అంతర్జాతీయ జాతీయ మరియు రాష్ట్ర చేపల మార్కెట్లలో ఆహారభద్రత మరియు నాణ్యత రోజు రోజుకు ప్రాముఖ్యత సంతరించు కుంటుంది.
ప్రధానంగా చేపలు దిగుమతి చేసుకునే దేశాలు చేప ధర కంటే కూడా నాణ్యతకు చాలా ప్రోధాన్యతను ఇస్తున్నాయి.
మత్స్య ఉత్పత్తులలో నాణ్యత భద్రత అన్నది చాలా ముఖ్యము ఎందుకంటే చేపలు చాలా త్వరగా చెడిపోతాయి.
చేపల పట్టుబడి చేయు సమయంలో మరియు చేసిన తర్వాత ప్రధానంగా రవాణా మరియు శుద్ధి సమయంలో అపరిశుభ్ర విధానాలను పాటించడం ఐస్ సరిపోకపోవడం వంటివి ముఖ్యకారణాలు. చేపల ఉత్పత్తిలో ముందంజలో ఉన్న పెంపకం చేసిన చేప సకాలంలో సరైన విధంగా పట్టుబడి చేసి ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ చేయడంలో జాగ్రత్త వహించకపోతే నష్టాల బారిన పడవలసివస్తుంది. కావున చేపలు పట్టుబడి చేయునప్పటి నుండి ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ చేయు వరకు అనేక కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవలసి వస్తుంది.
చేపలు త్వరగా ఎందుకు చెడిపోతాయి:
చేప శరీరంలో ఉండే జీర్ణ గ్రంధులు,సూక్ష్మజీవులు మరియు వాటి చర్మం ద్వారా ఉత్పత్తి అయే వాటి రసాయనిక పదార్ధాలు త్వరగా చెడిపోవడానికి ముఖ్య కారణం.ఈ చర్యలు చేప ఉష్టోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. కావున చేపలు పట్టిన తర్వాత వాటి ఉష్ణోగ్రతను సున్నా డిగ్రీల సెల్సియస్ కు తగ్గించి ఉంచినచో ఎక్కువసేపు తాజాగా నిలువ చేసుకోవచ్చును.
చేపలను పట్టే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు:

1. చేపలను మార్కెట్ సైజుకు పెంచుకున్న తర్వాత మార్కెట్ చేసే ఒకరోజు ముందు మేతవేయడం మానేయాలి. ఈ విధంగా చేయటం వలన చేప యొక్క జీర్ణ ప్రక్రియ తగ్గిపోతుంది. దీని వలన చేపలు త్వరగా చెడిపోవు.
2. చేపల చెరువులో నిటిని 50% వరకు తీసివేయాలి.
3. చేపల పట్టుబడికి వాడే వలలను శుభ్రమైన తాజామంచి నీటితో పాటు క్రిమిసంహారక మందులతో కడిగి ఆరబెట్టిన తర్వాతనే పట్టుబడికి వాడాలి.
4. వ్యాధి సోకిన లేదా గాయాలతో ఉన్న వ్యక్తులను చేపల పట్టుబడిలో వినియోగించరాదు.
5. చేపల పట్టుబడి ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో గాని చేయాలి. చేపల పట్టుబడి 6 నుంచి 8 గంటలలో పూర్తి అయ్యేలా ప్రణాళికలు చేసుకోవాలి.
చేపలను పట్టిన తరువాత తీసుకోవలసినజాగ్రత్తలు:

1. పట్టుబడి చేసిన చేపలను జాగ్రత్తగా చెరువు నుండి బయటకు తీసుకువచ్చి ప్లాస్టిక్ ట్రేలలో ఒక కిలో చేపలకి ఒక కిలో చొప్పున నిల్వ చేయాలి .
2. నలిగిన గాయాలు కలిగిన చేపలను మిగతా చేపల నుండి వేరుచేయాలి.
3. వెదురు బుట్టలు మరియు చెక్క బాక్సులను ఉపయోగించరాదు.
4. పట్టుబడి చేసిన తర్వాత చేపలను పరిశుభ్రమైన తాజా మంచినీటితో కడగాలి. దీనివలన శరీరంపై నివసించు సూక్షజీవులు 90 శాతం వరకు చనిపోతాయి.
5. చేపలను నిల్వచేసిన ప్లాస్టిక్ ట్త్రేలను సూర్యకిరణాలు ప్రత్యక్షంగా పడకుండా నీడన పెట్టుకోవాలి.
6. ఇలా చేయని యెడల చేపలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
7. చేపలను ప్లాస్టిక్ ట్రేలలో ఐస్ తో పాటు అమర్చిన తర్వాత 12 గంటల లోపు గమ్యస్థానానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఎక్కువ సమయం రవాణా చేయవలసి వచ్చినప్పుడు బస్ తరచుగా మార్చుకోవాల్సి ఉంటుంది.
8. ఇన్సులేటెడ్ ట్రక్కులలో చేపల్ని రవాణా చేయడం ఉత్తమం.
9 సిఫార్సు చేసిన విధంగా ఐస్ లో లేదా ఇన్సులేటడ్ ట్రక్కులలో రవాణా చేయని యెడల నాణ్యత దెబ్బతినడమే కాక తినడానికి ఉపయోగకరంగా ఉండవు.
డా. సి.హెచ్. భానుప్రకాష్, డా. టి. ఓబులేష్మరియుడా.డి. నాగలక్ష్మి మత్స్యకళాశాల, పెబ్బేరు, ఫోన్: 62004 87614
Leave Your Comments


























