తెలంగాణమన వ్యవసాయంవార్తలు

జూన్ 22-26 తేదీల వరకు వాతావరణ విశ్లేషణ

0
Telangana Weather Report : రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ (ఈరోజు మధ్యాహ్నం 1300 గంటల ఆధారంగా):
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజులలో జూన్ 22 (శనివారం) నుంచి జూన్ 26 (బుధ వారం) వరకు తెలంగాణా రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన  తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.ఉత్తర తెలంగాణలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు పడొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
Read More : https://eruvaaka.com/successful-farmers/weather-forecasting-for-the-farmer/
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి జూన్ 3వ తేదీన ప్రవేశించి జూస్ 12వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి.ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. రైతులు చెట్ల కింద నిలబడరాదు.పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు నేలలో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15-20 సెం.మీ. లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
వరి:
నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక (130-135 రోజుల) లేదా స్వల్పకాలిక (120- 125 రోజుల) వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3-జి గుళికలను ఇసుకలో కలిపి చల్లితే ప్రధాన పొలంలో పంటను 15-20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. రైతులు తెలంగాణ సోన (RNR 15048) వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది. వరి మొక్కలను పోలిన ఊద, వడిపిలి గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు 7.5మి.లీ. సైహలోఫాప్ పి-బ్యుటైల్ మందును 5 లీటర్ల నీటిలో కలిపి 15రోజుల వయస్సు గల వరి నారుమడిలో పిచికారి చేయాలి.
పత్తి:
పత్తి పంటను జులై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కావున రైతులు వారికి అనుకూలమైన బిటి రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఈ కాలువలు  నీటిని తీసివేసేందుకు అనుకూలంగా ఉంటాయి. పత్తి పంట విత్తిన 2 వారాల తర్వాత ముందు జాగ్రత్తలో భాగంగా రసం పీల్చే పురుగుల నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి.
మొక్కజొన్న:
మొక్కజొన్న పంటను జులై 15వ తేదీ వరకు మధ్య మరియు దీర్ఘకాలిక (90-100 రోజులు మరియు 100-120 రోజులు) రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకునేందుకు అనుకూల సమయం. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. పంటను విత్తిన 15రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. నత్రజని ఎరవుని 1/3వ వంతు, మొత్తం బస్వారం, సగం పొటాష్ నిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి.
జొన్న:
జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. దీనిని ఎకపంటగా లేదా కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
ఆముదం: ఆముదం పంటను జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
కంది:
కంది పంటను జులై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. కందిని ఎకపంటగా లేదా పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, పెసలు,  మినుములతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కంది పంటను విత్తే ముందు విత్తనాని 2.5గ్రా. కాప్టాన్ లేదా 3గ్రా. థైరామ్ మరియు 10గ్రా. ట్రైకోడర్మా విరిడె మందుతో కిలో విత్తనానికి కలిపి విత్తుకున్నట్లయితే విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే శీలీంద్రాల నుంచి పంటను కాపాడవచ్చు.
పెసర,  మినుము:
పెసర, మినుము పంటను జులై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. వీటిని ఎకపంటగా లేదా పత్తి, కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. వరి సాగు చేసే పొలాల్లో, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేదా పచ్చి రొట్టగా విత్తుకోవాలి. పెసర, మినుము పంట విత్తిన 2 వారాల తర్వాత ముందు జాగ్రత్తలో భాగంగా రసం పీల్చే పురుగుల నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి.
సోయాచిక్కుడు:
సోయాచిక్కుడు పంట జులై మొదటి వారం వరకు విత్తుకునేందుకు  అనుకూల సమయం. నీటి వసతి గల తేలికపాటి నేలల్లో కూడా సాగుకు అనుకూలం. ఎత్తు మడులు, కాలువల పద్ధతిలో (Broad Bed and Furrow – BBF)  విత్తుకున్నట్లయితే విత్తన మోతాదు తగ్గటంతోపాటు సరైన సాంద్రతలో మొక్కలు ఉండి, సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి. ఈ పద్ధతిలో భూమిలో ఎక్కువ తేమ నిలువ ఉండి పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అదేవిధంగా ఎక్కువైన నీటిని పొలం నుంచి తీసివేయటానికి కాలువలు ఉపయోగపడతాయి. సోయాచిక్కుడు పంట విత్తిన 2 వారాల తర్వాత, కాండం తొలిచే ఈగ, తెల్లదోమను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 తెలుపు జిగురు అట్టలను అమర్చాలి. ముందస్తు నివారణ చర్యలలో భాగంగా సోయాచిక్కుడులో స్టెమ్ గిర్జర్ ను నివారించడానికి 1500 పి. పి. ఎం. వేపనూనె  (5 మీ.లీ./  లీటరు నీటిలో కలిపి) పిచికారీ చేసుకోవాలి
Cabinet okays hike in sugarcane FRP by Rs 25 to Rs 340 a quintal in sweet  deal for farmers - BusinessToday
చెరకు:
తోట వయస్సు నాలుగు నెలలప్పుడు (జూన్ -జులై మాసాల్లో) మొక్కల వరుసల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు.
కూరగాయలు:
కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లైతే నివారణకు 1500 పి. పి. ఎం. వేపనూనె ( 5 మీ.లీ. /లీటరు నీటికి కలిపి) పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో  ఆకుమచ్చ తెగులు సోకే అవకాశముంటుంది. ఈ తెగులు నివారణకు 1 గ్రా. కార్బెండజిమ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
బత్తాయి,నిమ్మ:
కొత్తగా తోటలు పెట్టె రైతులు 60 సెం. మీ. పొడవు, వెడల్పు, లోతు గల గుంతలు తీసి, దానిలో 5కిలోల పశువుల ఎరువు, కిలో సింగిల్ సూపర్ పాస్ఫేట్, 100గ్రా. క్లోరిపైరిఫాస్ పొడి మందులను పై మట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలు నాటుకోవాలి.
గజ్జి తెగులు (సిట్రస్ క్యాంకర్)ను  నియంత్రించడానికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మరియు 30 గ్రాములు కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందుని 10 లీటర్ల నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి.
మామిడి:
రైతులు కోత అనంతరం 2-4 వారాల తరువాత ఎండు కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించినట్లయితే గాలి, వెలుతురు మొక్కకు బాగా లబిస్తుంది. పోయిన సంవత్సరం వచ్చిన పూత కాడలను వెనుకకు కత్తిరించుకొని 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తోటలో రాలిపోయిన, కుళ్ళిపోయిన, తెగుళ్ళు ఆశించిన కాయలతో పాటు ఎండుఆకులను,  కొమ్మలను సేకరించి తోటలకు దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి.డా. పి.లీలా రాణి,ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ ) ,
వ్యవసాయ వాతావరణ విభాగం ,రాజేంద్రనగర్

Leave Your Comments

సోయాపాలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా ?

Previous article

జూన్ 26 నుంచి జూన్ 30 వరకు తెలంగాణాలో సాగుదార్లకు సూచనలు

Next article

You may also like

Share via
Access e-magazine
మల్లె సాగులో మెళుకువలు.! టమాట సాగుకు అనువైన రకాలు Turmeric Health Benefits in Telugu