మన వ్యవసాయం

గోరుచిక్కుడు సాగు పద్ధతులు

0

గోరు చిక్కుడు ఉష్ణమండల పంట. దీని లేత కాయలను కూరగాయగా వాడతారు. ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఇది తక్కువ నీటి సౌకర్యంతో కూడా పెరుగుతుంది. కాబట్టి దీన్ని కరువు పరిస్థితుల్లో, బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా పండిరచేవారు. దీన్ని కూరగాయగా కాకుండా బాగా కొమ్మలు పెరిగే గోరుచిక్కుడు రకాలను పచ్చిమేతగానూ, గింజలు పశువులకు దాణాగా వాడతారు. అంతేకాకుండా పచ్చిరొట్ట ఎరువుగా, ఔషధ తయారీలోనూ వాడతారు. ఈ మధ్యకాలంలో గోరుచిక్కుడు గింజల నుండి జిగురు తయారు చేస్తున్నారు. ఈ జిగురుకు గట్టిపరచే గుణం, నీటిలో కరిగే గుణం, తక్కువ ఉష్ణోగ్రతలో కూడా పనిచేయడం వాటి వల్ల ఈ జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్యసాధనాలలో, తిండిపదార్థాల పరిశ్రమలో వాడుతున్నారు.

ప్రపంచం మొత్తంలో 7-10 లక్లల టన్నుల జిగురు గోరుచిక్కుడు గింజల నుండి తయారుచేయబడుతుంది. కావలసిన గోరు చిక్కుడు గింజలు ఎక్కువగా భారతదేశం నుండి ఉత్పత్తి అవుతోంది. అమెరికాలో పెట్రోల్‌ పరిశ్రమలో సుమారుగా 40 వేల టన్నుల జిగురును వాడుతున్నారు. ఎందుకంటే ఈ జిగురును వాడడం వల్ల వాతావరణం, నీరు కలుషితం కాకుండా ఉంటుంది. 2012 -13 సం॥లో అమెరికా భారతదేశం నుండి సుమారుగా 60 శాతం జిగురును దిగుబడి చేసుకున్నారు. దీన్ని అనుసరించి అన్ని దేశాల గోరు చిక్కుడు జిగురును దిగుమతి చేసుకుంటున్నాయి. గోరుచిక్కుడు జిగురుకు గట్టిపరచే గుణం ఉండడం వల్ల ఐస్‌క్రీమ్‌ తయారీ, బేకరీ ఫుడ్స్‌ మొదలగు ఆహార పరిశ్రమల్లో వాడుతున్నారు. అందువల్ల ఒకప్పుడు పచ్చిమేతగా, గింజలను దాణాగా, కూరగాయగా వాడే గోరు చిక్కుడు రెండు, మూడు సంవత్సరాల్లో ముఖ్యమైన విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా మారింది.

నేల తయారీ :

మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్ర గరప నేలలు , ఒండ్రు నేలలు అనుకూ లం. అధిక సాంద్రతగల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.0-8.0 మధ్య గల నేలలు అనుకూలం.
నేలను అదును వచ్చే వరకు 4-5 సార్లు బాగా దున్నాలి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తినట్లయితే రైజోబియం క్చర్‌ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వర్షాకాలంలో 60 సెం.మీ దూరంలో కాలువలు, బోదేలు చేసుకోవాలి. వేసవిలో చిన్నమళ్ళుగా చేసి విత్తుకోవాలి.

రకాలు :
పూసా మౌసమి :
ఖరీఫ్‌ పంటకు అనువైనది. గింజ విత్తిన 70 -80 రోజులకు మొదటికోతకు వస్తుంది. కాయలు 10-12 సెం.మీ పొడవుంటాయి. మొక్క కొమ్మతో ఉంటుంది.
పూసా సదాబహార్‌ :
ఖరీఫ్‌, వేసవి పంటకు అనువైనది. గింజ విత్తిన 45-50 రోజులకే మొదటికోతకు వస్తుంది. కాయలు 12-13 సెం.మీ పొడవుంటాయి. మొక్క కొమ్మతో ఉంటుంది.
పూసా నవబహార్‌ (పూసా మౌసామి I పూసా సదాబహార్‌) :
దీని కాయలు పూసా మౌసమి మాదిరిగా ఉంటాయి. మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది. ఖరీఫ్‌, వేసవి పంటకు అనువైన రకం.
గౌరీ :
ఖరీఫ్‌, వేసవి పంటకు అనువైనది.
విత్తే సమయం :
ఖరీఫ్‌ : జూన్‌, జులై
వేసవి : జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు
విత్తన శుద్ధి :
విత్తే ముందు ఒక కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌, 8 గ్రా. ట్రైకోడెర్మావిరిడి కలిపి విత్తన శుద్ది చేయాలి.
విత్తే దూరం :
ఖరీఫ్‌ పంట 60 x15 సెం.మీ
వేసవి పంట 45 x 15 సెం.మీ
వేసవిలో మొక్క సాంద్రత ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి.

ఎరువు :
ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువు వేసుకోవాలి. సగం నత్రజని పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వేసుకోవాలి.

అంతరకృషి :
కలుపు నివారణకు పెండిమిథాలిన్‌ మందును ఎకరాకు 1.25 లీ., అలాక్లోర్‌ 1 లీ. తేలిక నేలలు 1.25 లీ. (బరువు నేలలు) చొప్పున 200 లీ. నీటిలో కలిపి నాటిన 48 గంటలోపు పిచికారి చేయాలి. తడినేలపై పిచికారి చేయాలి. 30 రోజులకొకసారి గొర్రు తవ్వి అంతరకృషి చేయాలి.

నీటి యాజమాన్యం :
గింజలు విత్తగానే నీరు పారించాలి. మూడవ రోజు మరల ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి 4-10 రోజుల కొకసారి నీటి తడులివ్వాలి.

పేను బంక :
చిన్న పెద్ద పురుగు లేత చిగుళ్ళు ఆకు నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌డెమటాన్‌ లేదా పాసలోన్‌ లేదా పిప్రోనిల్‌లోని ఏదైనా ఒక మందును 2 మి.లీ లీటరు నీటికి కలిపి మందు మారుస్తూ పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు :
ఆకు మీద నల్లని మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్‌ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎండు తెగులు :
మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి 8 గ్రా. విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. కిలో ట్రైకోడెర్మావిరిడి, 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలో వేప పిండితో కలిపి వారం రోజులు నీడలో మాగనిచ్చి ఆఖరిదుక్కిలో వేసుకోవాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నే తడిచేలా పొయ్యాలి. పంట మార్పిడి పాటించాలి.

కోత :
లేత కాయలను కోసి మార్కెట్‌కు పంపాలి. ముదిరిన కాయల్లో పీచుశాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గుతుంది.

దిగుబడి :
ఒక ఎకరాకు 20-25 క్వింటాళ్ళు వస్తుంది.

కోత అనంతరం ఉత్పత్తులు :
ఒక శాతం ఉప్పు ద్రావణంలో గోరుచిక్కుడు కాయల మొక్కను ముంచి 10 నిమిషాల తరువాత తీసి ఆరబెట్టాలి.

Leave Your Comments

 ఇక రైతు బంధు ఇంటికే….

Previous article

అంకాపూర్లో మహిళా రైతుల వ్యవసాయం …

Next article

You may also like