మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

వరి నాట్లలో ఈ జాగ్రత్తలు పాటించండి

0

Paddy plantation: వరి నారును సరైన పద్దతిలో నాటకపోతే వివిధ తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది.శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యవంతమైన నారును తయారు చేసుకొని చదరపు మీటరుకు 33 కుదుళ్ళ చొప్పున నాటినట్లయితే గాలి, వెలుతురు బాగా సోకి మొక్క అధిక పిండిపదార్థాలను తయారు చేసుకుంటుంది. తద్వారా అధిక దిగుబడులు లభిస్తాయి. ఆగస్టు మాసంలో వరి నాట్లు వేసే రైతులు దిగువ సూచించిన జాగ్రత్తలు పాటించాలి.ఉత్తర కోస్తా ప్రాంతంలో ప్రధానంగా ఆగస్టులో వరినాట్లు వేస్తారు.
ఆరోగ్యవంతమైన నారు పెంపకం:

  • నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ముచేసి చదును చేయాలి.
    నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేయాలి.
  •   5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (విత్తనం చల్లేముందు 1 కిలో, మరో
    కిలో విత్తిన10-15 రోజులకు),1 కిలో భాస్వరం,1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి.
  •  శిలీంధ్రనాశనితో శుద్ధి చేసి మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడిగా నీరు పెట్టి, తర్వాత పలుచగా నీరు నిల్వకట్టాలి.
  •  జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
  •  విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్ 3జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రా. చొప్పున వేయాలి లేదా క్లోరిపైరిఫాస్ 2 మి.లీ./ లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారీ చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రా. కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి వేయాలి.
  • మండె కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో సమానంగా పలుచటి నీటి పొర ఉంచి విత్తుకోవాలి. మరుసటి రోజు నారు మడిలో నీటినిమొత్తం తీసివేయాలి.

నాట్లకు పొలం తయారీ:

నాట్లు వేయటానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయటం ప్రారంభించి 2-3 దఫాలుగా మురగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో గాని, అడ్డతోగాని చదును చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయటానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి, ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిది.
నాట్లు : నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా
తిరుగుతుంది. నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన వేస్తే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్నిబట్టి ఖరీఫ్ లో చ.మీ.కు 33 మూనలు ఉండేలా చూడాలి. ఆలస్యంగా ముదురు నారు
వేసేటప్పుడు చ.మీ.కు 44 మూనలు తగ్గకుండా నాటుకోవాలి. బాగా మెత్తగా/
బరువైన నేలల్లో దమ్ము చేసిన 2-10 రోజులలోపు నాట్లు వేయటం ముగించాలి.
నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయటం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయటానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి.

పి.వి.ఎస్. రామునాయుడు, 
ఎన్. రాజ కుమార్, ఎ. సౌజన్య, ఎన్. సత్తిబాబు,
పి. బాబు, ఎన్. కిశోర్, పి.రాజేష్, వై. స్రవంతి.
కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, ఫోన్ నెంబర్: 9848061501.

Leave Your Comments

Farmers Loan Waiver Telangana Government: నేటి నుంచి రెండో విడతగా రూ.లక్ష నుంచి లక్షాయాభై వేలకున్న రుణాల మాఫీ !

Previous article

సుస్థిర దిగుబడుల కోసం  వివిధ మెట్ట పంటల్లో ఎరువుల వాడకం  

Next article

You may also like