చేపల మరియు రొయ్యల సాగు రంగంలో వాటి ఆరోగ్యాన్ని కాపాడటం చాలా సున్నితమైన, సమతుల్యత తో చేపట్టవలసిన అంశం. చేపల పెంపకంలో ఉత్తమ ఫలితాల కోసం అత్యంత కీలకమైన అంశాలలో నీటి నాణ్యత ఒకటి. మనుషులకు గాలిలా, చేపలకు అవి ఉండే జీవవాతావరణంతో సంబంధాన్ని కలిగించే ప్రధాన మాధ్యమం నీరు. ఈ మాధ్యమం అస్థిరతకు లోనైతే, ఈ నీటి గుణాల లో మార్పులు వస్తే అది చేపల్లో ఒత్తిడిని కలిగించి వ్యాధులకు కారణం కావడమే కాకుండా, వ్యాధులు తీవ్రమైన సందర్భాలలో మరణాలకు కూడా దారి తీస్తుంది. ఈ “నిశ్శబ్ద హంతకులు” గా పిలవబడే ఈ నీటి గుణాలలో మార్పులు చాలా సార్లు ఆలస్యం అయిన తర్వాత మాత్రమే కనిపించవచ్చు. అందుకే, నీటి నాణ్యత పర్యవేక్షణలో మరియు యజమాన్యం లో చాలా జాగ్రత్త అవసరం.
నీటి నాణ్యత గుణాలపై అవగాహన
నీటిలో బౌతిక , రసాయన, జీవపరమైన అంశాలు ఉంటాయి. ఇవి చేపల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పరిశీలించాల్సిన నీటి గుణాలు :
- ఉష్ణోగ్రత
- పిహెచ్ (pH)
- ద్రవీభూత ఆక్సిజన్ (DO)
- అమ్మోనియా
- నైట్రైట్లు
- నైట్రేట్లు
- ఉప్పుతనం
- మచ్చికత (టర్బిడిటీ)
- నీటి ఉష్ణోగ్రత – జీవక్రియలు మరియు రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన మార్పులు – రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచి వ్యాధి కారకాల వృద్ధికి అవకాశం కల్పిస్తాయి.
- pH – అమ్మోనియా విషపూరితతను, ఎంజైమ్ల నశించిపోవడం, ప్రభావితం చేస్తుంది.
- DO స్థాయిలు తగ్గిపోతే – మొప్ప కణజాలం నశించిపోవడం , ఒత్తిడి, మరణాలకు కూడా దారి తీయొచ్చు.
- అమ్మోనియా, నైట్రైట్లు – అధిక స్థాయిలో ఉంటే మొప్ప కణజాలం నష్టం, పెరుగుదల తగ్గిపోవడం , వ్యాధుల ప్రబలడం పెరుగుతుంది.
వ్యాధులను గుర్తించుట :-
నీటి నాణ్యత క్షీణించినప్పుడు, చేపలు ఒత్తిడికి లోనవుతాయి. ఒత్తిడి అనేది చేపల పెరుగుదల, పునరుత్పత్తి, మరియు బతుకుదళ శక్తి పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది
ఒత్తిడికి లోనైన చేపలు బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల వ్యాధులకు గురవుతాయి.
- ఆకలి, ఈదే ప్రవర్తనలో మార్పులు, రోగనిరోధకత తగ్గిపోతుంది.
- పాథోజెన్లు (వ్యాధి కారకాలు) నీటిలో ఎప్పుడూ స్వల్ప స్థాయిలో ఉంటాయి. కానీ ఒత్తిడికి గురైనప్పుడు అవి వ్యాధులకు దారి తీయొచ్చు.
- దీర్ఘకాలిక ఒత్తిడితో బ్రతుకుదల శాతం తగ్గిపోవచ్చు, పెరుగుదల తగ్గిపోవచ్చు, ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు.
- వ్యాధి తీవ్రమైన సందర్భాలలో, DO తగ్గిపోతే కొన్ని గంటల్లోనే చేపల మరణాలు సంభవించవచ్చు.
- చేపల ప్రవర్తన మార్పులు – తక్కువ ఆహారం తీసుకోవడం, నీటి ఉపరితలానికి వచ్చి ఈదడం ఎగబాకడం మొదలైనవి గుర్తించకపోతే ప్రమాదం.
కేసు స్టడీలు: నీటి నాణ్యతపై ఆధారపడి వ్యాధులు
- వీరఘట్టం మండలం, పార్వతిపురం మన్యం జిల్లా ఒక కార్ప్ ఫారంలో ఆకస్మికంగా అల్గే అధికమవడం ద్వారా ఆక్సిజన్ తక్కువ అయి భారీ మరణాలు సంభవించాయి.
- శ్రీకాకులం జిల్లా పోలాకి మండల్ లో ఆకస్మికంగా కురిసిన వర్షాల తర్వాత pH తగ్గిపోయి రొయ్యల నష్టం జరిగింది.
- విజయ నగరం జిల్లా లో అధికముగా మేతలు వాడడం, మరియు చెరువు అడుగు భాగం లో సేంద్రీయ వ్యర్ధాల నిర్వహణ వల్ల అమ్మోనియా పెరగడం వలన క్యాట్ఫిష్ ఫార్మ్లలో కాలమ్నారిస్ వ్యాధి ప్రబలడం .
నిరోధక చర్యలు మరియు ఉత్తమ యాజమాన్య పద్దతులు
- నిరంతర పర్యవేక్షణ – ఉష్ణోగ్రత, DO, pH, అమ్మోనియా లాంటి అంశాలు రోజూ చెక్ చేయాలి.
- జీవ-రక్షణ చర్యలు – క్వారంటైన్, శానిటేషన్ ద్వారా వ్యాధి కరకాల ప్రవేశాన్ని నిరోధించాలి.
- మేత యజమాన్యం – అధిక ఆహారం ఇవ్వొద్దు, నాణ్యమైన ఆహారాన్ని సముచితంగా ఇవ్వాలి.
- నీటి నిర్వహణ – నీటి మార్పులు, బయోఫిల్టర్లు/ప్రోబయోటిక్స్ వాడాలి.
- అత్యవసర ప్రోటోకాల్స్ – ఎరేటర్లు, బఫర్లు సిద్ధంగా ఉండాలి.
- వివరాల నమోదు – నీటి నాణ్యత మరియు ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేయాలి.
- శిక్షణ మరియు అవగాహన – చేపల ఒత్తిడి లక్షణాలు గుర్తించగల శిక్షణ అవసరం.
చేపల రొయ్యల సాగులో, వ్యాధులు ముందుగా సంకేతాలు ఇస్తాయి. వాటిని గుర్తు పట్టుకోలేకపోతే మరణాలు సంభవించి, ఆర్థిక నష్టం సంభవిస్తుంది.
నీటి నాణ్యత మార్పులు కనిపించనివైనా తీవ్రమైన ప్రభావం చూపుతాయి. మనుషులకు గాలి ఎంత ముఖ్యమో, చేపలకు నీరు అంతే ముఖ్యమైనది. తరచూ నీటి గుణాలను పరీక్ష చేసుకుని నీటి నాణ్యత నిర్వహణ ద్వారా చేపల ఆరోగ్యం మరియు వృద్ధిని పరిరక్షించవచ్చు.
డా. సిహెచ్.బాలక్రిష్ణ, మత్స్య శాస్త్రవేత్త, డా. ఎ. దేవీ వరప్రసాద్ రెడ్డి, మత్స్య శాస్త్రవేత్త, డా. కె. భాగ్య లక్ష్మి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్, డా. జి ఎస్. రాయ్ విస్తరణ శాస్త్రవేత్త, డా. బి. సునీత, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, వి హరికుమార్, ఉద్యాన శాస్త్రవేత్త, ఎస్. కిరణ్ కుమార్ సేద్య విభాగ శాస్త్రవేత్త, ఎస్. అనూష సస్య రక్షణ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం, ఫోన్ : 94407 92616


























