Minister Niranjan Reddy: ఆయిల్ పామ్ సబ్సిడీపై పలు పత్రికలలో వచ్చిన నిరాధారమైన వార్తలను రైతు సోదరులు పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కోరారు. ఇది రైతు ప్రభుత్వం ..దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలోని 26.81 లక్షల బోరు బావులకు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారంమోస్తూ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంది.

Minister Niranjan Reddy
Also Read: Protection of Agricultural Land from Elephant Attacks: రైతన్న ఫీుంకారం – గజరాజు అంగీకారం.!
ఏడాదికి రూ.1500 కోట్లు పెట్టి రైతుభీమా పథకం అందిస్తుంది. రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల కోట్లతో 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున జమ అవుతుంది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈఓల నియామకం, మొత్తం 2601 రైతువేదికల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గొప్పగా చెప్తున్నాం.
మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఏటా 23 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల డిమాండ్ ఉన్నది. కానీ దేశంలో 10, 11 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెలు మాత్రమే దేశీయంగా లభిస్తున్నాయి. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల కోసం దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. రూ.80 నుండి రూ.90 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం వెచ్చించి థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుండి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం.
ఈ డిమాండ్ ను గమనించే 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నది .. ఇప్పటి వరకు 30 వేల మంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించాం. అందులో బాగంగా 2022-23 సంవత్సర ప్రణాళిక ప్రకారము 2 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణములో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం ..ఇందుకుగాను ఈ వార్షిక బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది .. ఇప్పటికే వేలాది ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులను ప్రోత్సహించడానికి డ్రిప్ పైన 80 నుండి 100 శాతం వరకు రాయితీలనిచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతున్నది. ఒక ఆయిల్ పామ్ మొక్కకు రూ. 193 రాయితి చొప్పున, ఎకరానికి 57 మొక్కలకు రూ . 11,000 రాయితి లభిస్తున్నది. ఒక ఎకరం డ్రిప్ కొరకు రూ. 22,000 రాయితీని అందిస్తున్నాము. అదేవిధముగా 4 సంవత్సరములకు గాను రూ.4200/- ప్రతి సంవత్సరం చొప్పున మొక్కలకు ఎరువు మరియు ఇతర ఖర్చులకు రూ. 16,800 ఎకరానికి సబ్సిడీగా ఇవ్వడం జరుగుతున్నది.
మొత్తంగా ఒక ఎకరానికి ఆయిల్ పామ్ తోట సాగుకు రూ. 49,800 రాయితీగా ఇస్తున్నాము. ఆయిల్ పామ్ సాగులో సబ్సిడీలు ఎత్తివేసినట్లు పలు దినపత్రికలలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. ఎవరైనా రైతులు రుణం తీసుకుని ఆయిల్ పామ్ సాగు చేస్తే వారికి చెందాల్సిన సబ్సిడీ వారి ఖాతాలలో జమ అవుతుంది .. అది ఒక అప్షన్ గా మాత్రమే ఇస్తున్నాము. ఆయిల్ పామ్ సబ్సిడీపై పలు పత్రికలలో వచ్చిన నిరాధారమైన వార్తలను రైతు సోదరులు పరిగణనలోకి తీసుకోవద్దని కోరిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు.
Also Read: Dragon Cultivation: డ్రాగన్ ఫ్రూట్ సాగు.. ఆరోగ్య లాభాలు బాగు.!

























