ఆంధ్రప్రదేశ్తెలంగాణపశుపోషణరైతులు

పశువుల ఆరోగ్య పరిరక్షణలో మినరల్స్ ప్రాముఖ్యత

0
పరిచయం :-  పశువులకు అందించే గడ్డి, వడ్లు మరియు పంట అవశేషాలు శక్తి, ప్రొటీన్ కొంతవరకు అందించిన  ఖనిజాల పరంగా తక్కువగా ఉంటాయి. ఈ లోపం పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పశువులు తరచూ అనారోగ్యానికి గురవడం, ఎముకల బలహీనత, పిల్లల పెరుగుదల మందగించడం వంటి సమస్యలకు దారితీస్తోంది. రైతు స్థాయిలో కనిపించే ఉత్పాదక లోపాల్లో ఇవి ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. ఆధునిక పశు పోషణ పద్ధతులలో ప్రధాన సవాలు పశువులకు సమతుల్యమైన, శాస్త్రీయంగా ప్రణాళిక చేసిన ఆహారం అందించడం. మనం ఉపయోగించే సాధారణ మేత పదార్థాలు పశువుల అవసరాలను పూర్తిగా తీర్చలేవు. ముఖ్యంగా ఖనిజాలు తగిన మోతాదులో లభించకపోవడం వల్ల పాల ఉత్పత్తి, మరియు ఆరోగ్య స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
     ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల అభివృద్ధికి ఖనిజాలు కీలకం. ఇవి శరీరంలో స్వయంగా ఉత్పత్తి కావు, గడ్డిలోనూ మరియు ఇతర మేతలోనూ అవసరమైన స్థాయిలో ఉండవు. కాల్షియం, ఫాస్‌ఫరస్, కాపర్, కోబాల్ట్, జింక్, అయోడిన్ వంటి కీలక ఖనిజాలు అనేక ప్రాంతాలలో గణనీయంగా తక్కువగా లభిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రైతు ఆహార పట్టికలో మినరల్ మిక్చర్లు లేదా ఖనిజ లవణ మిశ్రమం తప్పనిసరిగా చేర్చాలి. మినరల్ మిక్చర్ వాడకం పశువుల పాల ఉత్పత్తి, సామర్థ్యం, రోగనిరోధక శక్తి మరియు సమగ్ర ఆరోగ్యం మెరుగుపడటానికి కీలకంగా పనిచేస్తుంది. ఇది తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే పోషక పరిష్కారం.
మినరల్ మిక్చర్ అవసరం రైతుకి ఎందుకు?
మినరల్స్ పశువుల శరీరానికి పునాది /బలం, ఇవి లేకపోతే పశువులు ఎంత మేత తిన్నా ప్రయోజనం ఉండదు. మినరల్స్ యొక్క సరైన సేవనతో దూడలు బలంగా పెరుగుతాయి, ఆవులు మరియు గేదెల పాలలో ఫ్యాట్ మరియు SNF శాతం గణనీయంగా పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా సంతాన సమస్యలు తగ్గి వాటి పిల్లలు ఆరోగ్యంగా పుడతాయి, అలాగే పశువులకు వ్యాధుల వచ్చే అవకాశాలు తగ్గి మందుల ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా మినరల్స్ పశుపోషణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి మరియు పశువుల మొత్తం ఆరోగ్య స్థితి మరియు ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి.
ఖనిజాల వర్గీకరణ :-  పశువుల శరీరానికి 15 రకాల అవసరమైన ఖనిజాలు అవసరం. ఇవి రెండు రకాలుగా విభజించవచ్చు
1. మ్యాక్రో ఖనిజాలు (7) :-
కాల్షియం (Ca), ఫాస్ఫరస్ (P), సల్ఫర్ (S), సోడియం (Na), మెగ్నీషియం (Mg), క్లోరిన్ (Cl), పొటాషియం (K).
2. మైక్రో ఖనిజాలు / ట్రేస్ ఎలిమెంట్స్ (8) :
ఐరన్ (Fe), కాపర్ (Cu), కోబాల్ట్ (Co), మాంగనీస్ (Mn), మోలిబ్డినమ్ (Mo), అయోడిన్ (I), జింక్ (Zn), సెలీనియం (Se).
ఖనిజాల ప్రధాన విధులు :-
    పశువుల ఆరోగ్యానికి ఖనిజాలు చాలా ముఖ్యమైనవి. కాల్షియం ఎముకల బలం, పాలు నిర్మాణం, కండరాల పనితీరుకు అవసరం కాగా, ఫాస్ఫరస్ శక్తి, దంతాలు, కణజాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం ఎంజైమ్ పనితీరు మరియు నరాల సమతుల్యాన్ని కాపాడుతుంది. జింక్ చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఫెర్టిలిటీకి తోడ్పడుతుంది. కాపర్ ఎర్ర రక్తకణాల నిర్మాణం, సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది.సెలీనియం రోగనిరోధక శక్తిని, ఫెర్టిలిటీని మెరుగుపరుస్తుంది. మాంగనీస్ అండోత్పత్తి, ఎముకల ఎదుగుదలలో సహాయపడుతుంది. కాబట్టి, మేతలో ఈ ఖనిజాలు లేకపోతే, పశువులు కడుపునిండా తిన్నా సరైన పాలు ఇవ్వలేవు.
మినరల్ మిక్చర్ వాడకంతో కలిగే లాభాలు :-
• దూడలు వేగంగా పెరిగి బలంగా అవుతాయి.
• ఆవులు త్వరగా హీట్‌లోకి వస్తాయి → సంతానం త్వరగా కలుగుతుంది.
• పాల పరిమాణం, SNF, ఫ్యాట్ శాతం పెరుగుతాయి.
• రోగాలు తగ్గుతాయి → మందుల ఖర్చు తగ్గుతుంది.
• రిపీట్ బ్రీడింగ్ సమస్య తగ్గుతుంది.
• మిల్క్ ఫీవర్, కీటోసిస్, అనీమియా (రక్త హీనత ) వంటి వ్యాధుల నివారణ
పశువుల కోసం సూచించిన మోతాదులు:-
మినరల్ మిక్చర్ తయారీ విధానం :-
    ఒక మంచి మినరల్ మిక్చర్ తయారీలో ప్రధానంగా కొన్ని ఖనిజ పదార్థాలను ఆధునిక మిక్సర్‌లతో సమానంగా కలిపి తయారు చేస్తారు. అందులో డైకాల్షియం ఫాస్ఫేట్ (DCP), మెగ్నీషియం ఆక్సైడ్, కాపర్, జింక్, మాంగనీస్, కోబాల్ట్ లవణాలు, పొటాషియం అయోడైడ్ (అయోడిన్ మూలం) వంటివి ఉంటాయి. ఈ మినరల్ మిక్చర్ సరిగ్గా కలిసినపుడు మాత్రమే పశువులకు కావాల్సిన అన్ని ఖనిజాలు అందుతాయి.
మినరల్ మిక్చర్ వాడకం – రైతులకు సూచనలు :-
   గత కొంతకాలంగా పశువులలో పాల ఉత్పత్తి, ఆరోగ్యం, పిల్లల పెరుగుదలలో తేడాలు రావడానికి ప్రధాన కారణం ఖనిజాల కొరత. ఈ సమస్యను అధిగమించడానికి భారతీయ ప్రమాణ సంస్థ (BIS) రెండు రకాల మినరల్ మిక్చర్లు (టైప్–1 మరియు టైప్–2) సిఫారసు చేసింది.
టైప్–1 మినరల్ మిక్చర్
• ఇది సాధారణంగా మన దేశీయ ఆవులు, తక్కువ పాలు ఇచ్చే జాతులు మరియు క్రమమైన పెంపకంలో వాడుకోవడానికి సరైనది.
• పాల ఉత్పత్తి 6–8 లీటర్ల వరకు ఇచ్చే పశువులకు ఉపయోగపడుతుంది.
• దీన్ని రోజుకు 50–60 గ్రాములు concentrate feed (పిండి, గింజలు)లో కలిపి ఇవ్వాలి.
టైప్–2 మినరల్ మిక్చర్
• ఇది ఎక్కువ పాలు ఇచ్చే జెర్సీ, హైబ్రిడ్, ఫ్రెషియన్ ఆవులు, ముర్రా జాతి ఎద్దులు వంటి అధిక ఉత్పత్తి జాతులకు అవసరం.
• పాల ఉత్పత్తి 10 లీటర్లకు పైగా ఇచ్చే పశువులకు ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అందుకే టైప్–2 మినరల్ మిక్చర్ వాడాలి.
• దీన్ని రోజుకు 75–100 గ్రాములు concentrate feedలో కలిపి ఇవ్వాలి
  • మినరల్ మిక్చర్‌ ప్లాంటు

BIS ప్రతిపాదించిన టైప్–1 మరియు టైప్–2 మినరల్ మిక్చర్ల కూర్పు 
పట్టిక రూపంలో:
టైప్–1 = సాధారణ పాల ఉత్పత్తి పశువులకు.
 టైప్–2= అధిక ఉత్పత్తి పశువులకు (జెర్సీ, ఫ్రెషియన్, ముర్రా మొదలైనవి).
మినరల్ మిక్చర్ యొక్క సాధారణ కూర్పు
మినరల్ మిక్చర్‌లో వివిధ ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉంటాయి. ఒక కిలో మినరల్ మిక్చర్‌లో సుమారు కాల్షియం 35%, ఫాస్ఫరస్ 17.5%, మెగ్నీషియం 6000 mg, ఐరన్ 1500 mg, కాపర్ 1200 mg, జింక్ 9600 mg, మాంగనీస్ 1500 mg, అయోడిన్ 350 mg, సెలీనియం 1 mg ఉంటాయి. అదనంగా విటమిన్ A (10,00,000 IU), విటమిన్ D3 (1,00,000 IU), విటమిన్ E (350 mg) కూడా కలుపుతారు. ఈ సమ్మేళనం పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంలో, పాల ఉత్పత్తిని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మినరల్ మిక్చర్ :-
చీలేటెడ్ మినరల్స్ – ఆధునిక పరిష్కారం :-
సాధారణ మినరల్ మిశ్రణలో కలిగిన ఖనిజాలు శరీరానికి పూర్తిగా ఉపయోగపడవు, అయితే వాటిని ప్రోటీన్ లేదా అమినో ఆమ్లాలకు బంధించే విధంగా (చీలేటెడ్ మినరల్స్- Fig 2.) తయారు చేస్తే, శరీరం వాటిని ఎక్కువ శాతం గ్రహిస్తుంది. ఈ చీలేటెడ్ మినరల్స్ వల్ల ఖనిజాల శోషణ గణనీయంగా పెరుగుతుంది, వ్యర్థాలు తక్కువగా ఉండటంతో పాటు పాల ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ ఉన్నత నాణ్యత గల మినరల్స్ వల్ల పిల్లలు ఆరోగ్యంగా మరియు బలంగా పుడుతున్నాయి, అలాగే పశువుల రోగనిరోధక శక్తి మెరుగవడంతో వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గి మొత్తం ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా చీలేటెడ్ మినరల్స్ సాధారణ మినరల్స్ కంటే చాలా ఎక్కువ ప్రభావవంతంగా పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను పెంచుతాయి.
చీలేటెడ్ మినరల్స్ :-
ఖనిజాల్లో లోపం వల్ల వచ్చే సమస్యలు
పశువులకు తగిన ఖనిజాలు అందకపోతే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు మిల్క్ ఫీవర్ అనేది ప్రసవ సమయంలో కాల్షియం లోపం వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధి, కీటోసిస్ అధిక పాలు ఇచ్చే పశువుల్లో శక్తి లోపం వల్ల సంభవిస్తుంది. అలాగే గ్రాస్ టెటని అనేది పచ్చి గడ్డి అధికంగా తిన్నపుడు మెగ్నీషియం లోపం వల్ల వచ్చే తీవ్రమైన సమస్య, మరియు అనీమియా వల్ల రక్తహీనత, బలహీనత మరియు ఉత్పత్తి గణనీయంగా తగ్గుదల ఏర్పడుతుంది. ఈ అన్ని సమస్యలూ సరైన మినరల్ సప్లిమెంటేషన్ లేకపోవడం వల్లనే వస్తాయి, కాబట్టి పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకత కొనసాగించడానికి సమతుల్య మినరల్ మిశ్రణ అందించడం అత్యంత అవసరం.
ఖనిజ లవణ మిశ్రమం ఖర్చు :-
పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతకు మినరల్ మిశ్రణలు అత్యంత కీలకమైనవి, అయితే మార్కెట్లో వివిధ రకాల మినరల్ మిక్చర్లు లభిస్తున్నాయి. వీటిలో సరైన ఎంపిక చేసుకోవడం రైతుల లాభదాయకతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
సాధారణంగా మార్కెట్లో దొరికే సాధారణ మినరల్ మిక్చర్లు (Regular formulations) ఒక్క కిలోకి సుమారు ₹60–80 ఖర్చవుతాయి, వీటిని వాడితే పాల ఉత్పత్తి సుమారు 8–10% వరకు పెరుగుతుంది. దీని బదులుగా ప్రాంత ప్రత్యేక మినరల్ మిక్చర్లు (ASMM) ఒక్క కిలోకి ₹80–120 వరకు ఖర్చవుతాయి, కానీ వీటివల్ల పాల ఉత్పత్తి 15–20% వరకు పెరుగుతుంది. అంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినా, ఫలితం మంచి లాభం ఇస్తుంది. ఇలా ఆహారం, ఖనిజ లవణ మిశ్రమం సక్రమంగా ఇస్తే పాల ఉత్పత్తి పెరిగి, పునరుత్పత్తి మరియు ఆరోగ్యం బాగా మెరుగవుతాయి.
ముగింపు:-  సాధారణ మినరల్ మిక్చర్ల స్థానంలో, అధిక ప్రతిపాదన కలిగిన ప్రాంతీయ ప్రత్యేక మినరల్ మిక్చర్లు (ASMM) లేదా చీలేటెడ్ మినరల్స్ కలిగిన మిక్చర్లు ఉపయోగించడం ద్వారా పశువుల పాల ఉత్పత్తి, ఆరోగ్యం, సంతాన సమస్యల నివారణ, మరియు రోగ నిరోధక శక్తి పెంపులో గణనీయమైన మెరుగుదల సాధించవచ్చు. ఈ ఆధునిక మినరల్ మిశ్రమాల వినియోగం రైతులకు ఎక్కువ లాభం, తక్కువ ఖర్చు, మరియు సుస్థిర ఉత్పత్తి పొందడంలో సహాయపడుతుంది.
డా.సి అనిల్ కుమార్, పశుపోషణ విభాగం,ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల , గన్నవరం,  ఫోన్ : 8008935550
Leave Your Comments

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి

Previous article

పత్తి లో సమగ్ర సస్యరక్షణ ద్వారా కాయతొలిచే పురుగుల నివారణ

Next article

You may also like