- సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు.
- ప్రతీ ఎకరాకు తాగునీరు అందేలా సాగు నీటి సంఘాలు కృషి.
- అనంతపురం జిల్లాను పండ్ల తోటల వనంగా మార్చిన ఘనత ఎన్డీఏదే.
- రాయలసీమ ఎత్తిపోతల పేరిట మభ్యపెట్టే ప్రయత్నాలు
ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని సమర్థ పాలన, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని స్పష్టం చేశారు. అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నీరు – ప్రగతి, జల హారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ”మన జీవన విధానంలో నీరు చాలా ముఖ్యం. రాయలసీమను రతనాల సీమ చేయాలని ఎన్టీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ సహా అనేక ప్రాజెక్టులు రావడానికి నాడు తెలుగుదేశం పార్టీ చూపిన చొరవే కారణం. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నీరు-చెట్టు వంటి కార్యక్రమాలు చేపట్టాం. భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా ఉన్న అనంతపురం నేడు పండ్ల తోటల వనంగా మారిందంటే అందుకు ప్రభుత్వ దూరదృష్టే కారణం. ఒక్క ఏడాదిలోనే 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం. మైక్రో ఇరిగేషన్ కింద 90 శాతం సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ+2888 ప్రభుత్వానిది. భవిష్యత్ లో సీమకు బంగారు భవిష్యత్ ఉంటుంది. హార్టికల్చర్ పై శ్రద్ధ పెట్టాం. నీటిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కరువు అనే మాటే వినపడదు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. పరిగెత్తే నీటిని నడిపించాలి. నడిచే నీటిని నిలబెట్టాలి. నిలిచిన నీటిని భూగర్భ జలాలుగామార్చి భూమినే జలాశయంగా మార్చాలి. ఒకప్పుడు సీమ అంటే నీరు లేని ప్రాంతం. ఇప్పుడు కోస్తాంధ్రతో పోటీ పడి నీటి వృద్ధి చెందుతోంది.”అని సీఎం చెప్పారు.
క్షేత్రస్థాయిలో సాగునీటి సంఘాల పనితీరు బాగుంది :-
“ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేలా తాగు నీటి సంఘాల అధ్యక్షులు కృషి చేయాలి. సమర్థ నీటి వినియోగంలో రైతుల భాగస్వామ్యం కీలకం. ఈ ఉద్దేశంతోనే 1997లో దేశంలోనే మొదటిసారిగా సాగు నీటి సంఘాలు ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థ ద్వారా 14 లక్షల నీటి సంరక్షణ కట్టడాలు నిర్మించాం. ఎంతో ప్రాధాన్యత కలిగిన సాగునీటి సంఘాలు ద్వారా చేపట్టాం.
ప్రతి ఎకరాకు నీరివ్వడమే నిజమైన జల హారతి
“నదుల అనుసంధానం జరిగి, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వగలిగితే అదే నిజమైన జల హారతి. 2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. సాగునీటిపైనే రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. వ్యవసాయానికి 900 టీఎంసీలు, పరిశ్రమలకు 40 టీఎంసీలు, తాగు నీటి కోసం 200 టీఎంసీల నీరు అవసరం. ప్రతీ ఏటా 1300 టీఎంసీల నీటితో మన రాష్ట్ర అవసరాలు తీరతాయి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి 40 నదులు, 38 వేల చెరువులు ఉన్నాయి. వీటన్నిటిలో 1300 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసుకోగలం. ఈ ఏడాది 862 టీఎంసీల నీళ్లు మన జలాశయాల్లో ఉంది. మన ప్రాజెక్టులను ఈ ఏడాది గరిష్టంగా 91 శాతం మేర నింపాం. ప్రస్తుతం మన జలాశయాల్లో రూ. 846 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి.
రాయలసీమ ఎత్తిపోతలతో మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నాలు
“ఈ ఏడాది గోదావరి నుంచి 5000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోయింది. 200 టీఎంసీల వరద జలాలు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకొస్తాం. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు, మడకశిరకు తీసుకొచ్చాం. రాష్ట్రంలోని అన్ని చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా అన్ని ప్రాంతాలకూ నీరు అందిస్తాం. బ్రహ్మంసాగర్, గండికోట, చెర్లోపల్లి తదితర ప్రాజెక్టులకు నీరు రావటం ఎన్డీఏ ఘనతే. సీమలో నీటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. అని ముఖ్యమంత్రి అన్నారు.
నీటి వినియోగదారుల సంఘాల సమావేశానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, కె.అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Leave Your Comments


























