ఆంధ్రా వ్యవసాయం

పత్తిలో సమస్యాత్మక కలుపు- వయ్యారిభామ, తుత్తురబెండ

0

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాధారంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటల్లో పత్తి ప్రధానమైనది. దాదాపు 6 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పైరు రాష్ట్రంలో 50-75 రోజుల దశలో ఉంది. పత్తి సాగు చేసే రైతాంగం ఎక్కువగా తమ కమతాల్లో కలుపు లేకుండా జాగ్రత్త పడుతున్నప్పటికి గట్ల మీద, వారి పొలం చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పొలానికి దగ్గరగా ఉన్న రోడ్ల దగ్గర ప్రమాదకరమైన తుత్తురబెండ, వయ్యారిభామ కలుపు పత్తి దిగుబడుల మీద మరియు నాణ్యత పైన గణనీయమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు చాలా మొండి జాతివి అంతే కాకుండా కాలంతో నిమిత్తం లేకుండా మొలిచి పూతకు వస్తాయి. తుత్తుర బెండ మరియు వయ్యారిభామ కలుపు మొక్కలు నూగు కలిగి వుంటాయి. ఇవి పత్తి పైరులో పని చేసే వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందలు కలిగిస్తాయి. ఈ మొక్కల్లోని పుప్పొడి అలాగే విషపూరిత రసాయనాలు నీటి ద్వారా, గాలి ద్వారా నేలోకి చేరి ఇతర పంట మొక్కను పెరగనివ్వవు. అలాగే నేలలోని సూక్ష్మజీవుల మీద కూడా ప్రభావం చూపిస్తాయి.

వయ్యారిభామ

పత్తి పంటలో ఇటీవల కాలంలో సమస్యాత్మకంగా వున్న రసం పీల్చు పురుగులైన తామర పురుగు, తెల్ల దోమ, పిండినల్లి, పేనుబంకకు ఈ మొక్క ప్రత్యామ్నాయ ఆవాసాలు. పత్తి పంట లేనప్పుడు ఈ రసం పీల్చుపురుగులన్నీ కూడ గట్ల మీద ఉన్న తుత్తుర బెండ, వయ్యారిభామ మొక్క మీద ఆవాసాలు ఏర్పరుచుకుని వృద్ధి చెందుతాయి. తామర పురుగులు, తెల్ల దోమ పలు వైరస్‌ తెగుళ్ళకు వాహకాలుగా ఉన్నాయి. పత్తి లో టుబాకో స్ట్రీక్‌ వైరస్‌ తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది. పత్తి పైరులో మొక్క తొలి దశలో కలుపు నివారణ చాలా ముఖ్యం. రైతాంగం అంతర కృషి ద్వారా వాటిని నివారిస్తున్నారు. కానీ గట్ల మీద ఉన్న కలుపు, పంట కాలం మొత్తం పెరుగుతూనే వుంటాయి. ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు అధిక విత్తనోత్పత్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏపుగా పెరిగే సామర్ధ్యం ఉండటం వల్ల లక్షల్లో విత్తనాను ఉత్పత్తి చేస్తాయి. ఈ విత్తనాలు గాలి, నీరు ద్వారా సుదూరాల వరకు వ్యాప్తి చెందగలవు. వీటికి నిద్రావస్థ కూడా దాదాపు 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది.

తుత్తురబెండ

పత్తి పంట విత్తిన తరువాత దాదాపు 150 రోజుల వరకు పొలంలో ఉంటుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు పలు వాతావరణ ఒడిదుడుకుకు లోనవుతుంది. బెట్ట పరిస్థితుల్లో తామర పురుగు మరియు పిండినల్లి ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి ఎక్కువగా గట్లమీద ఉన్న తుత్తురబెండ మరియు వయ్యారి భామ మీద నుండి పంట మీదకు వస్తాయి. కావున ఈ కలుపు మొక్కను నివారించడం ద్వారా, చాలా వరకు తామరపురుగు మరియు పిండినల్లి వ్యాప్తిని అరికట్టవచ్చు. ఆ తరువాత కూడ ఈ పురుగు నివారణకు రైతాంగం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం లో జిగురు అట్టలను ఏర్పరచుకోవాలి. పంట తొలిదశలో వేప సంభందిత మందును పిచికారీ చేయాలి. అలాగే విత్తిన 30, 45, 60 రోజుకు కాండానికి మందుపూత పద్ధతిని పాటించాలి. రసం పీల్చే పురుగు ఉనికి మరియు ఉధృతిని అనుసరించి విత్తిన 60 రోజుల తరువాత సిఫారసు చేసిన రసాయనాను పిచికారీ చేయాలి.

ఈ మొండి జాతి కలుపు మొక్కలైన వయ్యారిభామ మరియు తుత్తురబెండ నివారణకు రైతు ఆచరించవలసిన విషయమేమిటంటే గట్ల మీద ఉన్న ఈ కలుపును పూతకు రాక ముందే పీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తరువాత వీటిని పీకినట్లయితే వీటి గింజలు నేల పైకి రాలి వృద్ధి చెంది సమస్యాత్మకంగా మారతాయి. రసాయనాల ద్వారా గట్ల మీద ఈ కలుపును నివారించటానికి లీటరు నీటికి 2 గ్రా. 2,4-డి సోడియం సాల్ట్‌ లేదా 80 శాతం పొడిమందును లేదా లీటరు నీటికి 5 గ్రా. అట్రాజిన్‌ 50 శాతం పొడి మందుతో ఏదో ఒకదాన్ని నీటిలో కలిపి పూతకు రాకముందే పిచికారీ చేయాలి. ఈ కలుపు మందు పిచికారి చేసేటప్పుడు పత్తి మొక్క మీద పడకుండా జాగ్రత్తపడాలి. గట్లమీద తొలకరి వర్షాలు పడినవెంటనే కలుపు మొలవకుండానే లేదా అప్పుడే మొలిచిన కలుపును ప్రాధమిక దశలోనే నిర్మూలించడం చాలా అవసరం. పత్తి పంటవేసిన పొంలోనే కాకుండా చుట్టూ వున్న ప్రదేశాల్లో కూడా ఈ కలుపు మొక్కను నివారించడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చును.

Leave Your Comments

మొక్కజొన్న గింజలు ఒలిచే యంత్ర పరికరాలు

Previous article

వరిలో చీడపీడలు- యాజమాన్యం

Next article

You may also like