Telangana Agricultural Land Value: తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ (Resource mobilization) పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి , వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు మరోసారి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.

Telangana Agricultural Land
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల ప్రభుత్వ విలువల మదింపు ప్రక్రియ క్రమంగా ఒక కొలిక్కి వస్తోంది. గత ఏడాది జూలైలో సవరించిన విలువలను మరోసారి సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు గత వారం రోజులుగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తూ తీవ్ర కసరత్లు చేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. గతంలో వ్యవసాయ భూమి ఎకరానికి కనిష్టంగా రూ.75 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.1.20 లక్షలుగా నిర్ధారించనున్నారు. అంటే సవరించిన విలువలు అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి ఎక్కడ ఉన్నా ఎకరం కనిష్టంగా రూ.1.20 లక్షలు ఉంటుందన్న మాట.

Agricultural Land
అయితే వాస్తవానికి జిల్లాల నుంచి వ్యవసాయ భూముల విలువలను 100, 200 శాతంతో పాటు కొన్నిచోట్ల మూడు రెట్లు సైతం పెంచుతూ ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఆ మేరకు విలువలు పెంచితే ప్రజలపై అధిక భారం పడుతుందనే ఉద్దేశంతో గరిష్టంగా 100 శాతం మేరకే విలువలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజానికి గతంలో కనిష్ట విలువ రూ.200 ఉండగా దాన్ని రూ.500గా నిర్ధారించనున్నారు. అదే విధంగా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి చదరపు అడుగుకు గతంలో రూ. 1000 ఉండగా, ఇప్పుడు ఆ కనిష్ట విలువను రూ.1100 లేదా రూ.1200 చేయనున్నారు.

Telangana Farming Land
Also Read: బోగస్ కంపెనీ చేతుల్లోకి రైతులు…
అగ్రీ భూమ్:
రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో ఎకరం వ్యవసాయ భూమి బహిరంగ మార్కెట్లో కనీసం రూ.10–12 లక్షలు పలుకుతున్న నేపథ్యంలో.. ఈ బూమ్ ఆధారంగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏ ప్రాంతంలో ఉన్న భూమి బహిరంగ మార్కెట్లో ఎంత విలువ పలుకుతుందన్న దాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వ విలువలను కూడా ఖరారు చేయనున్నారు. దీంతో ఈసారి వ్యవసాయ భూముల విలువల సవరణ కనీసం 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరగవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలు (Temple Development Authority), కొత్తగా ఏర్పడిన జిల్లాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ శివార్లలోని భూముల విలువలు 90–100 శాతం పెరుగుతాయని తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం మేర విలువలు సవరించనున్నారు.

Agri Bhoom
నేడో, రేపో సబ్రిజిస్ట్రార్లకు తుది ప్రతిపాదనలు:
ఉన్నత స్థాయిలో జరుగుతున్న భూముల విలువల మదింపు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ముగుస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ల స్థాయిలో ముగిసిన పరిశీలన ప్రక్రియపై ఉన్నతాధికారులు మదింపు చేస్తుండగా, ఇందుకు సంబంధించిన తుది ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తీసుకుని నేడో, రేపో సబ్ రిజిస్ట్రార్లకు పంపుతారని, వాటిపై క్షేత్రస్థాయి కమిటీల ఆమోదం తీసుకుని, అవసరమైతే అక్కడక్కడా విలువలు సవరించి పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారు చేస్తామని అంటున్నారు. మొత్తం మీద ఫిబ్రవరి 1 నుంచే సవరించిన ప్రభుత్వ విలువలు అమల్లోకి వచ్చేలా ముందుకెళుతున్నామని, సీఎం ఆమోదం విషయంలో జాప్యం జరిగితే తప్ప అప్పటినుంచే విలువలు పెరుగుతాయని చెబుతున్నారు. సీఎం సలహాలు, సూచనల మేరకు ఈ ప్రక్రియలో స్వల్ప మార్పులుండే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
Also Read: ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు, పొలానికి చేర్చేందుకు..అగ్రి హబ్- పిజెటిఎస్ఎయు ఉపకులపతి ప్రవీణ్ రావు