తెలంగాణవార్తలు

వ్యవసాయ విద్యకు బాటలు వేస్తున్న రేవంత్ సర్కార్ 

0
  • రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల స్థాపనకు ప్రభుత్వ నిర్ణయం.
  • సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన.
  • వ్యవసాయ విద్య విస్తరణలో తనదైన ముద్ర వేస్తున్న మంత్రి తుమ్మల.

వ్యవసాయ విద్య విస్తరణలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాల కు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటించారు.

రాష్ట్రంలో వ్యవసాయ విద్యను మరింత విస్తరించి, రైతు సంక్షేమం–వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి మరియు నడపల్లి గ్రామాల పరిధిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్వే నంబర్లు 265/1, 277 మరియు 334లో మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మించబడనుంది. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధన, శిక్షణ మరియు రైతు సేవలను ఒకేచోట అందించేందుకు ఈ కళాశాల రూపుదిద్దుకోనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఈ కళాశాల రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక ముఖ్య మైలురాయిగా నిలవనుంది. విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ విద్య అందించడంతో పాటు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయని మంత్రి తుమ్మల గారు తెలిపారు.

ఈ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ముఖ్య సౌకర్యాలు:

  • 5 ఎకరాలలో ఆధునిక అకడమిక్ బ్లాక్ మరియు పరిపాలన భవనాలు.
  • 2 ఎకరాలలో అత్యాధునిక 10 ప్రయోగశాలలు.
  • 2 ఎకరాలలో 1000 మంది విద్యార్థులకు వసతి కలిగిన హాస్టళ్లు.
  • 1 ఎకరంలో లైబ్రరీ.
  • 50 ఎకరాలలో విస్తృత పరిశోధన ఫార్మ్‌లు మరియు సీడ్ ఫార్మ్‌లు.
  • 20 ఎకరాలలో విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ కోసం ప్రత్యేక ఫార్మ్‌లు.
  • 10 ఎకరాలలో మోడల్ ఫార్మ్ మరియు రైతు శిక్షణ బ్లాక్.
  • 10 ఎకరాలలో సైన్స్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్.
  • 8 ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఇండోర్ స్టేడియం.
  • 3 ఎకరాలలో ఆడిటోరియం, గ్యాలరీ మరియు సెమినార్ హాళ్లు.
  • 3 ఎకరాలలో అధ్యాపకులు మరియు సిబ్బందికి నివాస వసతులు.
  • 1 ఎకరంలో ఆరోగ్య కేంద్రం మరియు ఇతర మౌలిక సదుపాయాలు.

ఈ సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాటవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ, ఆధునిక పరిశోధన, రైతులకు ప్రత్యక్ష శిక్షణ మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని మంత్రిగారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కళాశాల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత స్థాయి వ్యవసాయ విద్య అందుబాటులోకి రానుండగా, రైతులకు నూతన పంట విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాల అభివృద్ధి మరియు సాగు విధానాలపై శిక్షణలు అందించి వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు దోహదం చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.

రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యువతను వ్యవసాయ రంగంలో ఆకర్షించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణాన్ని చేపట్టిందని, ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని
ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసి, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో విశేష అనుభవంతో ఆధునిక సాగు పద్ధతులతో మార్గదర్శి గా నిలిచిన మంత్రి తుమ్మల వ్యవసాయ విద్యకు మూడు దశాబ్దాల క్రితమే బాటలు వేశారు.అశ్వరావు పేట లో వ్యవసాయ కళాశాల స్థాపనకు రూపకల్పన చేసిన తుమ్మల నాటి అనుభవాలతో,సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ విద్య విస్తరణ ప్రాధాన్యం పై ప్రతిపాదనలు చేయగా ,వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కళాశాల స్థాపనకు సంతోషంగా ఆమోదం తెలిపారు.వ్యవసాయ కళాశాల స్థాపనలో మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేస్తున్నారని వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్లు రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రేపు జరగనున్న వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో రైతులు వ్యవసాయ విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల కోరారు.

Leave Your Comments

సాగునీటి సంఘాల సమావేశంలో – ముఖ్యమంత్రి చంద్రబాబు

Previous article

వేసవికి అనువైన పెసర మరియు మినుము రకాలు

Next article

You may also like