ప్రపంచ నేలల దినోత్సవం – 2025 పైన ప్రత్యేక కథనం !
సమస్త జీవకోటి మనుగడకు మరియు వాటి ఆహార గొలుసులకు భూమి జీవనాధారం కావున ఐక్యరాజ్యసమితి పరిధిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) “ఆరోగ్యకరమైన నగర నిర్మాణం ఆరోగ్యకరమైన నేలల తోనే “ అనే ముఖ్య ఉద్దేశంతోనే డిసెంబర్ 5, 2025 న ప్రపంచ నేల దినోత్సవం జరపాలని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) తీర్మానించింది. నగరాలలో ప్రజలు పీల్చే గాలి, త్రాగే నీళ్లు మరియు తినే ఆహారం స్వచ్ఛంగా ఉండాలంటే ముఖ్యంగా నగరాలలో నేలలు ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం ఉంది. పట్టణాలలో ముఖ్యంగా కాంక్రీట్ జంగల్ కారణంగా భూమిలోకి నీరు ఇంకా కుండా ఉండడం వలన భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం, పట్టణ ఉష్ణోగ్రతలు పెరగడం మనం నిత్యం గమనిస్తున్నాం. అంతేకాకుండా పారిశ్రామిక మరియు రసాయన కాలుష్యం వలన నేల కాలుష్యం జరగడం,నేలలో జీవవైవిద్యం లోపించడం, గాలి నాణ్యత పడిపోవడం పచ్చని ప్రదేశాల కొరత కారణంగా పట్టణ జీవనం అస్తవ్యస్తమవుతుంది. నగరాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రహదారులు, సాంకేతిక సదుపాయాలు మాత్రమే కాదు.ఆరోగ్యకరమైన నేలలు నగరాల్లో పచ్చదనాన్ని పెంచి, గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. నగరాల్లో అర్బన్ గార్డెన్స్ మరియు రూఫ్టాప్ ఫార్మింగ్ ప్రోత్సహించడం, సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్ వినియోగం, పార్కులు, గ్రీన్ బెల్ట్స్ విస్తరణ, వర్షపు నీటి సంరక్షణ పద్ధతులు మొదలైనవి ఆచరణలోకి తేవడం ద్వారా నగరాలను ఆరోగ్యకరమైన నగరాలుగా ప్రపంచ దేశాలు కృషి చేయాలని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ కోరుకుంటుంది. పచ్చని, శుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాల కోసం నేల సంరక్షణ మనందరి బాధ్యత.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 33% నేలలు సారవంతతను కోల్పోయి క్షీణించాయి. కేవలం రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మట్టిని ఉత్పత్తి చేయడానికి య్యి సంవత్సరాలు పట్టవచ్చు. నేలలు సారవంతతను కోల్పోవడం వలన గత 70 సంవత్సరాలలో మన పండిస్తున్న వివిధ ఆహార పంటలలో పోషకాలు మరియు విటమిన్లు లభ్యత తగ్గిపోవడం వలన ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాలు కూడా పెరుగుతున్నాయి . ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వివిధ సూక్ష్మ పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా 2050 సంవత్సరం నాటికి ప్రపంచ ఆహార డిమాండ్ ను తీర్చడానికి మన వ్యవసాయ ఉత్పత్తులు సుమారు 60 శాతం పెరగాలి. భవిష్యత్తులో స్థిరమైన నేల నిర్వహణ ద్వారా 58% వరకు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మాత్రమే ఆహార భద్రత కోసం పాటు పడవచ్చు. కావున నేలల సంరక్షణ మరియు పర్యవేక్షణ తక్షణ అవసరం. ప్రపంచ ఆహార భద్రత, వ్యవసాయ పై ఆధారపడి జీవిస్తున్న కొన్ని కోట్లాది కుటుంబాలకు జీవనోపాధి, సమస్త భూమండలంపై నివసిస్తున్న మానవుల ఆరోగ్య శ్రేయస్సు మొదలైన అంశాల పైన ప్రపంచ నేలల దినోత్సవం దృష్టి పెడుతుంది. ప్రకృతి ప్రసాదించిన నేల తల్లిని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ మిక్కిలి సహజ సిద్ధమైన నేలలు ఆవిష్కృతం కావడానికి మనమందరం పునరాంకితం కావాలని ఎఫ్ ఏ ఓ ప్రపంచ దేశాలను కోరుతూ నేల ఆరోగ్యం, పునర్నిర్మాణం మరియు దానిని పునరుద్ధరించడంపై నిజమైన దృష్టి సారించి వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ రైతులను, ప్రజలను చైతన్య పరచాలని కోరుకుంటుంది.
మొక్కలకు అవసరమైన సహజంగా లభించే 18 రసాయన మూలకాలలో 15 మూలకాలను నేలలు సరఫరా చేస్తాయి. దీనికి తోడు కృత్తిమంగా ఎరువులను తయారుచేసి మనము వివిధ పంటలకు నత్రజని, ఫాస్పరస్, పొటాష్ మరియు ఇతర మూలకాలను బయట నుండి అందిస్తాము. కృత్రిమ ఎరువుల వాడక సరళని పరిశీలించినట్లయితే 1980 నుండి 2023 సంవత్సరం వచ్చేసరికి మనదేశంలో ఎరువుల వాడకం 5.5 మిలియన్ మెట్రిక్ టన్నుల నుండి 29.84 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఎరువులపై సబ్సిడీ 1980లలో 505 కోట్లు ఉండగా, 2022-23 నాటికి 2.25 లక్షల కోట్లకు పెరిగింది. అంతేకాకుండా ఎరువుల పంట ప్రతిస్పందన (కిలో ఎరువు (NPK) వాడడం వలన వచ్చే ఉత్పాదకత) నిష్పత్తి క్షీణించడంతో, ఎరువుల వినియోగ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. దీనికి తోడు దిగుబడులలో పెరుగుదల పెద్దగా కనిపించడం లేదు. ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువ మోతాదులో ఎరువులు, పురుగు మందులు మరియు గడ్డి మందులు వాడటం వలన నేల మరింత సారవంతతను కోల్పోయి, పంట మార్పిడి చేపట్టకపోవడం వలన జీవవైవిద్యాన్ని కూడా కోల్పోయి నేలలు నిస్సారం అవుతున్నాయి. సహజసిద్ధమైన నేల స్వభావం తగ్గడం వలన సుస్థిర వ్యవసాయానికి విఘాతం కలుగుతుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పంటల సరళి మారడంతో వరి పంట ఎక్కువ సాగు చేయడం, పంట మార్పిడి చేయకపోవడం, ఇతర పంటల సాగులో అధిక మోతాదులో గడ్డి మందులు, పెస్టిసైడ్స్, ఇతర క్రిమిసంహారక మందులు , ఫెర్టిలైజర్స్ అధిక మోతాదులో వాడడం వలన నేల కలుషితానికి లోనై సారవంతతను కోల్పోతున్నది. మరోవైపు వాతావరణ మార్పులు, తగ్గిపోతున్న వ్యవసాయ భూమి, జనాభా వృద్ధిరేటుకు అనువుగా లేని వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల మరియు ఆర్థిక మందగమనం మొదలైనవి మానవ ఆహార భద్రత మరియు పోషకాహార భద్రత పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో నేలను సంరక్షిస్తూ, జీవవైవిద్యాని ప్రోత్సహిస్తూ చౌకగా, వాతావరణ మార్పులను తట్టుకోనే అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పంటల వృద్ధి అవసరం ఎంతైనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాలు, పట్టణ ప్రాంతాలలో అధిక పోషణ వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ (జీవనశైలి వ్యాధులు) మరియు స్థూలకాయత్వం మరి కొన్ని చోట్ల రెండు పూటలా ఆహారం తినే పరిస్థితి లేక పోషకాహార లోపాలు స్పష్టంగా చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితులలో భూమి మీద నివసిస్తున్న సమస్త మానవ కోటికి సమతుల్య ఆహారం, పోషణ వైవిధ్యం, పోషకార భద్రత మరియు ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి పంటల సరళిని మార్చి నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, సేంద్రియ ఎరువులు, జీవ సంబంధ ఎరువుల వాడకాలను ప్రోత్సహిస్తూ తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలు వంటి పంటలను సాగు చేయడం తక్షణ అవసరం తద్వారానే నేల ఆరోగ్యం, పశుసంపద ఆరోగ్యం మరియు మానవ ఆరోగ్యం ఆవిష్కృతమవుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో సంప్రదాయ అపరాల సాగు 20% పైగా తగ్గడం వలన భవిష్యత్తులో పప్పు కోసం ఇతర దేశాల వైపు చూడవలసిన ప్రమాదం ఉన్నది. పప్పు పంటలను సాగు చేయకపోవడం వలన కూడా నేల నిస్సారవంతమైతున్నది. పప్పు పంటల సాగుకు ఎరువులు, నీరు మరియు ఇతర రసాయనక ఎరువు మందులు తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. తక్షణం పంట మార్పిడి చేయడం, పప్పు పంటల సాగు పెంచడం , పప్పులకు విలువ జోడించడం వలన నేల ఆరోగ్యంతో పాటు మానవ ఆరోగ్యానికి కావలసిన అతి ముఖ్యమైన బలవర్దమైన పోషక పదార్థాలు దొరుకుతాయి. పప్పుధాన్యాలు రాష్ట్రంలో గ్రామీణ జనాభా కు కావలసిన ముఖ్యమైన పోషకాలు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు మరియు విటమిన్లు అందించడంలో ఎంతో దోహదపడతాయి. మన వ్యవసాయ క్షేత్రంలో కొంత స్థలంలో ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి సంవత్సరానికి కావలసిన సుమారు ఒక క్వింటాల్ పైన అన్ని రకాల పప్పు గింజలను సాగు చేస్తూ పోషణ వైవిధ్యతను తక్షణమే ప్రోత్సహించి వివిధ రాష్ట్రాల నుండి దిగుమతి చేస్తున్న పప్పులను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్కువ నీటి అవసరంతో ఎక్కువ మోతాదులో సాగుచేయవచ్చు. పప్పుధాన్యాల సాగు అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగి ఉంటాయి మరియు ఇతర ప్రోటీన్ల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగం తో పోలిస్తే అపరాల ప్రోటీన్ల ఉత్పత్తికి కేవలం 10 శాతం మాత్రమే నీటిని వినియోగించుకుంటాయి. అపరాల సాగు ద్వారా పంట మార్పిడి చేపట్టడం వలన నేల కోత మరియు భూసార క్షీణత తగ్గించి ఆరోగ్యమైన నేల తయారీకి ఉపయోగపడతాయి. ముఖ్యమైన పంటలో అంతర పంటగా, పంట మార్పిడి లో ప్రధాన పంటగా అపరాల సాగు చేసినట్లయితే ఎక్కువ మట్టి కార్బన్ సీక్వెస్ట్రేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, సోయాబీన్, మరియు ఇతర నూనె గింజల లో అపరాల సాగు అంతర పంటగా చేపట్టడం వలన జీవవైవిధ్యం పెరిగి, తక్కువ నీటి ఖర్చుతో సహజ ప్రకృతి ఆవిష్కరించడంలో తోడ్పాటు అందిస్తాయి. . పప్పు ధాన్యాలు పండించడం ద్వారా ఆర్థిక పరిపుష్టి తో పాటు మరియు పప్పు ధాన్యాలను తినడం ద్వారా పోషకాహార లోపాలను అధిగమించవచ్చు మిగతా పంటలతో పోలిస్తే పప్పు ధాన్యాల సాగు వలన పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాల ప్రభావం తక్కువగా ఉంటుంది. కావున పప్పు దినుసుల సాగు నేలకు, పర్యావరణానికి మానవ పోషణకు ఎంతో మేలు చేస్తాయి. అపరాల పంట అవశేషాలను పశుగ్రాసం గా కూడా వాడవచ్చును. చివరగా మన ఇంటి వ్యర్థాలలో సగం వరకు కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా నేల యొక్క సారవంతతను పెంచడానికి కృషి చేయవచ్చు.
ఎ.పోశాద్రి ,ఫుడ్ టెక్నాలజీ విభాగం,ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్


























