ఆంధ్రప్రదేశ్నేలల పరిరక్షణవ్యవసాయ పంటలు

జీవన ఎరువులు వేద్దాం – భూసారాన్ని పెంచుకుందాం

0

వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం నానాటికీ పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడమేకాకుండా భూమి యొక్క ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయరంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించటం జరిగింది. దీనిలో సేంద్రీయ ఎరువుల వాడకంతోపాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది.

జీవన ఎరువులు :

జీవనఎరువులు అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలిగియుండి విత్తనానికి కలిపే లేదా నేలలో వేసే ఎరువులు. ఈ జీవనఎరువులలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపెలలోకి లేదా వేరు మండలంలోకి ప్రవేశించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చి, మొక్క పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.

జీవనఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :-

జీవనఎరువు ప్యాకెట్ ఎండ, వేడి తగలని చల్లని నీడ ప్రదేశంలో నిల్వచేయవలెను. రైతువాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదై ఉండవలెను. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్పై ఉన్న గడువు తేది లోపల మాత్రమే ఉపయోగించవలెను. రసాయనాలతో విత్తనశుద్ధి చేసుకొనేటప్పుడు విధిగా 24-48 గంటల వ్యవధి ఉండవలెను. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు. సమర్దవంతంగా పనిచేయుటకు నాణ్యతగల కల్చర్ను వాడుకోవాలి. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును వాడుకోవాలి. సేంద్రీయ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి.

జీవన ఎరువులు వాడకం వలన కలిగే ఉపయోగాలు :-

వాతావరణ కాలుష్యంను అరికట్టుకోవచ్చు.  నేలలోని మొక్కలు తమంత తాము ఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెచుకుంటాయి.  హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. నేల నుండి సంక్రమించే తెగుళ్ళను కొంతమేర అరికట్టవచ్చు. నేల భౌతిక లక్షణాలు బాగుపడి  మరియు భూసారం అభివృద్ధి చెందును. రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి అధికమగుతుంది. సాధారణ దిగుబడులు 10-20 శాతం వరకు పెరుగుతుంది.

జీవన ఎరువులను వాటి క్రియాశీలతను మరియు వాడే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు :-

  1. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు.
  2. భాస్వరంను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు.
  3. పొటాషియంను మొక్కలకు అందించేవి.
  4. జింక్ ను కరిగించే సూక్ష్మజీవులు.
  5. సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు.
  6. వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బాక్టీరియా.

నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు :

రైజోబియం :- లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల(పప్పుజాతి)

పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడాలి. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనెగింజల పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనంకు పట్టించి ఉపయోగించవలెను. దీనిని ఉపయోగించుట వలన మొక్క వ్రేళ్ళపై లేత గులాబి రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది.

ఉపయోగించు విధానం :-

100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడరును కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. ఈ చల్లార్చిన ద్రావణంలో 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి, విత్తనం 10 నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత పొలంలో నాటుకోవలెను.

అజటోబాక్టర్ :-

ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించుటమే కాక మొక్కకు కావాల్సిన హార్మోన్లను మరియు విటమిన్లను అందించును. ఈ జీవన ఎరువులు ఆకుకూరలు, కూరగాయలు మరియు పూల తోటలకు సిఫారసు చేయబడినవి.

వాడే విధానం :-

1 కిలో కల్చర్ను 200 కిలోల సేంద్రీయపు ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లవలెను.

అజోస్పైరిల్లమ్ :-

ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్నచోట వ్రేళ్ళలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంటుంది. వరి, చెఱకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడును.

ఉపయోగించు విధానం :-

1 కిలో అజోస్పైరిల్లమ్ కల్చర్ను80-100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం క్రింద పడేటట్లు వేసుకోవలెను. నారుమడి వేసుకొనే పంటలకు నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకొని, ఆ నీటిలో 1 కిలో అజోస్పైరిల్లమ్ జీవన ఎరువును కలిపిన ద్రావణంలో 10 నిమిషాలు వ్రేళ్ళను మాత్రమే ముంచి వెంటనే నాటవలెను. అలాగే చెఱకు పంటలో నాటే విత్తనపు చెఱకు ముచ్చెలను 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి.

నీలి ఆకుపచ్చనాచు (సైనోబాక్టీరియా) :-

ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజని సంబంధించిన జీవనఎరువు రైతులు వరి పంట ముందుగా చిన్న, చిన్న మడులలోగాని తొట్టెలలోగాని పెంచుకొని వరినాట్లు వేసిన తరువాత దీనిని వాడుకోవచ్చు.

వాడే విధానం :-

ఒక ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల జీవన ఎరువును 40-50 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 15-20 రోజులలో ఈ నాచు మందంగా చాపలా పేరుకుపోతుంది. తర్వాత నీరు తీసివేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసేటట్లు చేయాలి. ఈ నాచు సేంద్రీయ పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది.

అజోల్లా-అనాబినా :-

ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి మొక్క ఈ ఫెర్న్ మొక్కల ఆకులు అనాబినా అనే సైనోబాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు నత్రజనిని అందుబాటులోకి తెస్తాయి. ఈ జీవన ఎరువు ఒక నత్రజనిని మాత్రమేగాక, సేంద్రీయ కర్బనం మరియు పొటాషియంను కూడా వరి పైరుకు అందిస్తుంది.

వాడే విధానం :-

వరి నాటిన వారం తరువాత సుమారు 200 కిలోల అజోలా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వవలెను. తరువాత నీటిని తొలగించినచో  ఇది 3-4 రోజులలో కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కకు అందిస్తుంది. రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదున్నినచో దీని ఉపయోగం మరింత బాగుంటుంది.

భాస్వరంను అందించే జీవన ఎరువులు :-

ఈ రకపు సూక్ష్మజీవులు నేలలో వేయటం వల్ల భూమిలో ఎంజైములను, రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. అంతేకాకుండా సూక్ష్మపోషకాలతో కలిసి ఉన్న భాస్వరాన్ని విడుదల చేసి మొక్కలకు అందిస్తాయి.

ఫాస్పోబాక్టీరియా :-

ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను, లభ్యమగు రూపంలోకి మార్చును. ఈ జీవన ఎరువు అన్ని పంటలకు వాడుకోవచ్చు.

వాడే విధానం :-

ఎకరాకు 1-1.5 కిలోల ఫాస్పోబాక్టర్ను, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడు సాళ్ళలో గాని పడేటట్లు వేసుకోవాలి. వరి పంటలో నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో వేసుకోవాలి.

ఫాస్ఫోఫంగై :-

ఫాస్పోబాక్టీరియం కన్నా శక్తివంతమైన జీవన ఎరువు. దీనిని అన్ని పంటలకు వాడుకొనవచ్చు. ఇది నేలలో చేసే జీవ ప్రక్రియ ద్వారా ఎక్కువ శాతం లభ్య భాస్వరం మొక్కకు దొరుకును.

వాడే విధానం :-

1 కిలో జీవన ఎరువును 100 కిలోల సేంద్రీయపు ఎరువుతో కలిపి ఒక ఎకరం నేలకు విత్తనం నాటిన సాళ్ళలో పడేటట్లు వేసుకోవలెను.

ఫాస్పేటు మొబిలైజింగ్ మైకోరైజా :-

మొక్క వ్రేళ్ళు చొరబడలేని భూమి అడుగు పొరలలోనికి చొచ్చుకొనిపోయి మొక్కలకు ముఖ్యంగా భాస్వరంతోపాటు సూక్ష్మపోషకాలైన జింకు, కాపర్, సల్ఫర్, మాంగనీస్, ఇనుము మొదలగు వాటిని నీటితో సహా అందించును.

వాడే విధానం :-

ఈ జీవన ఎరువుకు నిర్దిష్ట పరిమాణములు లేని కారణం వలన కనీసం 5 కిలోలను ఒక ఎకరం భూమికి వేయవలసి ఉంటుంది. రైతులు నారుమడి వేసి పండించే పంటలకు దీనిని సులభంగా వాడుకొనవచ్చు.

పొటాషియం మొబిలైజర్స్ :-

ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెస్తుంది.

వాడే విధానం :-

1 నుండి 1.5 కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి ఒక ఎకరం భూమిపై వెదజల్లాలి.

జింక్ను కరిగించే సూక్ష్మజీవులు :-

ఈ రకమైన జీవన ఎరువులను వాడుట వల్ల నేలలో ఉండి, మొక్కలకు లభ్యం గాని జింక్ మూలకాలు మొక్కలకు అందుతాయి.

సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేసే జీవన ఎరువులు :-

ఈ జీవన ఎరువులు మొక్కల యొక్క వ్యర్థపదార్థాలు కుళ్ళింపజేయుటకు వాడుతారు. ఈ జీవన ఎరువులను వాడి పంటకోత తర్వాత మిగిలిన పదార్థాలను కుళ్ళింపజేసి నేల సాంద్రతను పెంపొందించి మొక్కలకు కావలసిన పోషకాలను అందజేయవచ్చు.

ఎన్ . తేజ కుమార్, కె . రాఘవేంద్ర చౌదరి, టి . శ్రీ చందన, వై. మౌనిక, కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి, కర్నూల్ జిల్లా, ఫోన్ : 99595 59201

Leave Your Comments

అరటి సాగులో యాజమాన్య పద్ధతులు

Previous article

Thummala Nageswara rao: తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

Next article

You may also like