ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యూనిసెఫ్), వివిధ దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు మరియు పౌర సమాజం భాగస్వామ్యంతో ప్రతి సంవత్సరం ఆగష్టు మొదటి వారాన్ని ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. “తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు ” అనే ఉద్దేశంతో 2025 ఆగష్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా వివిధ అవగాహన కార్యక్రమాలను చేపట్టి తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, బాలింతల పోషకాహారం, చంటి పిల్లలు తల్లి పాలు తాగడం ద్వారా కలిగే లాభాలు, పటిష్టమైన పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు తల్లిపాల యొక్క పోషణ ప్రాధాన్యతను తెలపడం ద్వారా ఆరోగ్య సమాజాన్ని నిర్మించడానికి బాటలు వేయవచ్చని దేశంలో విస్తృత కార్యక్రమాలను చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
భారత వైద్య పరిశోధనా మండలి వారి జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ ఐ ఎన్) -హైదరాబాద్ విడుదల చేసిన భారతీయులకు పోషకాహార మార్గదర్శకాలలో స్పష్టంగా మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా చంటి పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఆహారంగా పట్టించాలి మరియు రెండు సంవత్సరాల, ఆపై కూడా తల్లిపాలను ఆహారంగా పట్టిస్తే బిడ్డ ఎదుగుదలతో పాటు తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని మార్గదర్శకాలలో సూచించడం జరిగినది. తల్లిపాల ప్రాముఖ్యత, బిడ్డ ఎదుగుదల మరియు తల్లిపాలను బిడ్డకు పట్టించే వాటిలో ఎదురయ్యే అవరోధాలను ఎలా అధిగమించాలో ఈ కింద చూద్దాం.
. తల్లిపాలు ఎంతో శ్రేష్టమైన సహజసిద్ధమైన ఆహారం, బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తప్పనిసరి తల్లిపాలు పట్టించాలి.
. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి స్పర్శ బిడ్డకు కలిగిస్తూ గంటలోపే బిడ్డకు తల్లిపాలను పట్టించాలి. బిడ్డ వయసు రెండు సంవత్సరాలు వచ్చేదాకా తల్లిపాలు తప్పక తాగించాలి.
. ముందుగా తల్లి స్పర్శ మరియు తల్లిపాలు పట్టించడం ద్వారా తల్లిపాల ఉత్పత్తి జరగడంతో పాటు తల్లికి మరియు బిడ్డకు మంచి బంధం ఏర్పడుతుంది.
. బిడ్డ పుట్టిన తర్వాత మొదటి మూడు నుండి నాలుగు రోజుల వరకు సవించే తల్లిపాలను మొదటి పాలు/ముర్రు/ జున్నుపాలు అంటారు ఆంగ్లంలో కోలోస్ట్రం అంటారు. కోలోస్ట్రంలో బిడ్డకు కావలసిన పోషకాలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే అనేక పదార్థాలు ఉండడం వలన బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
. తల్లిపాలను పట్టించడం వలన అంటు వ్యాధుల ప్రమాదం తగ్గి, రోగ నిరోధక శక్తి పెరిగి మంచి మేధోశక్తి లభించడంతోపాటు దీర్ఘకాలంలో ఊబకాయం మరియు డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.
. బిడ్డకు తల్లి పాలను పట్టించడం వలన తల్లికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా తల్లి గర్భాశం యధాస్థితి రావడానికి మరియు ప్రసవనంతరం శరీరం నుండి రక్తం ఎక్కువగా పోకుండా తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.
. ఋతుస్రావం ఆలస్యంగా తిరిగి రావడం వల్ల తల్లిపాలు ప్రసవ వ్యవధిని పొడిగిస్తుంది.
. పిల్లలకు పాలిచ్చే తల్లులలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.
. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా తల్లిపాలు ఇచ్చే మొదటి 6 నెలల్లో బిడ్డకు తల్లిపాలుతో పాటు అదనంగా త్రాగడానికి నీరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. చంటి బిడ్డకు నీరు త్రాగించటం వలన మరియు దీనివలన డయేరియా వచ్చే ప్రమాదం ఉంది కావున బిడ్డకు తల్లిపాలిస్తున్న మొదటి ఆరు నెలల్లో ఎంత ఎండ ఉన్నప్పటికీ నీరు పట్టించరాదు. తల్లిపాలు సరిపోతాయి.
. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించే ముందు మరియు మొదటి 6 నెలల్లో ఎప్పుడైనా తేనె, గ్లూకోజ్, నీరు లేదా మార్కెట్లో లభ్యమయ్యే మిల్క్ ఫార్ములా మిశ్రమాన్ని తినిపించడం లేదా పట్టించడం చేయరాదు. కేవలం తల్లిపాలను మాత్రమే పట్టించాలి.
. శిశువుకు తరచుగా పాలివ్వడం మరియు రెండవ రొమ్మును అందించే ముందు ఒక రొమ్మును పూర్తిగా ఖాళీ చేయడం చాలా ముఖ్యం.
. తల్లి పాలు తగినంతగా స్రవించడం లేదు అనేది కేవలం ఒక్క అపోహ మాత్రమే మరియు తల్లులు బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చేవరకు తల్లి పాలివ్వడాన్ని నిలిపివేయకూడదు.
. సగటు భారతీయ స్త్రీ మొదటి ఆరు నెలల్లో రోజుకు 750 మి. లీ పాలను మరియు ఆ తర్వాత ఒక సంవత్సరం వరకు రోజుకు 600 మి. లీ పాలను స్రవిస్తుంది.
. తల్లి పాలు శిశువును హైడ్రేట్ చేస్తుంది, మృదు విరేచనకారియైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
. తల్లిపాలు తాగిన బిడ్డలలో కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు, తాపజనక ప్రేగు వ్యాధి, స్థూలకాయం మరియు సంబంధిత రుగ్మతలు, కొన్ని రకాల క్యాన్సర్లు తక్కువగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రీయ పరిశోధనలో తేలడమైనది.
. ప్రత్యేకంగా తల్లిపాలను తాగిన పిల్లల్లో డయేరియా మరియు ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సోకకుండా తల్లి పాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
. పిల్లల జీర్ణాశయంలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మరి ముఖ్యంగా తల్లి పాల పి.హెచ్ (పి హెచ్ 6.36-7.36) తక్కువగా ఉండటం వలన జీర్ణవ్యవస్థలోని ఇతర హానికరమైన వ్యాధికారక సూక్ష్మజీవులను చంపి వేస్తుంది.
. తల్లిపాలలో బిడ్డ ఆరోగ్యానికి మేలు చేసే ప్రి- బయోటిక్ బైఫిడస్ అనే పదార్థం ఉండడం వలన జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు ఉండేవిధంగా తోడ్పడుతుంది. అంతేకాకుండా తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనోగ్లోబలిన్స్, లాక్టోఫెరెన్ మరియు లాక్టో పెరాక్సిడేస్ ఉండటం వలన అనేక వ్యాధుల నుండి బిడ్డను కాపాడుతాయి.
. పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, హార్మోన్లు మరియు ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడం వలన తల్లి పాల నుండి పిల్లలకు లభిస్తుంది కావున పాలిచ్చే తల్లులు డాక్టర్ సూచించని ఎటువంటి మందులు లేదా ఔషధాలు తీసుకోరాదు.
. పాలిచ్చే తల్లులు వారి ప్రాంతాల్లో లభించే వివిధ వైవిధ్యమైన ఆహారపదార్థాలను, మంచి రంగులో ఉన్న ఆకుకూరలు, పండ్లు మరియు కూరగాయలను సమపాళ్ళల్లో తీసుకోవడం వల్ల తల్లి పాల ద్వారా బిడ్డకు సమతుల్య ఆహారం అందుతుంది
. బిడ్డ వయస్సు సుమారు ఆరు నెలలు వచ్చాక తల్లి పాలతో పాటు అదనంగా జావా వంటి ఆహార పదార్థాలను తినిపించాలి. తద్వారా ఎదిగే బిడ్డకు సరైన పోషణ లభిస్తుంది
. ఎదిగే పిల్లల లో విటమిన్ -ఏ మరియు ఐరన్ పోషకాహార లోపాలను అధిగమించడం కోసం వివిధ రంగుల లో ఉన్నటువంటి పండ్లు, క్యారెట్లు మరియు ఆకుకూరలను తినే విధంగా ప్రోత్సహించాలి.
తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన ప్రారంభం: ఆశాజనక భవిష్యత్తు !ఎ.పోశాద్రి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, ఫోన్ : 94928 28965.


























