మన దేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అదనపు విలువను జోడించండం, వ్యర్థాలను తగ్గించడం ఎంతో అవసరం. చిరుధాన్యాలు వంటి ఉత్పత్తులకు అదనపు విలువలు చేకూర్చే సాంకేతిక విధానాల వలన ముఖ్యంగా గ్రామీణ మహిళలు పరిశ్రమలుగా ఏర్పరచుకొని ఆహార భద్రత మరియు ఆదాయము పెంపొందించుకోవచ్చు.
సంప్రదాయబద్ధంగా చిరు ధాన్యాలను ఆహార పంటగా నంద్యాల జిల్లాలో జొన్న 32626 హ, కొర్ర 2445 హ, సజ్జ్జ 3540 హెక్టార్లలో సాగు చేయడం జరుగుతోంది. జిల్లాలో ఎక్కువగా జొన్న పిండితో తయారుచేసిన రొట్టెలు తమ ఆహారంలో తీసుకుంటారు. అలాగే జొన్న సాగుతో పాటు కొర్ర, సజ్జ సాగును ముఖ్య పంటగాను లేదా కందిలో అంతర పంటగాను సాగు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకునే కుటుంబాలు చాలా తక్కువ. దీనికి కారణం చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య లాభాలపైన అవగాహనా లోపం మరియు చిరు ధాన్యాల ఆహార ఉత్పత్తులు మార్కెట్లో ఇతర ఆహార పదార్థాల లాగ అందుబాటులో లేకపోవటం, వీటిని దృష్టిలో ఉంచుకొని చిరు ధాన్యాల విలువాధారిత ఉత్పత్తుల తయారీని ఒక పరిశ్రమగా గ్రామీణ యువత ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా స్థిరత్వాన్ని మరియు వ్యవసాయంలో రెట్టింపు ఆదాయాన్ని పొందేందుకు మంచి అవకాశం ఉంది, ఈదిశగా కృషి విజ్ఞాన కేంద్రం ముందుకు వెళ్తుంది.
శ్రీ ఉమామహేశ్వర మిల్లెట్ ప్రాసెస్సింగ్ యూనిట్,యాగంటిపల్లె :
చిరు ధాన్యాల సాగు మరియు ప్రజలలో చిరుధాన్యాలకు సంబంధించిన ఆహార పదార్థాల ద్వారా లభ్యమయ్యే ఆరోగ్యంపై అవగాహన పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె గ్రామ మహిళలకు చిరు ధాన్యాల ప్రాసెస్సింగ్ యూనిట్లు, వాటి విలువాధారిత ఉత్పత్తుల గురించి అవగాహన మరియు శిక్షణ కల్పించడం జరిగింది. అలాగే, రాజేంద్రనగర్, హైదరాబాద్ లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థకు మరియు ఇతర ప్రాసెస్సింగ్ యూనిట్లకు విజ్ఞాన సందర్శన ద్వారా వారిలో ప్రేరణ రేకెత్తించడం, ఆ పరిశ్రమను ఎలా విజయవంతంగా నడుపుకోవాలో అవగాహన కలిగింది.
చిరుధాన్యాల ప్రాసెస్సింగ్ యూనిట్ ఏర్పాటుకు మరియు ముడి సరకు కొనుగోలుకై పొదుపు సంఘం నుండి రుణాన్ని తీసుకోవడం జరిగింది. మార్కెటింగ్ సమస్యను అధిగమించడానికి కె.వి.కె ముందుండి వివిధ ప్రకటనల ద్వారా అలాగే వివిధ వ్యవసాయ ప్రదర్శనలో ప్రదర్శించడం ద్వారా వీరి ఉత్పత్తులకు గుర్తింపు రావడం అలాగే రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు వారు తయారుచేసిన ఉత్పత్తులను పంపించడం జరుగుతోంది.
2015 వ సంవత్సరంలో చిరుధాన్యాల ప్రాసెస్సింగ్ యూనిట్ ను పొదుపు సంఘం మహిళలు ప్రారంభించడం జరిగింది. కొర్ర బియ్యం, జొన్న రవ్వ, జొన్న పిండి, రాగి పిండి, సజ్జ రవ్వ, కొర్ర, జొన్న, రాగి, సజ్జలతో తయారు చేసిన ఆహార పదార్థాలను “కృషి మిల్లెట్స్” అనే బ్రాండ్ పేరుతో ఈ ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం జరుగుతోంది. ఈ బ్రాండ్ కు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సును తీసుకోవడం జరిగింది. మొదట్లో నెలకు 2 క్విoటాళ్ళ ఉత్పత్తితో ప్రారంభమై ప్రస్తుతము నెలకు 30 క్విoటాళ్ళ ఉత్పత్తితో నెలకు 27 వేల రూపాయలను నికరాదాయం కింద పొందుతున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి 36 టన్నుల ఉత్పత్తిలో రూ. 3,24,000/- నికర ఆదాయాన్ని పొందుతున్నారు.
వీరి శ్రమను గుర్తించి 2015 రైతు దినోత్సవం నాడు ఉత్తమ మహిళా వ్యవస్థాపకురాలుగా, 2017 జిల్లా స్థాయిలో ఉత్తమ చిరుధాన్యాల విలువాధారిత మహిళగా, 2019లో నంది రైతు సమాఖ్య, నంద్యాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవంలో ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తలుగా గుర్తింపును అందుకోవడం జరిగింది.
లక్ష్మి ఫుడ్స్, బనగానపల్లె :
బనగానపల్లెకు చెందిన శ్రీమతి పి.లక్ష్మీదేవి w/o శివయ్య చిరుధాన్యాలకు సంబంధించిన ప్రాసెస్సింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసుకొని అన్ని రకాల చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రజలకు అందించాలనే ఆసక్తితో కృషి విజ్ఞాన కేంద్రం వారిని సంప్రదించి శిక్షణ పొంది, కె.వి.కె. సలహా మేరకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలైన డిస్టోనర్, గ్రేడర్ మరియు ఆస్పిరేటర్, డీహల్లర్, పల్వరైజెర్లను 15 లక్షల రూపాయలతో, స్థలము, షెడ్, కరెంటు, యంత్ర సామాగ్రి ఫిట్టింగ్స్ కొరకు 25 లక్షల రూపాయలను బ్యాంకు ద్వారాలోను తీసుకుని లక్ష్మి ఫుడ్స్ను ఏర్పాటు చేయటం జరిగింది. చిరుధాన్యాలతో తయారైన రవ్వ, పిండి, “ఆయుర్గున” అనే బ్రాండ్ తో సరఫరా చేయడం జరుగుతోంది. సంవత్సరానికి సుమారు 80 టన్నులు అమ్ముతూ దాదాపు రూ. 7,20,000/- నికరాదాయాన్ని పొందడం జరుగుతోంది. ఆయుర్గున రాగి మాల్ట్ రాష్ట్రంలో చాలా సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంది.
ప్రకృతి మిల్లెట్స్ ఫుడ్స్, నంద్యాల :
నంద్యాల పట్టణానికి చెందిన ఎం.మానస w/o హరనాథ్ స్వతహాగా గృహిణి. కె.వి.కె, యాగంటిపల్లె నందు చిరు ధాన్యాలపై విలువాధారితకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలలో ఎంతో ఆసక్తితో పాల్గొని నేర్చుకునేది. మానస ఆసక్తిని గమనించిన కె.వి.కె, చిరుధాన్యాలకు సంబంధించిన ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందవచ్చని ప్రోత్సహించింది. చిరు ధాన్యాలతో టిఫిన్లు, భోజనం మొదలగు వంటకాలను ఎలా తయారు చేయాలో కె.వి.కె. అందించే శిక్షణ ద్వారా మానస నేర్చుకోవడం జరిగింది. శిక్షణ తరువాత ” ప్రకృతి మిల్లెట్స్ ఫుడ్స్, నంద్యాల నందు , 2023 సం ‘ప్రారంభించడం జరిగింది. ఫుడ్ కోర్ట్ నందు చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్లు, భోజనం, స్వీట్స్ మరియు స్నాక్ ఐటమ్స్ మొదలగు వంటకాలు లభించేలా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఫుడ్ కోర్ట్ ద్వారా సంవత్సరానికి నికర ఆదాయము సుమారు 7.50 లక్షలు సంపాదిస్తూ శ్రీమతి మానస సంపాదిస్తోంది. కె.వి.కె. ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో కిసాన్ మేళాలో, ఇతర ప్రదర్శనలలో అన్ని చిరు ధాన్యాలతో చేసే వంటకాలను ప్రదర్శించి ఉత్తమ చిరు ధాన్యాల విలువాధారిత వ్యాపారవేత్తగా జిల్లాలో అందరి మన్ననలను శ్రీమతి మానస అందుకుంటున్నారు.
శ్రీ సాయిమిల్లెట్స్ ఫుడ్ కోర్ట్ బనగానపల్లె:
యాగంటిపల్లె గ్రామానికి చెందిన బి. లక్ష్మిదేవి స్వతహాగా గృహిణి. కె.వి.కె, యాగంటిపల్లె నందు చిరు ధాన్యాలపై విలువాధారితకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలలో ఎంతో ఆసక్తితో పాల్గొని నేర్చుకునేది. లక్ష్మి దేవి ఆసక్తిని గమనించిన కె.వి.కె, చిరుధాన్యాలకు సంబంధించిన ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందవచ్చని ప్రోత్సహించింది. చిరు ధాన్యాలతో టిఫిన్లు, భోజనం మొదలగు వంటకాలను ఎలా తయారు చేయాలో కె.వి.కె. అందించే శిక్షణ ద్వారా లక్ష్మి దేవి నేర్చుకోవడం జరిగింది. శిక్షణ తరువాత “శ్రీ సాయి మిల్లెట్ ఫుడ్ కోర్ట్” ను 2024 సం నందు ప్రారంభించడం జరిగింది. ఫుడ్ కోర్ట్ నందు చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్లు, భోజనం, స్వీట్స్ మరియు స్నాక్ ఐటమ్స్ మొదలగు వంటకాలు లభించేలా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది.
ఫుడ్ కోర్ట్ ద్వారా సంవత్సరానికి 5.80 లక్షలు నికరాదాయం లక్ష్మదేవి సంపాదిస్తోంది. కె.వి.కె. ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో కిసాన్ మేళాలో, ఇతర ప్రదర్శనలలో అన్ని చిరు ధాన్యాలతో చేసే వంటకాలను ప్రదర్శించి ఉత్తమ చిరు ధాన్యాల విలువాధారిత వ్యాపారవేత్తగా జిల్లాలో అందరి మన్ననలను లక్ష్మి దేవి అందుకుంటున్నారు.
కె. లక్ష్మిప్రియ(హోంసైంటిస్ట్), జి. ధనలక్ష్మి (సీనియర్ సైంటిస్ట్ & హెడ్),కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె, నంద్యాల జిల్లా


























