మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

కురుస్తున్న వర్షాలకు వివిధ పంటల్లో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?

0

వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:

  • భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి మురుగు నీటిని తీసివేయాలి.
    వరి:
  • నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నారు నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాల్లో, 50రోజుల వయస్సు ఉన్నముదురు నారు నాటాల్సివస్తే ఆకు చివరలను తుంచివేసి కుదురుకు 5 నుంచి 6 మొక్కల చొప్పున నాటువేయాలి.
  • ఇప్పటివరకు నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగం చేసుకొని పొలాలను దమ్ముచేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వల్ల సమయం,పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు.
  • నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక (120-125 రోజుల) వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.
  • 25 రోజుల వయస్సు ఉన్న మధ్యకాలిక, 21 రోజుల వయస్సు ఉన్న స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి.
  • వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15-20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చు.
  • నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయటం వల్ల గాలి వెలుతురూ బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు.అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది.
  • ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లి కోడును నివారించుకోవచ్చు.
  • వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది.
    పత్తి:
  • ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకొని వర్షాధార పత్తి పంటలో మొదటి దఫా,  రెండవ దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20, 40 రోజుల దశలో అందించాలి.
  • ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వల్ల పత్తిలో వడలు తెగులు ఆశించే వీలుంటుంది. దీని నివారణకు వడలు తెగులు సోకిన మొక్కల మొదళ్ళు తడిచేలా లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. అలాగే పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన మల్టీ- కె (13:0:45) లేదా 10 గ్రా. యూరియా చొప్పున లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు  పంటపై పిచికారి చేయాలి.
    మొక్కజొన్న:
  • అధిక వర్షాల వల్ల పంట పసుపు రంగుకు మారుతుంది కావున నీటిని మురుగు కాలువల ద్వారా బయటికి తీసివేయాలి. మొక్కజొన్న పంటను జులై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకోవచ్చు.
  • మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి.
  • ముందుగా వేసుకున్న వర్షాధార మొక్కజొన్న పంటలో ఆఖరి అంతర కృషి తరువాత గోడ్డుచాలు వేసుకున్నట్లయితే తేమ సంరక్షింపబడి పంటకు ఎక్కువ కాలం తేమ లభిస్తుంది.
  • రెండవ దఫా 1/3 వంతు పైపాటు నత్రజని పైరు మోకాలి ఎత్తు దశలో నెలలో తేమ ఉన్నప్పుడు అందించాలి.
    కంది:
    ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వల్ల కంది పంటలో ఇనుప ధాతు లోపం రావచ్చు. దీని నివారణకు పోలంనుంచి మురుగు నీటిని తీసివేసి 2-5గ్రా. అన్నభేదితో పాటు 1గ్రా. నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు వర్షం తగ్గిన తర్వాత పిచికారి చేయాలి.
    సోయాచిక్కుడు:
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో వేరుకుళ్ళు తెగులు రావటానికి అనుకూలం. తెగులు గమనిస్తే నివారణకు 3 గ్రా.చొప్పున కాపర్ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి.
  • ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వల్ల పంటలో అంతరకృషి చేయడం వీలుకాని చోట 250 మి.లీ. ఇమాజితాపిర్ 10% SL లేదా 40గ్రా. ఇమాజితాపిర్ + ఇమాజమాక్స్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి గడ్డి, వేడల్పాకు కలుపు జాతి మొక్కలను నివారించాలి.
    వేరుశనగ:
    ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వల్ల వేరుశనగ పంటలో ఇనుప ధాతు లోపం రావొచ్చు. దీని  నివారణకు పోలంనుంచి మురుగు నీటిని తీసివేసి 2- 5గ్రా. అన్నభేదితో పాటు 1గ్రా. నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు వర్షం తగ్గిన తర్వాత పిచికారి చేయాలి.
    కూరగాయలు:
  • అదిక వర్షాల వల్ల కూరగాయ నారుమడుల్లో నారుకుళ్ళు తెగులు రావడానికి అనుకూలం. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రా. చొప్పున కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి.
  • ముంపుకు గురైయ్యే ప్రాంతాల్లో ప్రతీ 25 మీటర్లకు ఊటకాలువలు ఏర్పాటు చేసుకొని తోటలో నీరు నిలువకుండా మురుగు నీటి కాలువల ద్వారా నీటిని తీసివేయాలి.
    పశుపోషణ:
    ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుకు, పి. పి. ఆర్.వ్యాధులు,
    ఆవులు, గేదేల్లో గొంతువాపు వ్యాధి సోకటానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయాలి.
Leave Your Comments

వర్షాలకు దెబ్బతిన్న కూరగాయ పంటల్లో ఈ జాగ్రత్తలు పాటించండి !

Previous article

109 నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి 

Next article

You may also like