ఆంధ్రప్రదేశ్తెలంగాణపశుపోషణరైతులు

పెరటి కోళ్ళలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు మరియు నివారణ

0
  1. అంతర పరాన్న జీవులు (నట్టలు, నులిపాములు):

పెరటిలో పెంచే కోళ్ళు ఆరుబయట తిరుగుతుంటాయి. గడ్డి మరియు గింజలను తింటున్నపుడు వివిధ రకాలు అంతర పరాన్నజీవులు వాటిని ఎక్కువగా ఆశిస్తాయి. కావున క్రమం తప్పకుండా నట్టలమందును త్రాపడం మంచిది. ఈ కార్యాక్రమాన్ని అందరు రైతులు కలసి గ్రామములో ఒకేసారి చేసినట్లేఅయితే నట్టలను/అంతర పరాన్న జీవులను సమర్ధవంతంగా నివారించవచ్చును.

క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయడం ద్వారా కేవలం నట్టలనే కాకుండా ఇంకా ఎన్నో రకాల వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు. దీని కొరకు పైపరజిన్ సిట్రేట్ అనే మందును ఒక చెంచాడు అర లీటరు నీళ్లలో కలిపి (10 కోళ్ళకు  సరిపోతుంది) త్రాగటానికి ఉపయోగించాలి. ఈ పద్ధతిని 15 నుంచి 20  రోజుల వయస్సు పిల్లల నుండి క్రమం తప్పకుండా పాటించడం ద్వారా కోళ్ళలో నట్టలను  నివారించవచ్చును.

  1. కొక్కెర తెగులు (రానిఖేట్ వ్యాధి):

రెట్ట ఆకుపచ్చగా ఉండి, నీళ్ళ లాగా వాసనతో పారుతుంది. ముక్కు నుండి నీరు కారడం, తల మెడ ఒక వైపు వాలి ఉండడం, వణకడం లాంటి లక్షణాలు కలిగిన ఈ వ్యాధి పేరు కొక్కెర తెగులు.

ఇది సూక్ష్మాతి సూక్ష్మజీవి వల్ల ముఖ్యంగా వేసవి  కాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వ్యాధి. ఈ వ్యాధి సోకిన తర్వత చేసే చికిత్స కంటే నివారణే మేలు. నివారణ అనేది టీకాల ద్వారా చేస్తారు. ఈ టీకాలు వ్యాధి సోకిన తర్వత ఇచ్చి లాభము లేదు. అందుకని వ్యాధి సోకక ముందే అంటే ప్రతి నవంబర్ – డిసెంబర్ నెలలో ఇవ్వటం వలన ఈ వ్యాధినీ నివారించవచ్చు. ఇలా ఇవ్వటం అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తారు.

మొదట ఒక వారం లోపు పిల్లలకు కొక్కెర తెగుల టీకా మందు కళ్ళు లేదా ముక్కులో చుక్కలుగా వేయాలి. తిరిగి అదే ముందును 8  నుండి 10  వారాల మధ్య వేసి ఆ తరువాత ప్రతి సంవత్సరం వేస్తూ వుంటాడం ద్వారా ఈ వ్యాధినీ పూర్తిగా నివారించవచ్చు. ఈ టీకా మందు ప్రభుత్వ పశువైద్యశాలల్లో ఉచితంగా ఇవ్వబడును. అదే వ్యాధి సోకిన కోడికి టెట్రాసైక్లిన్ పౌడర్ అనే ముందును అర టీకప్పు నీళ్ళలో చిటికెడు చొప్పున కలిపి రోజుకు 3 సార్లు, 5 రోజులు ఇవ్వాలి.

  1. తెల్లపారుడు: (బాసిల్లరి వైట్ డయిహేరియా) :

ఇది సూక్ష్మ క్రిముల ద్వారా ముఖ్యంగా చిన్న పిల్లలలో వ్యాప్తి చెందే అంటూవ్యాధి. ఈ వ్యాధి సోకిన వాటిలో కొన్ని చనిపోగా, కొన్ని తిరిగి కోలుకుంటాయి. వ్యాధి సోకిన కోళ్ళు నలతగా ఉండి మూడుచుకోని కూర్చుంటాయి. రెట్ట నీళ్ళగా  తెలుపు లేదా లేతా పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈ వ్యాధి  సోకిన కోళ్ళకు సల్ఫా లేదా లేదా టెట్రాసైక్లిన్ అనే ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్ళలో కలిపి రోజుకు రెండు సార్లు చొప్పున ఇవ్వాలి.

  1.  అమ్మోరు లేదా మశూచి: (ఫౌల్ ఫాక్స్):

ఈ వ్యాధి సోకిన కోళ్ళ ముక్కు, ముఖం, కంటి రెప్పలు, దవడల పైన పొక్కులు వచ్చి ముక్కు నుండి, కంటి నుండి నీరు కారుతూ ఉంటుంది. ఈ వ్యాధి కూడా ఒక సూక్ష్మాతి సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది. అతి తక్కువ కాలంలోనే అన్ని కోళ్ళకు వ్యాప్తిస్తుంది . ఈ వ్యాధి వల్ల చాలా తక్కువ కోళ్ళు చనిపోతాయి. కానీ వ్యాధి వల్ల కోళ్ళు సరిగా మేత. నీరు తీసుకోలేక గ్రుడ్లు పెట్టటం తెగిపోయి, ఆర్థికంగా నష్టం కలుగచేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. చర్మం పై కురుపులలో ఇతర సూక్ష్మ క్రిములు చేరకుండా ఉంటేందుకు పసుపు మరియు వేపనూనె మిశ్రమాన్ని పూతగా పూయాలి.

  1. కొరైజా వ్యాధి :

ఈ వ్యాధి సూక్ష్మజీవి వల్లన కోళ్ళతో పాటు అన్ని రకాల పక్షుల్లో కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్ళ కంటి పొర ఎర్రగా మారి,కంటి నుండి ఎక్కువగా నీరు కారుతుంది. శ్వాస కష్టంగా ఉండి, శ్వాస తీసుకునేటపుడు ‘కీచు’ మని శబ్దం వస్తుంది. ముఖం, చర్మం క్రింద నీరు చేరి వసిపోయి ముక్కు నుండి చిక్కటి జిగురు లాంటి స్రావాలు వస్తాయి. ఈ లక్షణాలను బట్టి వ్యాధిని సులభంగా గుర్తించవచ్చును. పశువైద్యుని సలహాలతో స్ట్రెప్టోమైసిన్ ఇంజక్షన్లు 3-5 రోజులు వాడి వ్యాధిని నివారించుకోవచ్చును లేదా తియాముటిన్ అనే మందును చిటికెడు ఒక టీ గ్లాసు నీళ్ళలో కలిపి రోజుకు 3-5 సార్లు త్రాగించాలి.

  1. కాక్సిడియా :

ఈ వ్యాధి కాక్సిడియా, ఐమీరియా, జాతికి చెందిన ఏక కణ జీవుల వలన అన్ని వయస్సుల కోళ్ళలో కలుగుతుంది. అస్వస్థత వున్న కోడి మలముతో కలుషితమైన మేత, నీరు ద్వారా ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన కోళ్ళు నీరసంగా ఉండి, మంద నుండి ఒక ప్రక్కకు చేరి గుంపుగా కూర్చుంటాయి. రక్తంతో కూడిన విరోచనాలు, నిలబడి కునుకుతూ ఉండడం ఈ వ్యాధి లక్షణాలు. చనిపోయిన కోడికి శవ పరీక్ష జరిపిన చిన్న ప్రేగులు లేదా పెద్ద ప్రేగు వాచిపోయి రక్తంతో నిండి ఉంటుంది. నైట్రోపురోజోన్, కాక్సిమార్, ఆంప్రోలియం తదితర మందులను పశువైద్యుని సహాయముతో వాడి వ్యాధిని నివారించవచ్చును.

పైన పేర్కొన్న ఈ సూచలను మరవకుండా పాటించినట్లయితే పెరట్లో కోళ్ళ పెంపకము సజావుగా చేపట్టవచ్చును. పెరటి కోళ్ళ పెంపకం ద్వారా అదనపు ఆదాయంతో పాటు కుటుంబం మొత్తానికి పౌష్టిక ఆహారము లభిస్తుంది.

డా. బి. నవీన్, శాస్త్రవేత్త, వ్యవసాయ విస్తరణ విభాగం డా. డి. సుధా రాణి , సీనియర్ శాస్త్రవేత్త & సమన్వయ కర్త, మరియు శ్రీ. జె. యశ్వంత్ కుమార్, శాస్త్రవేత్త, మత్స్య విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల.

Leave Your Comments

ప్రధాన్ మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకం

Previous article

మిద్దెతోటలో పెంచుకోదగిన ఔషధ మరియు సుగంధ తైల మొక్కలు

Next article

You may also like