ఆంధ్రప్రదేశ్ఈ నెల పంటచీడపీడల యాజమాన్యంవ్యవసాయ పంటలు

మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు – యాజమాన్యం

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినుము పంట చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ పంట 3.07 లక్షల హెక్టార్లలో సాగవుతూ, 3.45 లక్షల టన్నుల ఉత్పత్తిని అందిస్తుంది. మినుము పైరును రబీలో ఎక్కువగా మాగాణులలో వరి తరువాత సాగు చేయడం జరుగుతుంది. ఇటీవల చేసిన పలు క్షేత్ర సందర్శనలలో వరి మాగాణుల్లో సాగుచేస్తున్న మినుము పంటలో అధికంగా వేరు కుళ్ళు మరియు కాండపు గజ్జి తెగుళ్ళు, కోస్తాలో తేలికపాటి నేలల్లో వడలు తెగులు గమనించడమైనది. వేరు కుళ్ళు మరియు కాండపు గజ్జి తెగుళ్ళు ఆశించడానికి అధిక విత్తన మోతాదు, విత్తన శుద్ధి చేయకపోవటం మరియు పంట మార్పిడి పాటించక పోవటంతో పాటు, వరి మాగాణులలో అధిక తేమ, భూమిలో సేంద్రీయ పదార్థము తగ్గి మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులు తక్కువ కావటం అనేవి కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు.

వేరు కుళ్ళు :- వేరు కుళ్ళు వరి మాగాణులలో తొలి దశలలో (15-20 రోజులకే) ఆశించి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. తెగులు ఆశించిన మొక్కల ఆకులు పసుపు నుండి గోధుమ రంగుకి మారి క్రమేపి ఎండిపోతాయి. వేరుకుళ్ళు తెగులు సోకిన మొక్కల వేర్లు, కాండం మొదటి భాగం గోధుమ రంగుకి మారి కుళ్ళిపోతాయి. అధికముగా తేమ ఉన్న పొలాల్లో కుళ్ళిన వేరు బాగాలపైన తెల్లని బూజు ఏర్పడుతుంది.

కాండం గజ్జి తెగులు :-  కాండం గజ్జి తెగులు లక్షణాలను ముఖ్యంగా వరి మాగాణులలో నాలుగు వారాల పంట వయస్సు నుంచి చివరి వరకు గమనించవచ్చు. తెగులు లక్షణాలు కాండపు మొదటి భాగములో ఉబ్బెత్తుగానున్న తెల్లటి బొబ్బలుగా ఏర్పడి, క్రమేపి పెరిగి గోధుమ రంగులో గజ్జిలాగా మారి కాండము పొడుగునా పైకి వ్యాప్తి చెందుతాయి. ఈ తెగులు సోకిన మొక్కలు పొలములో గుంపులు గుంపులుగా చనిపోతాయి.

ఎండు/వడలు తెగులు :- వడలు తెగులు ఎక్కువగా పూత సమయంలో తేలిక పాటి నేలల్లో ఆశించి నష్ట పరుస్తుంది. ఈ తెగులు ఆశించడం వలన వేర్లు, కాండం మొదటి భాగం ముదురు గోధుమ రంగుకి మారి పీకినప్పుడు తేలికగా ఊడి వస్తాయి. మొక్కలు గుంపులుగా చనిపోతాయి. తెగులు ఆశించిన మొక్కల తల్లి వేరును మరియు కాండాన్ని నిలువుగా చీల్చి చూస్తే మధ్యలో దారు కణజాలంలో గోధుమ రంగు చారలు గమనించవచ్చు.

నేల ద్వారా సంక్రమించే ఈ మూడు రకాల తెగుళ్లను సమగ్ర యాజమాన్య పద్దతుల ద్వారా నియంత్రించుకోవాలి

  1. వేసవి కాలములో లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా భూమిలోని శిలీంధ్ర బీజాలు నాశనం చేయబడతాయి.
  2. అవకాశం ఉన్న చోట తప్పనిసరిగా మూడు పంటలకు ఒకసారి పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి.
  3. పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులను భూమిలో వేసి కలియదున్నాలి.
  4. తూటికాడ మినుము, బుట్ట మినుము రకాలు కొంతవరకు కాండపు గజ్జి తెగులును కొంతవరకు ఎండు/వడలు తెగులును తట్టుకుంటాయి.
  5. సరైన విత్తన మోతాదును అవలంబించడం ద్వారా మొక్కకు, మొక్కకు సరైన గాలి మరియు వెలుతురు అందడం వలన తెగులు ఉధృతిని కొంత వరకు తగ్గించవచ్చు.
  6. కిలో విత్తనానికి మాంకోజెబ్ 3 గ్రా. లేదా కార్బండాజిం 3 గ్రా. లేదా ట్రైకోడెర్మావిరిడి 10 గ్రా. కలిపి విత్తన శుద్ధిచేయాలి. విత్తన శుద్ధి చేయటం ద్వారా మొక్కలను 20-25 రోజుల వరకు విత్తనం మరియు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నుండి రక్షించవచ్చును. 2 కేజీల ట్రైకోడెర్మా విరిడిని 90 కేజీల మాగిన పశువుల ఎరువు మరియు 10 కేజీల వేపపిండితో కలిపి 15 రోజులు అభివృద్ధి పరిచి విత్తుకునేటప్పుడు తగినంత తేమ ఉన్నప్పుడు నేలలో కలియ పెట్టవలెను.
  7. కాండపు గజ్జి తెగులు తరచుగా ఆశించే ప్రాంతాలలో కార్బండాజిమ్ + మాంకోజెబ్ మందు మిశ్రమాన్ని 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పంట విత్తిన 20 మరియు 40 రోజులకు ఒకసారి మొదళ్ళు తడిచేలా పిచికారీ చేసి కొంత వరకు తగ్గించవచ్చునని ప్రాధమిక పరిశోధనలో తేలింది.
  8. వేరుకుళ్ళు ఆశించిన పొలాల్లో మొక్కలు ఎక్కువగా చనిపోయే ప్రదేశాలలో కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లను తడపడం వలన తెగులు వ్యాప్తిని కొంతవరకు నివారించవచ్చు.

డా. కె. ఫణి కుమార్, ప్రధాన శాస్త్రవేత్త (కీటక శాస్త్రం), డా.ఎన్. నాగేంద్ర బాబు, శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం),ఏరువాక కేంద్రం, ఏలూరు, ఫోన్ : 94941 33633

మినుము పంటలో మరిన్ని విషయాల గురించి ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు – 9989623804, 9849817637, 9494133633

 

Leave Your Comments

ప్రకృతి వ్యవసాయం లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలి

Previous article

You may also like