నేలలు సహజసిద్దంగా వాటిలో వున్న పోషక పదార్దాలను మరియు మనము వేసిన సేంద్రియ మరియు రసాయన ఎరువులలోని పోషక పదార్థాలను మొక్కలకు అందజేసి వాటి పెరుగుదలకు, అభివృద్దికి మరియు పంటదిగుబడికి దోహద పడతాయి. కనుక మనము తరచుగా భూసారాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా పంటకు పోషకాలను సమతుల్యంగా అందించి, పోషక లోపాలు రాకుండా చూడడంతో పాటు ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు పెట్టకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ సుస్థిరమైన అధిక దిగుబడులను సాదించవచ్చు.
ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుసారపరీక్షల కొరకు విదిగా బడ్జెట్ ఇచ్చి, భుసారపరీక్షలు చేయిస్తున్నప్పటికి రైతులు భుసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడంలో విఫలమవుతున్నారని చెప్పక తప్పదు. దీనికి గల ముఖ్య కారణాలను విశ్లేషించినట్లైతే
1). నిరక్ష్యరాస్యత
2.). ఎలా వినియోగించుకోవాలో అవగాహన లేకపోవడం.
3). వినియోగించుకోవాలనే ఆసక్తి లేకపోవడం.
భుసార పరీక్షపత్రాన్ని బట్టి ఎరువులు ఎలా వేసుకోవలనేడానికి ఉదాహరణగా ఇక్కడ ఒక భుసార పరీక్ష పత్రాన్ని మరియు దానిని బట్టి నంద్యాల జిల్లాలో వరి పంటకి ఎరువులు ఎలా వినియోగించాలో క్రింద వివరించబడింది.
ఇచ్చిన పత్రంలో PH( ఉదజని సూచిక) 7.78 గ వుంది అంటే ఈ నేల కొంచం క్షార స్వభావాన్ని కలిగి ఉంది. EC (లవణ సాంద్రత) O.62 dS/m వుంది అంటే ఈ నేల చౌడు లేకుండా సాగుకు అనుకూలంగా ఉందని అర్ధం. OC (సేంద్రియ కర్బనం) 0.67 వుంది అంటే ఈ నేలలో సేంద్రియ పదార్థం మద్యస్థంగా ఉందని అర్ధం. ఈ నేలలో లభ్యనత్రజని తక్కువుగా(251.0 కె.జి./హెక్టారుకు), లభ్యభాస్వరం మధ్యస్థంగా (10.14 కె.జి./హెక్టారుకు) మరియు లభ్యపొటాష్ 465 కె.జి./హెక్టారుకు) అధికంగాను ఉన్నాయి. లభ్యగంధకం (71 పిపిఎం) అధికంగా, సుక్ష్మ పోషకాలైన లభ్యజింకు (0.39 పిపిఎం) తక్కువగాను, లభ్యబోరాన్ ( 7.48 పిపిఎం) ఎక్కువగాను, లభ్య ఇనుము (4.26 పిపిఎం) తక్కువగాను, లభ్య మాంగనీసు (9.18 పిపిఎం) ఎక్కువగాను మరియు లభ్య కాపర్ (0.12 పిపిఎం) తక్కువగాను గాను ఉన్నాయి. ( మొత్తంగా నవ్వుతున్న ఎమోజి మద్యస్థం లేదా ఎక్కువగా ఉన్నట్లు సూచిస్తుంటే, ఏడుస్తున్న ఎమోజి తక్కువగా ఉన్నట్లు సూచిస్తుంది.
ఇప్పుడు మనకు భూమిలో వున్న పోషకాల స్థాయి తెలిసింది కనుక, దీనిని బట్టి వరికి నంద్యాల జిల్లాలో ఎరువులు ఎలావేయలో తెలుసుకుందాం.
నంద్యాల జిల్లాలో వరికి ఖరిఫ్ మరియు రబీలో సిఫారసు చేసిన ఎరువులు మోతాదు ఎకరానికి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం మరియు 32 కిలోల పొటాష్.
ఇప్పుడు మనం భుసార పరీక్షను బట్టి ఎకరానికి 120 కిలోల నుంచి 125 కిలోల (25% నుంచి 30% ఎక్కువ ) నత్రజని ఇచ్చే ఎరువులను, 32 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను మరియు 22 కిలోల నుంచి 24 (30% నుంచి 25 % తగ్గించి) పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. లభ్య గంధకం ఎక్కువగా ఉంది గనుక సల్పైడ్ ఇంజురి వచ్చే అవకాశం వుంది గనుక ఎటువంటి గంధకం కలిగిన (20-20-0-13 లేదా “అమ్మోనియం సల్ఫేట్”) ఎరువులను వేయరాదు. అవసరమైతే పొలాన్ని ఆరగాట్టాల్సి వస్తుంది. జింకు లోపం వుంది గనుక ఎకరానికి 20కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. బోరాన్ ఎక్కువగా వుంది గనుక రసాయన ఎరువుల ద్వారా వేయాల్సిన అవసరం లేదు. లభ్య ఇనుము తక్కువుగా వున్నప్పటికీ వరికి నీరు పెట్టినప్పుడు ఫెర్రిక్ రూపంలో ఉన్న ఇనుము ఫెర్రస్ రూపంలోకి మారి అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ ఇనుము దతులోపం కనిపిస్తే “ఫాస్ఫరస్ సల్ఫేట్”5 గ్రా. లు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేసి సరిచేసుకోవచ్చు. మాంగనీసు ఎక్కువగాను మరియు కాపర్ తక్కువగాను వున్నాయి కాని ఇవి వేయాల్సిన అవసరము లేదు.
రైతులు భుసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించవలెనంటే మనం చేపట్ట వలసిన చర్యలు
1). నిరక్ష్యరాసులైన రైతులకు రైతు సేవ కేంద్రాలలోని వ్యవసాయ సహాయకులు భుసార పరీక్షల ఆధారంగా వారు వేసే పంటను బట్టి ఏమేమి ఎరువులు ఎంత మోతాదులో వేయాలో వారి ఇంట్లో చదువు కున్న వారికీ వివరించడం, అలా జరగనప్పుడు వ్యవసాయ సహాయకులే వారు సరైన మోతాదులో వేసేటట్లు చూడాలి.
2). రైతులకు భుసారపరీక్షల ఆధారంగా ఎలా ఎరువులు వేయాలో పూర్తిగా అవగాహన కలిగే వరకు రైతులకు విస్తృతంగా శిక్షణా కార్య క్రమాలు నిర్వహించాలి.
3). రైతు పొలాల్లో వ్యవసాయ శాఖ వారు ఆత్మ వారితో కలిపి ప్రదర్సనా క్షేత్రాలు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు ఏరువాక మరియు కృషి విజ్ఞాన కేంద్రాలతో ప్రధమ స్థాయి ప్రదర్సనా క్షేత్రాలు ఏర్పాటు చేయించాలి.
ఇలా రైతులు భుసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించినట్లైతే భూసార పరిరక్షణతో పాటు రైతులు ఎరువులపై పెట్టె ఖర్చు కూడా తగ్గుతుంది.
డా. పి. సుజాతమ్మ, ప్రధాన శాస్త్రవేత్త (సస్య విభాగం) & సమన్వయకర్త, ఏరువాక కేంద్రం, కర్నూలు


























