వార్తలు

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ

0
Telangana Weather Report : తేది 12.06.2024 (బుధవారం) నుంచి 16.06.2024 (అదివారం) వరకు
గ్రామీణ కృషి మౌసమ్ సేవ పథకం భారత వాతావరణ శాఖ, న్యూఢిల్లీ వారి
సహకారంతో వాతావరణ సలహాలను రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వాతావరణ విభాగం అందించింది. ఆ వివరాలు ……
రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ (జూన్ 11  మధ్యాహ్నం 1  గంట ఆధారంగా):
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం  రెండు రోజులలో (11   జూన్  మధ్యాహ్నం 1   గంట నుండి 13 జూన్  ఉదయం 8.30 గంటల వరకు) రాష్ట్రంలో చాలా చోట్ల తెలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. తరువాత మూడు రోజులలో (13.06.2024 ఉదయం 08 .30 గంటల నుండి 16.06.2024 ఉదయం 08 .30 గంటల వరకు) రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు. వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
మొదటి రోజు:
రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్,  మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వురుములు, మెరుపులు, ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి. మీ)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
రెండవ రోజు:
రాష్ట్రంలోని నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట,యదాద్రి భువనగిరి, రంగారెడ్డి,హైదరాబాద్,మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు,ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మూడవ రోజు:
రాష్ట్రంలోని ఆదిలాబాద్,కొమరంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్,  నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసి సూచనలున్నాయి.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:
  • నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి జూన్ 3వ తేదీన ప్రవేశించాయి.
  • నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోనికి ప్రవేశించిన తరువాత తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15-20 సెం.మీ. లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు,మొక్కజొన్న,జొన్న,కంది,పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి.
  • ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు,చెరువులు,నీటి కుంటలకు దూరంగా ఉండాలి.
  • రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు,గొర్రెలు,మేకలను చెట్ల కింద ఉంచరాదు.
  • కొత్త పండ్ల తోటలు పెట్టడానికి గుంతలు తవ్వుకోవాలి.
  • వేరుశనగ, సోయాచిక్కుడు,జొన్న,పెసర,కంది,మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
వరి:
  • నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల (140-145 రోజులు) నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.
  • వరిలో 3 గ్రా. కార్బండాజిమ్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
  • రైతులు తెలంగాణ సోనా (RNR 15048) వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు.
  • వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది.
  • వరి మొక్కలను పోలిన ఊద, ఒడిపిలి గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు 7.5మి.లీ. సైహలోఫాప్- పి- బ్యూటైల్ మందును 5  లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వయస్సు గల వరి నారుమడిలో పిచికారి చేయాలి.
పత్తి:
  • పత్తి పంటను జులై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు.
  • పత్తి వర్షాధార పంట గనుక రైతులు వారికి అనుకూలమైన బి.టి రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి.ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఈ కాలువలు  నీటిని తీసివేయటానికి  అనుకూలంగా ఉంటాయి.
మొక్కజొన్న:
  • మొక్కజొన్న పంటను జులై 15వ తేదీ వరకు మధ్య, దీర్ఘకాలిక (90-100 రోజులు, 100-120 రోజులు) రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకునేందుకు అనుకూల సమయం.
  • మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి.
  • పంటను విత్తిన 15 రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి.
జొన్న:
  • జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
  • జొన్నని ఏకపంటగా లేదా కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
కంది:
  • కంది పంటను జులై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు.
  • కందిని ఏకపంటగా లేదా పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, పెసలు,మినుములతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
 పెసర,మినుము:
  •  పెసర, మినుము పంటను జులై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
  • పెసర, మినుమును ఎకపంటగా లేదా పత్తి ,కందితే అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
  • వరి సాగు చేసే పొలాల్లో, అలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేదా పచ్చి రొట్టగా విత్తుకోవాలి.
సోయాచిక్కుడు:
  • సొయాచిక్కుడు పంటను జులై మొదటి వారం వరకు విత్తుకునేందుకు అనుకూల సమయం.
  • నీటి వసతి గల తేలికపాటి నేలలు కూడా సోయాచిక్కుడు సాగుకు అనుకూలం.
  • ఎత్తు మడులు, కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే విత్తన మోతాదు తగ్గటంతోపాటు సరైన సాంద్రతలో మొక్కలు ఉండి, సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి.
ఈ పద్ధతిలో భూమిలో ఎకువ తేమ నిలువ ఉండి పంట నీటి ఏద్దడిని తట్టుకుంటుంది. అదేవిధంగా ఎక్కువ నీటిని పొలం నుంచి తీసివేయటానికి కాలువలు ఉపయోగపడతాయి.
డా. పి.లీలా రాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ),
      వ్యవసాయ వాతావరణ విభాగం, రాజేంద్రనగర్
Leave Your Comments

PJTSAUలో జూన్ 10వ తేదీన ఆరవ స్నాతకోత్సవ వేడుకలు

Previous article

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 నుండి 14 వరకు వాతావరణం ఎలా ఉండబోతుంది ?

Next article

You may also like