ఉష్ణోగ్రతలో పెరుగుల వలన పంట పెరుగుదల, దిగుబడి తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలలో పెరుగుదల మందగించడం, రసంపిల్చే పురుగులు మరియు వేరు ఎండు తెగుళ్ళ ఉధృతి పెరగడం, ఆకులు మాడిపోవడం (ఉదాహరనకు మార్చి నేలలో నాటిన అరటి మొక్కలు ఎండ వేడిమికి మాడిపోతాయి). పువ్వులు, పండ్లు రాలిపోవడంతో పాటు పండ్ల పరిమాణంలో తగ్గుదల కనిపిస్తుంది. వేడి వాతావరణం వలన పాలు ఇచ్చే పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 0.5 నుండి 3.5 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వలన పశువులు ఎక్కువగా నీటిని తీసుకొని తక్కువ మేత తినడం వలన పాల దిగుబడి తగ్గుతుంది.
వేసవిలో అనగా మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చే వడ గాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను, పండ్ల తోటలను కొన్ని యాజమాన్య పద్దతులను పాటించడం ద్వారా కొంత వరకు నష్టాన్ని నివారించవచ్చు.

వ్యవసాయ పంటల్లో జాగ్రత్తలు :-
- అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగల రకాలు, వంగడాలను సాగు చేసుకోవాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా పంట దశ, నేల స్వభావాన్ని బట్టి తగినంత నీటి తడులు ఇచ్చుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో తేమ సున్నిత దశల్లో తప్పని సరిగా నీటి తడులు ఇవ్వాలి.
- వరి పంటలో పొట్ట, పూత దశల్లో పొటాషియం నైట్రేట్ 5.0 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే వరి పంటలో అధిక ఉష్ణోగ్రతలతో కలిగే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. వరి పంట దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2.0 సెo.మీ. ఎత్తున నీరు నిలివ ఉంచాలి. అంకురం దశ నుంచి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2.0 సెo.మీ. లేదా 5.0 సెo.మీ. నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పద్దతుల్లో నీటి తడులు ఇవ్వాలి.
- మొక్కజొన్న పంట తట్టుకోదు. కావున పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుంచి కంకి ఏర్పడిన 25 రోజుల తర్వాత వరకు జివసంరక్షణ నీటి తడి ఇవ్వాలి.
ఉద్యాన తోటల్లో జాగ్రత్తలు :-
- నీటి వసతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి తరుచుగా నీటి తడులు ఇవ్వాలి.
- పండ్ల తోటలకు అవకాశం ఉన్న రైతులు సేంద్రియ పదార్థాలైన గడ్డి, పంట అవశేషాలు తదితర పదార్థాలతో మొక్కల మొదళ్ళలో ఆచ్చాదన (మల్చింగ్) చేయడంతో పాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మల్చింగ్చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి, మొక్కకు ఎక్కువ రోజుల వరకు అందుబాటులో ఉంటుంది.

- మామిడి తోటలో ఏప్రిల్ -మే మాసంలో పొటాషియం నైట్రేట్ (13.0.45) @10 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. ఒకటి లేదా రెండేళ్ళ వయసు గల పండ్ల తోటలు లేదా కొత్తగా నాటిన తోట చుట్టూ వేసవిలో వడగాల్పుల ప్రభావం తగ్గించడానికి సరుగుడు లేదా వెదురు మొక్కలను నాటుకోవాలి. అలాగే మొక్క చుట్టూ పచ్చ రొట్టె ఎరువులను వేసుకోవాలి.
- కూరగాయల పంటల్లో అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగల రకాలను సాగుచేసుకోవాలి. తరుచుగా నీటి తడులు ఇవ్వాలి.
- ప్రధాన పంటపై వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి, మొక్కజొన్నను 3-4 వరుసల సరి హద్దు పంటగా వేసుకోవాలి. ప్రతి 20-25 మీటర్ల దూరంలో అంతర పంటగా వేసుకోవాలి. ఇలా మొక్కజొన్న పంటను సరిహద్దు మరియు అంతర పంటగా వేయడం వలన పురుగు ఉధృతిని కూడా అదుపు చేయవచ్చు.
పశు పోషణలో జాగ్రత్తలు :-
- అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురివుతాయి.
- వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు ఇవ్వడం మoచిది. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్దిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాల్లో, ఎండుగడ్డిని రాత్రి సమయాలలో వేర్వేరుగా ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వాలి.

- మేపు కొరకు జీవాలను ఎండవేళల్లో కాకుండా ఉదయం పూత 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు బయటకు పంపడం మంచిది.
- వ్యాధి నిరోధక టీకాలు ఇది వరకు వేయించని పశువులు, గొర్రెలు, మేకలకు గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు వ్యాధి వివరణ టీకాలు వేయించాలి.
- కోళ్ళు పొడి, వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి షెడ్లలో ఫ్యాన్లను, ఫాగార్లను అమర్చాలి. షెడ్లను వరి గడ్డితో కప్పి స్ప్రింక్లార్లు అమర్చాలి. కోళ్ళు ఎక్కువ మోతాదులో దాణా తినటం కోసం మెత్తటి దాణాతో పాటు చల్లని తాగు నీటిని అందుబాటులో ఉంచాలి.
డా. జి.నారాయణస్వామి, సీనియర్ శాస్త్రవేత్త (వ్యవసాయ వాతావరణ విభాగం), డా. జి.డి. ఉమాదేవి, రీసర్చ్ అసోసియేట్(జి.కె.ఎం.ఎస్), కె.వి.యస్. సుధీర్, శాస్త్రవేత్త (వ్యవసాయ వాతావరణ విభాగం) డా. యo. విజయ్ శంకర్ బాబు, ప్రధాన శాస్త్రవేత్త,(మెట్ట వ్యవసాయం) & అధిపతి వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురం.


























