ఆంధ్రప్రదేశ్నేలల పరిరక్షణవ్యవసాయ పంటలుసేంద్రియ వ్యవసాయం

సాగు భూములలో సేంద్రీయ కర్బనం యొక్క ప్రాముఖ్యత-యాజమాన్యం

0

మన నేలలే మన భవిత సారమున్న భూములే ప్రగతికి పునాది. ఉభయ తెలుగు రాష్ట్రాల  ఆహారభద్రత గ్రామీణ ఉపాధి. సామాజిక స్థిరత్వం సమగ్ర అభివృద్ధి సైతం వ్యవసాయ అనుభంద రంగాలతోనే ముడిపడి ఉన్నది. భూముల్లో సేంద్రియ కర్బనస్తాయి 1951 లో 4 శాతముగా ఉంటే ఇప్పుడు అత్యల్ప స్థాయిలో 0.4 శాతానికి పడిపోయింది. మొక్కల పెరుగుదల మరియు నేల ఆరోగ్యానికి సేంద్రీయ పదార్థం చాలా ముఖ్యమైనది.

సేంద్రీయ పదార్థం నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి నేల నిర్మాణం మరియు గాలి ప్రసరణ పోషకాల సరఫరా మరియు సూక్ష్మజీవుల ఆవాసానికి తోడ్పడుతుంది. నేల సేంద్రీయ కర్బనాన్ని నిల్వ చేయడం ద్వారా గ్రీన్హౌస్ వాయువుల విడుదలను తగ్గిస్తుంది. ఇది వాతావరణ సమతుల్యతకు సహాయపడుతుంది. ఈ కారణాల వల్ల ఆరోగ్యకరమైన నేల మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు సేంద్రీయ పదార్థం చాలా కీలకం.

సేంద్రీయ ఎరువులు మరియు పచ్చిరొట్ట ఎరువుల వాడకం ద్వారా నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచవచ్చు. భోపాల్‌లోని ఐసిఎఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సమన్వయంతో 2017-2023 లో నిర్వహించిన ఒక  అధ్యయనంలో  భారతదేశంలోని  29 రాష్ట్రాలలో  620 జిల్లాల నుండి 2,54,236 మట్టి నమూనాలను సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సేంద్రీయ కర్బనం  నేల రసాయన లక్షణాలనే కాకుండా నేల యొక్క భౌతిక లక్షణాలను  మరియు జీవ లక్షణాలను ప్రభావితం చేస్తాయని నివేదించారు.

ఒక ప్రాంతంలో  సేంద్రీయ కర్బన శాతం నిర్ణయించడంలో పంటలు వేసే పద్దతులు  ముఖ్యమైన భూమిక పోషిస్తాయి.  వరి ఆధారిత పంటలు లేదా అపరాలు ఆధారిత పంటలు అనుసరించిన నేలలలో గోధుమ మరియు ధాన్యం పంటలను అనుసరించిన ప్రాంతాల కంటే సేంద్రీయ కర్బన శాతం  కొంచెం ఎక్కువగా ఉంటుంది.

నేలల్లో సేంద్రీయ కర్బనము తగ్గడానికి కారణాలు :- పూర్వం పంటతోపాటు ప్రతి రైతుకు పాడి ఉండేది. పశువుల ఎరువును ఉపయోగించేవారు. పంట వ్యర్థాలను పశువులకు మేతగా వాడేవారు. రసాయన ఎరువులు వాడకం మొదలైనప్పటి నుండి వీటి వాడకం సులభతరంగా ఉండటంతో పంటలకు సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా తగ్గిపోయినప్పుడు నేలల్లోని  సేంద్రీయ పదార్ధ నిల్వలు తగ్గిపోతాయి.

హరిత విప్లవంలో భాగంగా పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొన్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు నేలల నుండి పోషకాలను అధికంగా స్వీకరిస్తాయి. వీటి కోసం విచక్షణ లేకుండా అధిక రసాయనిక ఎరువుల వినియోగం ప్రధాన కారణము. నేలల్లో నత్రజని, భాస్వరము, పొటాష్ వినియోగం సిఫారసు చేసిన 4:2:1 నిష్పత్తి కంటే అధికంగా 6:4:1గా ఉండటము ఆందోళన కలిగిస్తుంది.

తరువాత కాలంలో రైతులు ఉపయోగించవలసిన దాని కంటే అధికంగా రసాయన ఎరువులను వాడడం, భూసార పరీక్షలు నిర్వహించకుండా ఆయా నేలల్లో పోషకాల మోతాదు ఎంత వుందో తెలుసుకోకుండా రసాయనిక ఎరువులను వాడడం వల్ల నేలలు సారవంతతను కోల్పోయాయి. సేద్యపు భూములైతే అధికంగా నేలను దున్నడం, పోషకాలను అధికంగా తీసుకునే పంటలు పండించడం, పంట వ్యర్ధాలను నేలలో కలియ దున్నకుండా కాల్చడం వల్ల నేలలో నిక్షిప్తం అవ్వవలసిన కర్బనం వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్గా కలుస్తుంది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి.

సేంద్రియ కర్బనం ప్రాముఖ్యత:- సేంద్రియ కర్బనం నేల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నేలలో ఉండే సూక్ష్మజీవులకు సేంద్రియ కర్బనం ఆహారం. నేల భౌతిక, రసాయన, జీవ సంబంధ ధర్మాలన్నీ సేంద్రియ కర్బనంపై ఆధారపడి ఉంటాయి. సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారం, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడినిస్తాయి. సేంద్రీయ కార్బన్ తక్కువగా ఉంటే, నేలలో సూక్ష్మపోషకాల లోపం ఎక్కువగా ఉంటుందని మరియు సేంద్రీయ కార్బన్ ఎక్కువగా ఉంటే పోషకాల లోపం తక్కువగా ఉంటుందని అధ్యయనం తెలుపబడింది .

నేలల్లో సేంద్రియ కర్బన స్థితిగతులు :- సేంద్రియ పదార్థాలు లేదా జీవ పదార్థాలన్నింటిలో ఉండే ముఖ్యమైన పోషక మూలకమే సేంద్రియ కర్బనం. సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ళ ఎరుపు, గొర్రెల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పంట వ్యర్థాలన్నింటిలో సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని నేలకు వేసినప్పుడు నేలకు సేంద్రియ కర్బనం అందుతుంది. ఈ సేంద్రియ కర్బనం   సేంద్రియ పదార్థాల కొలమానంగా చెప్పవచ్చు.సాధారణంగా మన దేశంలోని నేలల్లో సేంద్రియ కర్బనం , 0.5% కన్నా తక్కువగా ఉంటే సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్లుగానూ, 0.50 నుండి 0.75% వరకు ఉంటే మధ్యస్థంగానూ, 0.75% కన్నా ఎక్కువగా ఉంటే ఆ నేలలో సేంద్రియ కర్బనం ఎక్కువగానూ ఉన్నట్లు చెప్తాం. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.3% కన్నా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత మనం పంటలు పండించుకోలేని స్థితికి వెళ్తాము.

నేల భౌతిక లక్షణాలపై  సేంద్రియ కర్బన ప్రభావం :

నేలకు వివిధ భౌతిక ధర్మాలు ఉంటాయి. అవి నేల నిర్మాణం, ఇసుక, ఒండ్రు, బంక మన్ను శాతం, నేలలో ఉండే నీరు, నేల ఉష్ణోగ్రత, నేలలో ఉండే సూక్ష్మ, స్థూల రంధ్రాలు నేల రంగు మొదలైనవి  నేల భౌతిక ధర్మాలుగా చెప్తాము. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్నప్పుడు నేలలోని, వివిధ రేణువుల మధ్య అతుక్కునే గుణం పెరిగి నేల నిర్మాణం బాగుంటుంది. సూక్ష్మ, స్థూల రంధ్రాలు సమపాళ్ళలో ఉండి నీరు, గాలి సరిపడినంతగా ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం అధికంగా ఉ న్న నేలలు ముదురు గోధుమ రంగు నుండి నలుపు వర్ణంలో కనిపిస్తాయి.

సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటం వలన నేల భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి. పంటకు కావలసిన పోషకాలు సమతుల్యంగా అందుబాటులోకి రావు, నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉండదు. నేలల్లో పోషకాల నిష్పత్తి సరిగ్గా ఉండదు. నేలలో సూక్ష్మజీవులు తగినంత సంఖ్యలో ఉండకపోవడం వల్ల పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పంటల దిగుబడి తగ్గిపోయి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది.

నేల రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల పై సేంద్రియ కర్బన ప్రభావం: సేంద్రియ కర్బనపు నేలల్లో పోషకాలు నిలువ ఉండే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, సాధారణంగా సూక్ష్మజీవులు నేలలోని సేంద్రియ కర్బనాన్ని ఉపయోగించుకొని నేలలోని సేంద్రియాలను విచ్ఛిన్నం చేస్తాయి. సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో సేంద్రియ ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు నేల ఉదజని తటస్థంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఉదజని తటస్థం నుండి అల్పక్షారం ఉన్నప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రైజోబియం, అజోస్పైరిల్లమ్, అజటోబాక్టర్ నత్రజనిని స్థిరీకరిస్తాయి. ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రం పంటలకు చీడపీడలు రాకుండా నివారిస్తుంది. సేంద్రియ కర్బనం తగ్గడం వల్ల వీటన్నింటినీ కృత్రిమంగా తయారు చేసి జీవ ఎరువులుగా, జీవ శిలీంధ్ర నాశకాలుగా వినియోగిస్తున్నాం.

వాతావరణ మార్పులకు నేలల్లో సేంద్రియ కర్బనానికి ఉన్న సంబంధం: ఎరువుల అసమతుల్యత ఎక్కడ ఉందో, అక్కడ నేలలో ఉన్న సేంద్రీయ కార్బనం  తగ్గిందని కనుగొనడం జరిగినది దీనికి తోడు వాతావరణo  లో   మార్పులు  సేంద్రీయ కార్బనం  పై ప్రభావం చూపుతుందని అధ్యయనం పేర్కొంది. సేంద్రియ కర్బనం పై వర్షపాతం గణనీయమైన ప్రభావాన్ని చూపదు, కానీ ఉష్ణోగ్రతతో, ఇది చాలా ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటుంది. “ఉష్ణోగ్రత పెరుగుతుంటే, భవిష్యత్తులో నేల సేంద్రీయ కార్బన్ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి మరియు అది నేల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, కార్బన్ క్రెడిట్ మరియు నేల నుండి ఉష్ణ ఉద్గారాలను కూడా ప్రభావితం చేస్తుంది. నేలలో ఎక్కువ కార్బన్ ఉంటే, ఎక్కువ ఉష్ణ శోషణ ఉంటుంది. కార్బన్ కంటెంట్ తక్కువగా ఉంటే, నేలలో ఉష్ణ శోషణ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం”.

సాధారణంగా సేద్యపు నేలలో కంటే అటవీ భూముల్లో సేంద్రియ కర్బనం అధికంగా ఉంటుంది. దీనికి కారణము అడవులలో ఎండిపోయిన ఆకులు కొమ్మలు నేలపై పడుతూ ఉంటాయి. వీటితోపాటు జంతు కళేబరాలు నేలపై పడి ఇవన్నీ నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. నేల ఎప్పుడూ సేంద్రియ వ్యర్థాలతో కప్పబడి ఉంటుంది. దీని వల్ల నేల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. సేంద్రియ కర్బనం వృధా కాదు. వర్షపాతం మరియు ఉష్ణోగ్రత సేంద్రీయ కార్బన్‌ను నిర్ణయిస్తుందని. ఉదాహరణకు,  ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా వున్న రాయలసీమ ప్రాంతాలైన అనంతపురము, కర్నూలు, నంద్యాల లో  సేంద్రీయ కార్బనం 0.5 శాతం కన్నా తక్కువ ఉంటుంది.  అదే ఉష్ణోగ్రత తక్కువగా వున్న కోస్తా జిల్లాలైన గోదావరి, అనకాపల్లి మరియు ఎత్తైన ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకు లో సేంద్రీయ కార్బనం  0.75 శాతం కన్నా అధికం గా ఉంటుంది.  పంటలు మరియు పంటల విధానాలతో సంబంధం లేకుండా, ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు ఎత్తు నేలలో సేంద్రీయ కార్బన  సాంద్రతను నిర్ణయించే మూడు ముఖ్యమైన అంశాలు అని అధ్యయనం పేర్కొంది. భూమి ఎత్తు ఎక్కువగా ఉంటే, సేంద్రీయ కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ మనం కొండల నుండి తక్కువ భూమికి మారితే, సేంద్రీయ కార్బనం శాతం తక్కువగా ఉంటుంది.

నేలల్లో సేంద్రియ కర్బన శాతాన్ని మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో భూసార పరీక్షల ద్వారా నేలల్లో సేంద్రియ కర్బన శాతాన్ని తెలుసుకోవచ్చు. ఇదివరకు చెప్పిన పరిధుల ఆధారంగా నేలలను బట్టి సేంద్రియ ఎరువులను ఎకరానికి ఎంత వేయాలో సాయిల్ హెల్త్ కార్డులో  నమోదు చేసి ఇవ్వడం జరుగుతుంది.

సేంద్రియ కర్బనం నేలల్లో పెంచటానికి యాజమాన్య పద్ధతులు:

నేలల తయారి పద్దతులు:- నేలలను ఎక్కువ సార్లు దున్నడము వలన సేంద్రియ కర్బనము తగ్గుతుంది. కాబట్టి సాద్యమైనంత వరకు నేలను దున్నకుండా (No till farming) లేక తక్కువ సార్లు దున్ని (Minimum tillage) , నెల కోతకు గురికాకుండా, నేల, నీరు సంరక్షించినచో సేంద్రియ కర్బనము పెరుగుతుంది. ఉదాహరణకు వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్‌ పద్ధతిలో సాగు చేయడం లేదా మినుము మరియు పెసర పంటలను వేదజల్లుకోవడం.

పంట అవశేషాల యాజమాన్యం:-వరి కోతలు తరువాత  పంట వ్యర్థాలను నేలలో  రోటోవేటర్‌ ద్వారా  కలియదున్నుకోవాలి. అలాగే వరిని యంత్రాలతో కోసిన తరువాత, వరిగడ్డిని ట్రాష్ ష్రెడ్డర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి  నేలలో కలిపిన యెడల  త్వరగా విచ్ఛిన్నం కావడానికి వీలుగా ఉంటుంది. ఈ పద్దతిని పత్తి పంటలో కూడా ఉపయోగ పడుతుంది.

పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో (వేస్ట్‌ డికంపోజర్‌) కంపోస్టింగ్‌ పద్ధతిలో వాడుకోవడం ద్వారా నేల భౌతిక మరియు రసాయన లక్షణాలు మెరుగపడడమే కాకుండా భూసారం మరియు నీరు నిలుపుకునే శక్తి పెరుగుతుంది. దీని కొరకు రైతులు 200 లీటర్ల  నీటి లో 30గ్రా  (ఒక బాటిల్ ) కల్చర్ ను మరియు 2 కిలోల బెల్లం ను కలిపి, 5 రోజులవరకు ప్రతిరోజు 2 సార్లు కలియ తిప్పాలి. ఈ ద్రావణం 5 రోజులలో తయారవుతుంది. దీనిని 1:3 పద్దతిలో మిశ్రమాన్ని తయారుచేసుకొని పిచికారి చేసుకోవాలి. ఈ మిశ్రమం పంట అవశేషాలను త్వరగా కుళ్ళిoపచేసి సేంద్రీయకర్బనం పెరుగుటకు దోహదపడుతుంది.

వరి, మొక్కజొన్న, జొన్న మరియు సజ్జ వంటి పంటల నుండి వెలువడిన అవశేషాలను వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో మల్చింగ్‌గా వాడి ఆ నేలలో సేంద్రీయకర్బనం పెంచుకోవచ్చు. అంతేకాకుండా దీని వలన కలుపు నివారణ, నీటి సంరక్షణ మరియు భుసార పరిరక్షణకు ఉపయోగ పడుతుంది.

సేంద్రియ వ్యవసాయం:- సేంద్రీయ వ్యవసాయంలో పోషకాలను మొక్కలకు  అందించడానికి పశువుల ఎరువు (పశువులు ఉన్న రైతులు విధి గా పశువుల పేడను సుమారు 5 టన్నులు/హెక్టేరుకు తోలుకోవాలి), కోళ్ళ ఎరువు, కంపోస్ట్, వెర్మికంపోస్ట్, జీవనఎరువులు, పచ్చిరోట్టలాంటి ఎరువులు వాడటం వలన భూమి యొక్క బౌతీక మరియు రసాయనిక లక్షణాలలో మార్పు వచ్చి నెలకు మేలుచేసే జీవరాసుల సంఖ్య పెరుగుతుంది. అంతే కాకుండా నెలలో హుమస్ శాతం పెరిగి  సేంద్రీయ కర్బనం అధికమవుతుంది.

వర్మి కంపోస్టు:- ఆహార అవశేషాలు, వ్యవసాయ పరిశ్రమ వ్యర్ధాలు, పంట వ్యర్ధాలు, పశువుల ఎరువు ఉపయోగించి కొంపోస్ట్ ఏకరాకు 1-2 టన్నుల పంటలకు వేసినచో భూసారం మరియు సేంద్రియ  కర్బనం  మెరుగు పరుస్తుంది. ఇతర సేంద్రియ ఎరువులతో పోలిస్తే వర్మి కంపోస్టులో 4 నుండి 5 రెట్లు ఎక్కువ మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వాన పాముల ఎరువులో 10-14 శాతం వరకు సేంద్రీయ కర్బనం ఉంటుంది.

జీవాలు మంద కట్టడం : గొర్రెలు మరియు మేకలు మంద కట్టడం ద్వారా  జీవాల యొక్క మాల మూత్రలు నేలలో కలిసి సేంద్రీయకర్బనం పెరుగుతుంది

పచ్చిరొట్ట ఎరువులు: పచ్చిరొట్ట ఎరువులైన  జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర, అలసంద వంటి పైర్లను పూమొగ్గ దశ వరకు పెంచి భూమిలో కలియదున్నాలి. ధాన్యపు పంటలను, పప్పుజాతి పంటలతో పంట మార్పిడి చేయాలి. ప్రీ మాన్సూన్ డ్రై సొయింగ్ (PMDS) లో భాగంగా 21 పంటల విత్తనాలను (అపరాలు, ఆకు కూరలు, కూరగాయలు, ధాన్యపు పంటలు, తృణ ధాన్యాలు మరియు పచ్చిరొట్ట పైర్లు) ఋతుపవనాలు రాక ముందే పొడి నేలలో విత్తనాలను  వేయవలయును. అవి మొలిచిన 40 నుండి 50 రోజుల పంట కాలం తరువాత భూమిలో కాలియదున్నాలి. తద్వారా నేలలో కర్బన శాతాన్ని పెంపొందించవచ్చు.

సమగ్ర ఎరువుల యాజమాన్యము: సేంద్రియ మరియు రసాయనిక ఎరువులను సమతుల్యత పాటించి పంటలకు వేసుకొన్న యెడల పంట దిగుబడితో పాటు నేలల్లో సేంద్రియ కర్బనము పెర్గుతుంది..

బయోచార్ : ముఖ్యంగా ప్రత్తి , ఆముదం, కంది  మరియు మొక్కజొన్న పంట కోసిన తరువాత మిగిలిన వ్యర్థాలను ఆక్సిజన్ లేకుండా లేదా పరిమిత ఆక్సిజన్ సరఫరా ఉన్న పరిస్థితిలో 300 నుండి 650 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా పారిశ్రామిక స్థాయిలో బయోచార్ తయారు చేసుకోవచ్చు. ఈ బయోచార్ వాడకం వలన  నేలలో నేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది, సాదారణం గా బయోచార్ లో పంటను బట్టి  20-65 శాతం వరకు సేంద్రీయ కర్బనం ఉంటుంది.

అచ్చాధన పంటలు (కవర్ క్రాపింగ్): అచ్చాధన పంటలు లేదా కవర్ క్రాపింగ్ అంటే పంట కోసం కాకుండా, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కోతను నివారించడానికి, కలుపు మొక్కలను నివారించడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి మరియు సేంద్రీయ పదార్థాలను జోడించడం, నత్రజనిని స్థిరీకరించడం మరియు ప్రయోజనకరమైన సూక్ష్మజీవులకు మద్దతు ఇవ్వడం ద్వారా సంతానోత్పత్తిని పెంచడానికి ఉపఎగాకరంగా ఉంటాయి.ఉలవలు, అలసంద, పెసర మరియు మినుము పంటలను , కాయలు కోసిన తరువాత పంటను తీయకుండా ఉంచినచో నేలఫైన ఉస్నోగ్రత తగ్గి సేంద్రియ కర్బనము పెంచుకోనవచ్చును.

  • ఏడాది మొత్తం (365 రోజులు) నేలను మరియు నేలపై పంటలు లేని సమయములో పంట వ్యర్ధాలతో మల్చింగ్ చేసుకుని నేలపై వేడిని తగ్గించిన యెడల సేంద్రియ కర్బనము పెరుగుటకు దోహదపడుతుంది.
  • ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అందుబాటులో (కడప మరియు అనంతపురము జిల్లాల్లో) ఉన్న యెడల బెలుకు (షేల్)ను 300 టన్నులు ఒక హెక్టారు పంట పొలాలకు ఆచ్చాదన (మల్చింగ్) లాగా వేసుకోవడం వలన కూడా  నేలలో నేంద్రియ కర్బన శాతం పెరిగి  సూక్ష్మ జీవులు, మిత్ర పురుగులకు నివాస స్థావరాలుగా మారటమే కాకుండా వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని వాన నీటిని నిల్వవుంచుతుంది  తద్వారా భూమి లోపలి పొరల్లో తేమ సంరక్షింపబడి, వర్షాధార పంటల్లో దిగుబడి పెరుగుతుంది.

పూడిక తీసిన మట్టి:- చెరువుల్లో, చెక్ డామ్  మరియు నీటి కుంటలలో  పూడిక తీసిన మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత, ఉదజని సూచిక తటస్థంగా (PH 6.5 – 7.5) ఉన్నప్పుడు మాత్రమే, ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకోని భూమిలో కలియ దున్నుకోవాలి. తద్వారా ఆ మట్టిలోని పోషకాలు భూమిలో కలిసి ఆ పొలం సారవంతం అవుతుంది మరియు నేలలో నేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుంది.

అటవీ వ్యవసాయము:- అటవీ వ్యవసాయము లేదా అగ్రోఫారేష్ట్రి అనేది పంటలు , ఉద్యానవన పంటలు లేదా పశుగ్రాస పంటలతో అనుసంధానించే భువినియోగ వ్యవస్థ.ఇదివ్యవసాయ ,  అటవీ సాంకేతికలను మిళితం చేస్తుంది మరియు నేలలో నేంద్రియ కర్బన శాతం పెరుగుటకు తోడ్పడుతుంది.

సేంద్రియ కర్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణంలో ఆయా ప్రాంతాలలో అందుబాటును బట్టి పైన చెప్పినటువంటి పద్దతులు మరియు ఎరువులను విస్తృతంగా ఉపయోగించి నెలల్లో సేంద్రియ కర్బనం స్థాయిని మెరుగుపర్చుకోని తద్వారా దీర్ఘకాలిక వ్యవసాయ సుస్థిరత ను రైతులు సాధించుకోగలరని కోరుకుంటున్నాము.

డా . బి. సహదేవ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, డా. పి.వి. రమేష్ బాబు, శాస్త్రవేత్త, డా. సి. హెచ్. శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్త , డా .కె. తేజేశ్వర రావు , ప్రధాన శాస్త్రవేత్త, డా. టి. శ్రీనివాస్, సహాయ పరిశోధన సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు, ప. గో. జిల్లా.

Leave Your Comments

రైతన్న వద్దకే ప్రభుత్వం.. లాభసాటి వ్యవసాయమే లక్ష్యం

Previous article

ప్రకృతి వ్యవసాయం లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలి

Next article

You may also like