తెలంగాణమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

భారతదేశంలో జన్యు – సవరించిన వరి వంగడాల విడుదల – వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అధ్యాయం

0

పంటల శాస్త్రంలో దేశవాళీకరణ నుండి జీనోమ్ ఎడిటింగ్ వరకు ప్రయాణం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రజనన ప్రారంభంలో, మనుషులు అడవి మొక్కలను ఎంచుకొని మంచి లక్షణాలతో సాగు చేయటం ద్వారా ఆనాటి పంటలను శక్తివంతంగా మానవ అవసరాలకు అనుగుణంగా మార్చారు. సాంప్రదాయ ప్రజనన, సంకరాభివృద్ధి, యాదృచ్ఛిక ఉత్పరివర్తనాలు ద్వారా ఆసక్తికరమైన లక్షణాలను బయటకి తీసారు మరియు నూతనమైన రకాలను అభివృద్ధి చేశారు. శాస్త్రీయ పురోగమనం ద్వారా, క్రిస్పర్-కాస్9 వంటి జన్యు-సవరించిన (జీనోమ్ ఎడిటింగ్) పద్ధతులు ప్రజననను మార్గనిర్దేశం చేసింది. జన్యు స్థాయిలో నిర్దిష్ట మార్పులు చేసి, త్వరితంగా, ఖచ్చితంగా, అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత, పోషక విలువలతో కూడిన ఆధునిక పంటలను సృష్టించడంలో జీనోమ్ ఎడిటింగ్ కీలకపాత్ర పోషిస్తోంది.

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) ఇటీవల రెండు కొత్త జన్యు-సవరించిన (జీనోమ్ ఎడిటింగ్) వరి వంగడాలను విడుదల చేసింది, ఇది దేశ వ్యవసాయ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ కొత్త రకాలు, వాతావరణ మార్పులను తట్టుకుని, అధిక దిగుబడిని ఇచ్చే లక్ష్యంతో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ వంగడాల విడుదలతో, జన్యు-సవరించిన వరి రకాలను అభివృద్ధి చేసిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. ఇవి కేవలం దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా పరిశోధనలకు, రైతులకు, వినియోగదారులకు కొత్త దారులు చూపించనున్నాయి. వాతావరణ మార్పులు, నీటి కొరత, నేలల ఉప్పు, ఇతర పర్యావరణ ఒత్తిడులు లాంటి ప్రధాన సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో ఈ వంగడాలు సహాయపడతాయనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.

ఈ కొత్త వంగడాలను 2025 మే నెలలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనమని, దేశ ఆహార భద్రతను బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

జన్యు సవరణ (జీనోమ్ ఎడిటింగ్) అంటే ఏమిటి?

జన్యు సవరణ అనేది మొక్క యొక్క డిఎన్ఎలో నియంత్రిత, ఖచ్చితమైన మార్పులు చేయడానికి శాస్త్రవేత్తలు వినియోగించే ఆధునిక సాంకేతికత. ఇందులో క్రిస్పర్-కాస్9 వంటి నూతన టెక్నాలజీ ఉపయోగించడం వల్ల, నిర్దిష్ట జన్యువులను సవరించవచ్చు. దీని వల్ల ఆశించిన లక్షణాలను (ఉదా. అధిక దిగుబడి, పంటలో తెగుళ్ల నిరోధకశక్తి, వాతావరణ సర్దుబాటు) మినహాయించి, అవాంఛిత మార్పులు లేకుండా అభివృద్ధి చేయవచ్చు.

ఇది సంప్రదాయ జన్యు మార్పిడి (జెనెటిక్ మోడిఫికేషన్) తో భిన్నంగా ఉంటుంది. జీఏం‌ఓ పంటల్లో బయటి జీవాల జన్యువులను ప్రవేశపెట్టడమయితే, జీనోమ్ ఎడిటింగ్ వద్ద డిఎన్ఎలో అత్యల్పమైన మార్పులను మాత్రమే చేస్తారు, అవి ఇక ప్రకృతిలో సహజంగా ఏర్పడే సంకేతాలు కావచ్చు.

కొత్తగా విడుదలైన వంగడాలు :-

ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు క్రిస్పర్-క్యాస్9 అనే ఆధునిక జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించి ఈ రెండు వంగడాలను అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో మొక్కల డిఎన్‌ఎలో బయటి జన్యువులను ప్రవేశపెట్టకుండానే, కావలసిన మార్పులను కచ్చితత్వంతో చేస్తారు.

  1. డిఆర్ఆర్ ధన్ 100 (కమల) :-

ఈ వంగడాన్ని హైదరాబాద్‌లోని భారత వరి పరిశోధన సంస్థ (ఐసీఏఆర్-ఐఐఆర్ఆర్) అభివృద్ధి చేసింది. ఇది ప్రసిద్ధ ‘సాంబ మసూరి’ (బిపిటి-5204) రకం ఆధారంగా రూపొందించబడింది. సైటోకినిన్ ఆక్సిడేజ్ 2 (సికెఎక్స్2) జన్యువును లక్ష్యంగా చేసుకుని, గింజల సంఖ్యను పెంచేలా ఇందులో మార్పులు చేశారు. దీనివల్ల, ఇది సాధారణ రకం కన్నా15-20 రోజులు ముందుగానే కోతకు వస్తుంది, కరవును తట్టుకుంటుంది మరియు నత్రజని వినియోగ సామర్థ్యం అధికంగా ఉంటుంది. దిగుబడి సుమారు 19% వరకు పెరిగినట్లు క్షేత్రస్థాయి పరీక్షలలో రుజువైంది.

  1. పూసా డిఎస్టి రైస్ 1

ఈ రకాన్ని న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్-ఐఏఆర్ఐ) అభివృద్ధి చేసింది. ఇది ‘ఎంటియు 1010’ (కాటన్‌దొర సన్నాలు) రకం నుండి మెరుగుపరచబడింది. కరవు మరియు లవణీయతను తట్టుకునే (డ్రాట్ అండ్ సాలినిటీ టాలరెన్స్) జన్యువును లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు. ఫలితంగా, ఈ వంగడం ఉప్పునీటి నేలల్లో మరియు క్షార నేలల్లో కూడా అధిక దిగుబడిని ఇస్తుంది. తీరప్రాంత లవణీయత ఉన్న నేలల్లో 30.4%, క్షార నేలల్లో 14.66% మరియు ఇతర ఉప్పు నేలల్లో 9.67% అధిక దిగుబడిని సాధించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

శాస్త్రీయ మరియు ప్రయోగాత్మక ప్రామాణికత :-

ఈ రకాలను మోడరన్ బయోటెక్నాలజీలో, ట్రైన్డ్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రెగ్యులేటరీ పరిశీలన నుంచి పూర్తిగా పరీక్షించి విడుదల చేశారు. పంటల దిగుబడి, పోషక విలువలు, వాతావరణ హాని నిరోధకత, ఆహార భద్రత లక్ష్యంగా వీటిని పరీక్షించగా, అన్ని ప్రమాణాలు అధిగమించి ఉన్నాయని ప్రభుత్వ మరియు స్వతంత్ర సంస్థలు వెల్లడించాయి.

రైతులకు, భారత వ్యవసాయానికి ప్రయోజనాలు :-

  • ఉన్నత దిగుబడులు
  • రోగాలు మరియు తెగుళ్ళ నిరోధకత
  • పర్యావరణ పరిరక్షణ
  • పోటీ ధరలకు ఆయుధం

ప్రాముఖ్యత మరియు భవిష్యత్తు :-

జన్యు సవరణ సాంకేతికత సాయంతో వరితో పాటుగా గోధుమ, కందిపప్పు, పత్తి, టమోటా వంటి పంటల్లోనూ భార‌త శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. పారదర్శకత, రెగ్యులేటరీ పర్యవేక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, ఆహార భద్రత ప్రమాణాలు దృఢంగా పాటించబడుతున్నాయి.

ఈ జన్యు-సవరించిన వరి వంగడాల అభివృద్ధి, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ సాంకేతికత ద్వారా పంటల ప్రజనన ప్రక్రియ వేగవంతం అవుతుంది మరియు కావలసిన లక్షణాలతో కూడిన పంటలను మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయవచ్చు.

ఈ ఆవిష్కరణ కేవలం వరికే పరిమితం కాదని, ఆవాలు, గోధుమ, పత్తి, అరటి, టమాటో వంటి పదికి పైగా ఇతర పంటలలో కూడా జన్యు సవరణపై పరిశోధనలు జరుగుతున్నాయని ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఈ పరిశోధనలు భవిష్యత్తులో భారత వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి, రైతులకు అధిక లాభాలను అందిస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డా.కె.రాజేంద్ర ప్రసాద్, డా.పి.సుజాత, డా.జి.రంజిత్ కుమార్, ఎల్. శ్రీలత, డా.జి.కిరణ్ రెడ్డి, డా.ఐ.తిరుపతి, డా.జి.వేణుగొపాల్, డా.టి.యెల్లగౌడ్ మరియు డా.భారతి నారాయణ్ భట్ వ్యవసాయ కళాశాల, జగిత్యాల.

 

 

Leave Your Comments

అవకాడో (బటర్ ఫ్రూట్) సాగులో అధిక దిగుబడులకు చేపట్టవలసిన జాగ్రత్తలు

Previous article

నూతన ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ 

Next article

You may also like