తెలంగాణమత్స్య పరిశ్రమవ్యవసాయ పంటలు

వర్షాకాలంలో చేపల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
    వ్యవసాయరంగంలో చేపల సాగు అత్యంత విలువైన విభాగం. మన దేశంలో చాలామంది మత్స్యరైతులు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపల సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు.  అయితే వర్షాకాలంలో చేపల పెంపకంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ కాలంలో వచ్చే అధిక వర్షాలు, గాలి వలన మట్టి మరియు దుమ్ము, పొలాల నుంచి వచ్చే రసాయనాల వల్ల నీటి నాణ్యత ప్రభావితమవుతుంది. దీని కారణంగా చేపలు వ్యాధుల బారిన పడతాయి.  పెరుగుదల మందగిస్తుంది. కొన్నిసార్లు పెద్ద మొత్తంలో చేపలు చనిపోతుంటాయి. అందుకే వర్షాకాలంలో చేపల సాగు చేపట్టే రైతులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
చేపల చెరువు యాజమాన్యం :
       ముందుగా చేపల చెరువు లేదా చేపల పెంపక ట్యాంక్ పూర్తిగా వర్షాల కోసం సిద్ధంగా ఉండాలి. చెరువు చుట్టూ గట్లను బలంగా నిర్మించి ఉంచాలి. వర్షం ఎక్కువగా వచ్చి గట్లు కూలిపోకుండా ఉండేందుకు గట్లపై గడ్డి నాటడం అవసరం. కొన్ని సార్లు వర్షపు నీరు వేగంగా ప్రవహించి చెరువులోకి వచ్చి గట్లను దెబ్బతీస్తుంది. అప్పుడు చేపలు కొట్టుకుపోవడం జరుగుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా చెరువు చుట్టూ గట్లను నిర్మించి, అవసరమైన మరమ్మతులు ఉంటే చేయాలి.
    ఇన్లెట్ (నీరు లోపలికి వెళ్లే మార్గం), అవుట్లెట్ (నీరు వెలుపలికి పోయే మార్గం) ప్రాంతాల్లో వల లేదా ఇనుప స్క్రీన్లను అమర్చాలి. వర్షపు నీరు ఎక్కువగా వచ్చి చెరువు నిండి, చేపలు అవుట్లెట్ గుండా బయటకు కొట్టుకుపోకుండా ఈ ఇనుప స్క్రీన్లు అడ్డుకుంటాయి. అదే విధంగా వర్షపు నీరు నేరుగా కుంటలోకి రాకుండా పిల్ల కాలువలు నిర్మించి వాటి ద్వారా వర్షపునీటిని కుంటలలోకి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వర్షపు నీటిని నియంత్రించవచ్చు.
    వర్షాకాలంలో నీటిలో కలుషిత పదార్థాలు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొలాల నుంచి వర్షపు నీటిలో  ఎరువులు, పురుగు మందుల అవశేషాలు చెరువులోకి వచ్చి నీటి నాణ్యతను తగ్గిస్తాయి. అటువంటి నీటిలో సహజ ఆహారమైన ప్లవకాలు తగ్గిపోవడం వల్ల చేపలకు ఆహారం అందడం తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయిలు  తగ్గి చేపలు నీటి పైకి వచ్చి నోటితో గాలి తీసుకుంటూ కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో వెంటనే స్పందించాలి. నీటి మార్పిడి చేసి చెరువులో సున్నం వేయడం వంటి చర్యలు తీసుకుంటే సమస్య కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది.
చేప వ్యాధి యాజమాన్యం:
    చేపల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వర్షాకాలంలో తేమ అధికంగా ఉండడం కారణంగా చర్మ వ్యాధులు, ఈకలు కుళ్ళిపోవడం, పొట్ట ఉబ్బు వ్యాధి, శిలీంద్రాల వలన కలిగే  వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి నివారణగా చేపలకు సమతుల్య ఆహారం ఇవ్వాలి. ఆహారం వేసే ముందు వర్షం పడుతుందా లేదా అని పరిశీలించాలి. తడి మేతను వేయకూడదు ఎందుకంటే వర్షపు నీటిలో తడి మేత త్వరగా పాడైపోయి నీటిని కలుషితం చేస్తుంది. అందువల్ల, పొడిగా ఉండే మేతను వేయాలి. ప్రతిరోజు చేపల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలి.
చేప పిల్లల పెంపక యాజమాన్యం:
        వర్షాల కారణంగా నీటి ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి అవి చిన్న చేప పిల్లలు తట్టుకోలేక మరణాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్లవకాల సాంద్రత కూడా మారుతుంది. కొత్తగా చేపల పెంపకం  మొదలు పెట్టాలనుకుంటే వర్షాకాలం అనంతరం అనుకూల సమయం. అప్పుడు నీటి పరామితులు స్థిరంగా ఉండి నీటి నాణ్యత యాజమాన్యం సులువుగా ఉంటుంది. ప్లవకాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. చేపలు వేగంగా ఎదుగుతాయి.
నీటి యాజమాన్యం :
    వర్షాకాలం తర్వాత చెరువు నిర్వహణపై పూర్తి శ్రద్ధ వహించాలి. చెరువులో నీటి రంగు, వాసన, నీటి  పారదర్శకత అన్నీ పరిశీలించాలి. నీరు  గోధుమ వర్ణంలో బురదగా కనిపిస్తే ప్లవకాలు లేవు అని అర్థం. నీటి రంగు నలుపుగా ఉంటే లేదా దుర్వాసన వస్తే, నీరు పూర్తిగా మార్చడం మంచిది. కొత్త నీటిని నెమ్మదిగా నింపాలి. ప్లవకాల అభివృద్ధి కోసం ఎరువులు తగిన మోతాదులో వాడాలి.  ఆక్సిజన్ స్థాయిలు పెంచాలి.
     మత్స్య రైతులు వాతావరణశాఖ అందించే సమాచారం, సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. టీవీ, రేడియో, మొబైల్ ద్వారా వర్ష సూచనలపై అవగాహన కలిగి ఉండాలి. వర్షం పడబోతున్న సమాచారం ఉంటే, ముందే చెరువు నుండి కొంత నీరు తీయాలి.  మేత వేయకుండా ఆపడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి. వర్షం పడిన వెంటనే మేత వేయకూడదు. వర్షపు నీరు చెరువులో పడడం వలన నీటి పీహెచ్ (నీటి ఉదజని) మారుతుంది. ప్లవకాల సాంద్రత మారుతుంది కనుక చేపలు మేత తక్కువగా తీసుకుంటాయి.
ప్రభుత్వ సహాయ నిధి :
            చివరగా, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మత్స్యరైతుల చేపల కుంటలకు నష్టం వాటిల్లితే, మత్స్యశాఖ ద్వారా పరిహారం పొందే అవకాశం ఉంది.  అయితే రైతుకు సహాయనిధి అందాలంటే ముందుగానే ఆ చెరువు మత్స్య శాఖ వారి రికార్డులో నమోదై ఉండాలి. సాగు వివరాలు, చేపల పెంపక సమయం, చేపల రకాలు, పెట్టుబడుల వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే సహాయనిధి అందించే సమయంలో పరిశీలనకు వచ్చిన ప్రభుత్వాధికారులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
           ఈ విధంగా వర్షాకాలం సమయంలో చేపల పెంపకంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు. ప్రకృతి మనకు శత్రువు కాదు, కానీ మనం తీసుకునే జాగ్రత్తలు మన సాగును సురక్షితం చేస్తాయి. ప్రతి రైతు ఈ సూచనలను పాటిస్తే, చేపల పెంపకంలో, వర్షాకాలాన్ని కూడా లాభదాయకంగా మార్చుకోవచ్చు.
ముత్తప్ప ఖవి, డి. నందిని రెడ్డి, దేవానంద్, డి. నాగలక్ష్మి, మత్స్య కళాశాల, పెబ్బేరు,  వనపర్తి జిల్లా, తెలంగాణ, ఫోన్ : 8217834079.
Leave Your Comments

Thummala Nageswara Rao: యూరియాను తక్షణమే సరఫరా చేయాలి..

Previous article

ఆఫ్ఘనిస్తాన్‌ అంజూర పండ్లు అవసరం లేదు ఇప్పుడు సోన్‌భద్రలోనే అంజూర పండ్ల సాగు.. 

Next article

You may also like