరమైన పోషకాలను ఈ ఉపయోగించిన ఎరువులు అందిస్తాయి.
నీటిపారుదల :
కత్తిరించిన తరువాత మొక్కకు మంచిగా నీరు పెట్టడం అవసరం. ఇది పువ్వుల సమృద్ధికి దోహదపడుతుంది.
వ్యాధుల నియంత్రణ :
కత్తిరింపు చేసిన తర్వాత, కత్తిరించిన ప్రదేశాలను నీటితో శుభ్రం చేయాలి, అవసరమైతే క్రిమినాశక మందులను కూడా పిచికారీ చేయాలి లేదా కత్తిరించిన ప్రదేశంలో క్రిమినషిక మందులను పూయాలి.
మల్లె మొక్కల యొక్క కొమ్మలను కత్తిరించిన తర్వాత తగినంత నీరు మొక్కకు మంచిగా సరఫరా అయ్యేలా చూసుకోవాలి, లేదంటే మొక్కల పెరుగుదల మరియు పువ్వుల సమృద్ధి పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దానికోసం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను పాటించాలి.
తక్షణ నీటిపోషణ :
కత్తిరింపుల తర్వాత వెంటనే నీటిని సమృద్ధిగా ఇవ్వాలి : కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్క యొక్క కొన్ని భాగాలను తొలగించాల్సి వస్తుంది. అందుకే ఈ సమయంలో తేమ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్త కొమ్మలు త్వరగా ఏర్పడతాయి. అలాగే, నేల తడిగా కానీ, నీరు నేలపై నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
నీటి యొక్కపరిమాణం :
కొంచెం తక్కువ నీరు ఇవ్వాలి. మొక్క యొక్క కొమ్మలు కత్తిరించడం వల్ల, ఆకుల ద్వారా తేమ ఆవిరి కావడం తగ్గుతుంది, అందువల్ల మొక్కకు నీటి అవసరం ఎక్కువగా ఉండదు. అధిక నీరు ఇవ్వడం వలన వేరుల కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నేల తగినంత తడిగా ఉండేలా చూసుకోవాలి
నీటి పర్యవేక్షణ :
మట్టిని పరిశీలించి ఒక వేలిని నేలలో 2-3 అంగుళాల లోతు వరకు పెట్టి తడిగా ఉందా, ఎండిపోయిందా అని పరిశీలించాలి. నేల ఎండిపోయినట్టు గా అనిపిస్తే మాత్రమే నీరు పోయాలి
మొక్కకు నీరు సమయానికి అందించాలి :
మొక్క నుండి కొత్త చిగురు లేదా మొగ్గలు వచ్చే సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది ఈ దశలో మొక్కలకు తగిన తేమ అవసరం అవుతుంది, అందుకే నేలలో తగినంత నీరు పారుదల ఉండేలా చూసుకోవాలి
నీటితో పాటు మల్చింగ్ ప్రక్రియ :
మల్చింగ్ చేయడం ద్వారా మట్టిలో తేమ నిల్వ ఉండటమే కాకుండా, ఋతుపవనాల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
అందుకే కత్తిరింపుల తర్వాత మొక్క చుట్టూ ఆకులను ఉపయోగించి మల్చింగ్ చేయాలి. దానివల్ల తరచుగా నీరు పోయాల్సిన అవసరం కూడాఉండదు..
బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) :
సమర్థవంతమైన మొక్కకు నీరు అందించడం కోసం బిందు సేద్యం పద్ధతిని అనుసరించాలి. ఇది మొక్కకు అవసరమైన నీటిని మాత్రమే అందిస్తుంది.
వరదలు లేదా నేల ఎండిపోవడం లాంటివి నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి .
కత్తిరింపుల తర్వాత అధికంగా నీరు ఇవ్వడం వల్ల మొక్కలు దెబ్బతింటాయి, కాబట్టి నీటి మోతాదును జాగ్రత్తగా నియంత్రించాలి. అదే సమయంలో, నేల పూర్తిగా ఎండిపోకుండా చూసుకోవడం అవసరం. నేలలో తగినంత తేమ ఉంటే, కొత్త మొగ్గల వృద్ధి మెరుగ్గా జరుగుతుంది.
ఈ విధంగా సరైన పద్ధతిలో మల్లె మొక్కల యొక్క కత్తిరింపులు సరైన సమయంలో చేస్తూ, అలాగే నీటిని సమర్థంగా మొక్కకు వినియోగించడం ద్వారా మొక్క ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది మరియు మంచి పూలను సమృద్ధిగా ఇస్తూ రైతులకు మంచి దిగుబడిని అందిస్తుంది
మల్లె తోటలో బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) పద్ధతి ద్వారా మొక్కకు నీరు అందిస్తున్నారు
సి.ఎన్.ఆర్. సంతోషిని, అసిస్టెంట్ ప్రొఫెసర్,
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్,
ఉద్యాన కళాశాల, రాజేంద్రనగర్, ఎస్ కే ఎల్ టి జి హెచ్ యు.