ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. ఆహార భద్రత, పోషకాహారం, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిపై అవగాహన పెంచేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదిక. 2025లో ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) తన 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది ఆకలి నిర్మూలనకు, పోషకాహార లోపాలను తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకు శాస్త్రీయ పరిశోధనలు, విధానాలు, ప్రపంచ సహకారం ద్వారా చేసిన ప్రయత్నాలకు గుర్తుగా నిలుస్తోంది.
ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవానికి ఇచ్చిన థీమ్ “మంచి ఆహారం కోసం చేతిలో చేతి వేసి – మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి ముందడుగు” (హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ ఆ బెటర్ ఫ్యూచర్). ఇది శాస్త్రీయ పరిష్కారాలు, అంతర్జాతీయ సహకారం, విధాన సమన్వయం అవసరమని స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రపంచ ఆహార వ్యవస్థల ముందున్న సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రైవేట్ రంగం, సామాజిక సంస్థలు కలసి పనిచేయాలని కూడా ఇది సూచిస్తోంది.
ఆహార భద్రత: ప్రపంచ పరిస్థితి
ప్రపంచ ఆకలి పరిస్థితి; 720 మిలియన్లకు పైగా ప్రజలు దీర్ఘకాలిక ఆకలి సమస్యతో బాధపడుతున్నారు. 2 బిలియన్ మందికి పైగా సూక్ష్మపోషక లోపాలు (ఇనుము, అయోడిన్, విటమిన్ ఎ, జింక్) వల్ల ఆరోగ్య సమస్యలు, ఎదుగుదల లోపాలు, మరణాల వరకు దారి తీస్తున్నాయి. ప్రతి సంవత్సరం 1.3 బిలియన్ టన్నుల ఆహారం నష్టపోతోంది సుమారు 2 బిలియన్ మందికి మాత్రమే సరిపడే ఆహారం.
భారతదేశ పరిస్థితి; జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్ఎఫ్హెచ్ఎస్-5 2019-21) నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 35% మంది తక్కువ బరువు మరియు 32% మంది వృద్ధిలో లోపం కలిగి ఉన్నారు. ఇందుకోసం భారత ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా పిల్లల్లో పోషక లోపాలను తగ్గించే ప్రయత్నాలు చేపడుతుంది.
“మంచి ఆహారం” అంటే ఏమిటి?
సురక్షితమైన, సమతుల్య పోషకాలు కలిగిన ఆహారంను “మంచి ఆహారం” అంటారు. అందుబాటులో ఉన్న సురక్షితమైన, సమతుల్య ఆహారం ప్రజారోగ్యానికి, స్థిరమైన అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది. 2024లో ఎఫ్ఎఓ విడుదల చేసిన “స్టేట్ అఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్” (“ఆహార భద్రత మరియు పోషణ స్థితి”) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 720 మిలియన్లకుపైగా ప్రజలు దీర్ఘకాలిక ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇనుము, అయోడిన్, విటమిన్ ఎ, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు లోపిస్తే శిశువుల్లో అభివృద్ధి లోపాలు, రోగ నిరోధక శక్తి తగ్గడం, మరణాలు పెరుగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఈ ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్రీయంగా ఉపయోగపడుతున్న కొన్ని మార్గాలు:
- బయోఫోర్టిఫికేషన్ :- బయోఫోర్టిఫైడ్ ఆహార పంటలు అంటే సహజంగా ఉండే పోషకాలను ఎక్కువగా కలిగేలా అభివృద్ధి చేసిన పంటలు. ఇవి ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. కూరగాయలు, ధాన్యాలు వంటి ఆహార పంటలలో జన్యు ఎంపిక, బయోటెక్నాలజీ వంటి ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ద్వారా బయోఫోర్టిఫికేషన్ చేయవచ్చు.
ఉదాహరణకు :-
- బియ్యంలో బయోఫోర్టిఫికేషన్ : పూసా 44 (పూసా 44) బియ్యం – ఇది ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉండేలా అభివృద్ధి చేసిన బియ్యం జాతి. దీనిని పెంచడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలాంటి బయోఫోర్టిఫైడ్ బియ్యం భారత ప్రభుత్వ పథకాలు, ఎన్ఎఫ్ఎస్ఎమ్, పోషణ అభియాన్ వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు అందిస్తున్నారు.
- ఇంకా కొన్ని బయోఫోర్టిఫైడ్ బియ్యం జాతులు : పూసా సూపర్ రైస్, ఐఆర్ఆర్ఐ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఐరన్/జింక్ సమృద్ధిగా ఉన్న రకాలూ.
- ఇనుముతో సమృద్ధిగా ఉన్న పెర్ల్ మిల్లెట్ పిల్లల్లో ఇనుము లోపాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతోంది.
- విటమిన్ ఎ తో సమృద్ధిగా ఉన్న చిలగడదుంప పోషకాహారలోపము సమస్యను పరిష్కరించెందుకు గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించవచ్చు.
- దీనివల్ల పిల్లల ఎదుగుదల మెరుగుపడుతోంది, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
బయోఫోర్టిఫికేషన్ ద్వారా సాధారణంగా తక్కువగా లభించే పోషకాలను ఆహారంలో పెంచి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఈ విధంగా స్థిరమైన, ఆరోగ్యకరమైన ఆహార భద్రత సాధ్యమవుతుంది.
- ప్రెసిషన్ వ్యవసాయం :-ప్రెసిషన్ వ్యవసాయం అనగా భూమి, పంట, నీటి అవసరాలు, పురుగుల దాడి వంటి అంశాలను సెన్సర్లు, ఉపగ్రహ చిత్రాలు, డేటా విశ్లేషణల ఆధారంగా అంచనా వేసి, సరైన సమయంలో, సరైన పరిమాణంలో మాత్రమే ఎరువులు, నీరు, పురుగుమందులు వాడటం.
ఉపగ్రహ చిత్రాలు, సెన్సర్లు, డేటా విశ్లేషణ ఆధారంగా నీటి వినియోగాన్ని (20-30% వరకు తగ్గించవచ్చు), ఎరువుల వినియోగాన్ని 25% వరకు సమర్థంగా నిర్వహించవచ్చు, పురుగుమందులను సమర్థంగా 40% వరకు ఉపయోగించవచ్చు.
వీటీ ద్వారా పంట ఉత్పత్తి పెరుగుతుంది అలగే పర్యావరణంపై ప్రభావం తగ్గుతుంది. అవసరం లేని చోట, అవసరం లేని పరిమాణంలో ఉపయోగించే పురుగుమందులను తగ్గించడం, దాడి తీవ్రత, పంట స్థితి, వాతావరణ పరిస్థితులను ఆధారంగా తీసుకొని నిర్ణయించడం వల్ల ఉపయోగించే పురుగుమందుల మొత్తం పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల పర్యావరణానికి, రైతుకు, ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సాధారణ నివేదిక ప్రకారం 20% నుండి 50% వరకు పురుగుమందులను తగ్గించవచ్చు కొన్ని అధునాతన వ్యవస్థల్లో 60% వరకు కూడా తగ్గినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్రెసిషన్ వ్యవసాయం లో నేలలో ఉన్న పోషకాలను విశ్లేషించి, పంట అవసరాలకు సరిపోయేలా సరైన సమయంలో, సరైన పరిమాణంలో ఎరువులను ఉపయోగిస్తారు. దీని వల్ల అవసరం లేని చోట లేదా అధికంగా ఎరువులు వాడటం తగ్గుతుంది.
నేల పరీక్షలు, సెన్సర్లు, డేటా ఆధారంగా ఎక్కడ ఎంత ఎరువు అవసరమో నిర్ణయించడం ద్వారా, అవసరానికి మించి వాడే ఎరువులను తగ్గించడం, సరైన సమయంలో సరైన పరిమాణంలో మాత్రమే ఉపయోగించవచ్చు. సాధారణంగా 10% నుండి 40% వరకు ఎరువు వాడకాన్ని తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో 50% వరకు కూడా తగ్గినట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
ఉదాహరణలు:
నత్రజని (నైట్రోజన్) ఎరువు వాడకాన్ని 25–30% వరకు తగ్గించడం; నేలలో ఫాస్ఫరస్, పొటాషియం అవసరాలను ఖచ్చితంగా గుర్తించి అవసరమైన చోట మాత్రమే వాడటం వల్ల 20–40% తగ్గింపు; డ్రిప్ ఇరిగేషన్తో కలిపి ఎరువు వాడకం మరింత సమర్థవంతంగా మారుతుంది.
- పంట కోత అనంతర నష్టాలను తగ్గించే సాంకేతికతలు (పోస్ట్–హార్వెస్ట్ ఇన్నోవేషన్స్)
ప్రపంచ వ్యాప్తంగా 1.3 బిలియన్ టన్నుల ఆహారం ప్రతి సంవత్సరం నష్టపోతుంది. ఇది 2 బిలియన్ మందికి సరిపడే ఆహారం అని అంచనా. పంటను కోసిన తర్వాత సరైన విధంగా నిర్వహించకపోతే, తేమ, పురుగులు, యాంత్రిక నష్టాలు, నిల్వ లోపాలు కారణంగా కోత అనంతర నష్టాలు అధికంగా ఉంటాయి. వీటిని తగ్గించేందుకు కొన్ని విధానాలు (త్రెషింగ్; విన్నోయింగ్, ఎండబెట్టడం, శుభ్రపరచడం, వర్గీకరణ / గ్రేడింగ్ చేయడం వంటివి) ఉపయోగపడతాయి. ఇవన్నీ శాస్త్రీయంగా నిర్వహిస్తే గింజ నాణ్యత మెరుగుపడుతుంది.
నానో టెక్నాలజీ ఆధారిత ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ సదుపాయాలు వంటి పరిష్కారాలు ఆహార నష్టాన్ని తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడతాయి. నియంత్రిత వాయు నిల్వ (కంట్రోల్డ్ అత్మొస్ఫెరె స్టోరేజ్) ద్వారా ఆహార నిల్వ కాలాన్ని 2 నుండి 6 నెలల వరకు పెంచవచ్చు. నానో టెక్నాలజీ ప్యాకేజింగ్ ద్వారా ఆహార నాణ్యతను 20–30% వరకు మెరుగుపరచవచ్చు. సంఘటితంగా, శాస్త్రీయంగా, సరైన సమయంలో ఈ ప్రక్రియలను పాటిస్తే పంట కోత అనంతర నష్టాలను 10% నుండి 30% వరకు తగ్గించవచ్చు. దీని ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుంది, ఆహార భద్రత మెరుగుపడుతుంది.
- పర్యావరణహిత సాంకేతికాలు :- ఐపీసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్) వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ నివేదిక ప్రకారం, వ్యవసాయ రంగాన్ని వాతావరణానికి అనుగుణంగా మార్చేందుకు శాస్త్రీయ చర్యలు తప్పనిసరి. ఇందుకోసం శాస్త్రీయంగా అమలు చేస్తున్న కొన్ని పరిష్కారాలు:
- అగ్రోఎకాలజీ : ప్రకృతి చక్రాలను ఆధారంగా తీసుకుని ఎరువులు, పురుగుమందులపై ఆధారాన్ని వినియోగాన్ని తగ్గించి, మట్టిని పునరుజ్జీవింపజేసే పద్ధతులు.
- సర్క్యులర్ ఫుడ్ సిస్టమ్స్ : సర్క్యులర్ ఫుడ్ సిస్టమ్స్ అంటె ఆహార వ్యర్థాలను తిరిగి ఉపయోగించే వ్యవస్థలు మరియు పోషకాలను తిరిగి పొందే విధానాలు. వ్యర్థాల నుండి సంపద అంటే వ్యవసాయ వ్యర్థాలు, ఆహార అవశేషాలు, తోటలోని మిగులు పదార్థాలను ఉపయోగించి కంపోస్ట్, బయోగ్యాస్, జంతు ఆహారం, సహజ ఎరువులు వంటి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయడం. వ్యర్థాలను ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, నేల సారాన్ని పెంచే కంపోస్ట్ తయారవుతుంది, సహజ ఎరువుల వల్ల ఆరోగ్యకరమైన, రసాయనరహిత ఆహారం లభిస్తుంది, బయోగ్యాస్ ద్వారా శక్తిని పొందవచ్చు, జంతువుల కోసం మంచి ఆహారం అందుతుంది మరియుగ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
- సహజ వ్యవసాయం : రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతితో కలిసి వ్యవసాయం చేయడం సహజ వ్యవసాయం అని అంటారు. కంపోస్ట్, పంట మార్పిడి, స్థానిక విత్తనాలు, సహజ జీవసారాలు వంటివి ఉపయోగించి పోషకమైన, రసాయనరహిత పంటలను పండిస్తారు. దీని వల్ల: ఆరోగ్యకరమైన, శుద్ధమైన ఆహారం లభిస్తుంది, మట్టిలోని సహజ శక్తి నిల్వ ఉంటుంది, నీరు, గాలి, జీవవైవిధ్యానికి నష్టం తగ్గుతుంది, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ప్రకృతిని కాపాడుతూ తదుపరి తరాలకు మంచి భవిష్యత్తును అందించవచ్చు. సహజ వ్యవసాయం-ఉత్తమ ఆహారం మరియు మెరుగైన భవిష్యత్తుకు మార్గం.
- శాస్త్రం మరియు విధానాల సమన్వయం :-
“చేతిలో చేతి వేసి” అనే సందేశం, శాస్త్ర ఆధారిత, బహుళ విభాగాల సహకారాన్ని ముందుకు తీసుకెళ్తోంది. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు :
ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు: పోషక పదార్ధాలతో ఉన్న విత్తనాల అభివృద్ధి, డిజిటల్ వ్యవసాయ సాధనాల ప్రాచుర్యం కోసం శాస్త్రీయ సంస్థలు మరియు పరిశ్రమల మధ్య సహకారం అవసరం. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామియంతో సాధ్య పడుతుంది.
ఓపెన్ డేటా ప్లాట్ఫార్మ్లు: వ్యవసాయ మరియు వాతావరణ డేటాను భాగస్వామ్యం చేసి సరైన నిర్ణయాలకు, ప్రమాదాల అంచనాకు తోడ్పడటం వలన పంటను కాపాడుకోవచ్చు.
యువత కోసం ఇన్నోవేషన్ వేదికలు: వరల్డ్ ఫుడ్ ఫోరమ్ 2025 వంటి కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలు, యువ వ్యాపారవేత్తలు పాల్గోనటం ద్వారా కొత్త ఆవిష్కరణలను పంచు కోవడం జరుగుతుంది.
ఉదాహరణకు: వరల్డ్ ఫుడ్ ఇండియా 2025– న్యూఢిల్లీ; సెప్టెంబర్ 25–28, 2025 లో వ్యవసాయ సాంకేతికతలు, పోషకాహార పరిశోధనలు, ఆహార ప్రాసెసింగ్, పోషకాహారం, పెట్టుబడులు, వ్యవసాయ సాంకేతికతలపై అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేశారు. కృషి మేళా 2025 – కర్ణాటక లో జరిగే సమావేషం లో నేల ఆరోగ్యం, సాంప్రదాయ పంటలపై శాస్త్రీయ శిక్షణ ఇవ్వబడుతుంది.
- అగ్రగామి శాస్త్రీయ సాంకేతికతలు
అగ్రగామి శాస్త్రీయ సాంకేతికతలు అంటే ముందంజలో ఉండే, కొత్త ఆవిష్కరణలతో కూడిన, సమర్థతను, ఉత్పత్తిని, నాణ్యతను మెరుగుపరిచే ఆధునిక శాస్త్రీయ పద్ధతులు. ఇవి వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమ, శక్తి, నీటి నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగించి అభివృద్ధిని వేగవంతం చేస్తాయి.
- డిజిటల్ వ్యవసాయం: ఉపగ్రహ డేటా, డ్రోన్లు, ఐఓటీ ఆధారంగా వ్యవసాయం
- జన్యు అభివృద్ధి: అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత కలిగిన విత్తనాలు అభివృద్ధి చేయడం. క్రిస్పర్ (క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్) ఆధారిత జన్యు సంపాదన: పంటల జన్యువుల్లో సూక్ష్మ మార్పులు చేసి ఎండకు, పురుగులకు తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడం.
- హైడ్రోపోనిక్స్ / ఏరోపోనిక్స్ – మట్టిలేని సాగు పద్ధతులు
- స్మార్ట్ నీటి నిర్వహణ: నీటి వినియోగాన్ని తగ్గించే ఆటోమేటెడ్ వ్యవస్థలు
- పునర్వినియోగ శక్తి: సౌరశక్తి, గాలిశక్తితో పనిచేసే యంత్రాలు ఉపయోగించడం.
- మట్టి సూక్ష్మజీవ పరిశోధనలు: మట్టిలోని సూక్ష్మజీవాలను ఉపయోగించి పంటల పోషక గ్రహణాన్ని మెరుగుపరచడం, కార్బన్ను నిల్వ చేయడం.
- కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం: పంట దిగుబడులను అంచనా వేయడం, నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం.
- న్యూట్రిజెనోమిక్స్: వ్యక్తిగత జన్యు లక్షణాల ఆధారంగా ప్రత్యేక ఆహార సూచనలు రూపొందించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
ప్రపంచ ఆహార దినోత్సవం 2025 కేవలం ఒక కార్యక్రమం కాదు – ఇది శాస్త్రీయంగా రూపొందించిన, సమగ్రంగా పనిచేయాల్సిన లక్ష్యం. శాస్త్రీయ పరిశోధనలు, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ప్రజల భాగస్వామ్యం కలిస్తే ఆకలి, పోషక లోపాలు, పర్యావరణ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు.
“మంచి ఆహారం కోసం చేతిలో చేతి వేసి – మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి ముందడుగు” అనే సందేశం ప్రతి ఒక్కరికీ – విధాన నిర్ణేతలకు, శాస్త్రవేత్తలకు, రైతులకు, వినియోగదారులకు – శాస్త్ర ఆధారిత చర్యకు పిలుపుగా నిలుస్తోంది. కలిసి పనిచేస్తే భవిష్యత్ తరాలకు సరిపడే, పోషకంగా, పర్యావరణానుకూలంగా ఉండే ఆహారం అందించే ప్రపంచాన్ని నిర్మించగలం.
డా. విమల బీరా, డా. పి.వి.కె. జగన్నాధ రావు, డా. పి. శ్రీదేవి, డా. ఎం. రవి బాబు & డా. సి.హెచ్. ముకుంద రావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకపల్లి,ఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం.


























