- పార్లమెంట్ లో కేంద్రమంత్రులు జెపి నడ్డా మరియు నిర్మలా సీతారామన్ కలిసిన మంత్రి తుమ్మల
- ఆగస్టు నెల కేటాయింపులు మరియు ఎప్రిల్ నుండి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ నెల కేటాయింపులతో పాటే కలిపి వెంటనే సరఫరా చేయాలని జెపి నడ్డా గారిని కోరిన మంత్రి తుమ్మల
- అదేవిధంగా క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని నిర్మలా సీతారామన్ గారిని కోరిన మంత్రి తుమ్మల
బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈ రోజు ధర్నాకు హాజరైన మంత్రి తుమ్మల గారు, పార్లమెంట్ లో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని కోరడం జరిగింది. ఎప్రిల్ నుండి ఇప్పటి వరకు యూరియా సరఫరాలో ఏర్పడిన లోటును కూడా ఆగస్టు నెల కేటాయింపులతో పాటే సరఫరా చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరాలో ఆలస్యం తలెత్తితే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నడ్డాగారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని.. కేటాయించిన యూరియాను తక్షణమే సరఫరా చేయాలన్నారు. ఎప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ యూరియాను కూడా ఆగస్టు నెల కేటాయింపులతో పాటే వెంటనే సరఫరా చేయాలని అన్నారు.
అదేవిధంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి, క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని మార్చి 2018 లో ఉన్నట్టుగా 44 శాతానికి పెంచాలని కోరడం జరిగింది. క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుండి 16.5 శాతం తగ్గించడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గడంతో పాటు , ఇది ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహకానికి అడ్డంకిగా మారనుందని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లారు. ఇంతకుముందుకే దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుండి 44 శాతానికి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభ్యర్థించినట్టు గుర్తుచేశారు. ప్రస్తుతం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రాలు, రైతులకు తగిన ప్రోత్సహకాలు కల్పిస్తూ, ఈ పంట సాగు పెంపుపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై మరోసారి పునః సమీక్షించాలని మంత్రిగారు కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకమైన NMEO-OP పథకంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ప్లాంటేషన్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకోసం చేస్తున్న కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని క్రూడ్ పామాయిల్ పై తగ్గించిన దిగుమతి సుంకాన్ని తిరిగి మరల 44 శాతానికి పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కోరారు. మంత్రిగారి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు.
Leave Your Comments


























