ఈ నెల పంటతెలంగాణవ్యవసాయ పంటలు

చెఱకు తోటలలో మట్టి ఎగద్రోయడం – జడచుట్ల ప్రాముఖ్యత

0

అనువైన రకాల ఎంపికతో పాటు అంతరకృషి పద్ధతుల్లో భాగంగా మట్టి ఎగద్రోయడం, జడచుట్లు కట్టడం వంటి చర్యలను చేపట్టడం ద్వారా చెఱకు పంటలో అధిక దిగుబడులు సాధించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కురిసే అధిక వర్షాలు మరియు వీచే బలమైన గాలుల ప్రభావంతో చెఱకు తోటలు కూలిపోవడం జరుగుతుంది. దీని ఫలితంగా దిగుబడి మాత్రమే కాకుండా రసనాణ్యతలో కూడా గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుంటుంది.

ఈ విదంగా పడిపోయిన చెఱకుతో తయారైన బెల్లం నిల్వ చేయడానికి పనికిరాకపోవడంతో పాటు మార్కెట్లో సరైన ధర రాక రైతులు ఆర్ధిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, కూలిపోయిన తోటలు అడవి పందులు, ఎలుకలు వంటి కీటకాలకు ఆశ్రయంగా మారి పంటను మరింతగా నాశనం చేస్తాయి. అదనంగా, చెఱకు గడలపై ఉన్న గ్రీవ మొగ్గలు మొలకెత్తడం లేదా కుళ్లిపోవడం వల్ల గడల బరువు మరియు రసనాణ్యత మరింత తగ్గిపోతాయి.

అందువల్ల చెఱకు పంట ఏపుగా పెరుగుతున్న దశలోనే మట్టి ఎగద్రోయడం, జడచుట్లు కట్టడం వంటి పద్ధతులను పాటించడం అత్యంత అవసరం. ఈ చర్యలు చెఱకు తోటలు పడిపోకుండా కాపాడి, గడల బరువును మరియు రసనాణ్యతను నిలబెట్టడం ద్వారా రైతులు అధిక దిగుబడులు మరియు మంచి ఆదాయాన్ని పొందగలరు.

మట్టి ఎగత్రోయుట

అధిక వర్షాలకు మట్టి ఎగత్రోయని తోటలు పడిపోతాయి. పిలక దశ వెంటనే మట్టి ఎగదోసిన తోటలు బలంగా ఈదురుగాలులకు నిలదొక్కుకొనును. తోట వయస్సు 4 నెలలు ఉన్నప్పుడు (జూన్-జూలై మాసాల్లో) మొక్కల వరుసల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగత్రోయాలి. తోట 6 నెలల వయస్సు ఉన్నప్పుడు గడల సంఖ్య స్థిరపడిన తర్వాత మొక్కల మొదళ్ళకు 2వ సారి మట్టిని ఎగత్రోయాలి. మట్టి ఎగత్రోయుట వలన చెఱకు గడలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడినిచ్చును. వేగముగా వచ్చే తుఫాను గాలులకు చెఱకు గడలు పడిపోకుండా ఉండడమే కాకుండ చెఱకు నాణ్యత కూడా అభివ్రుద్ధి చెందుతుంది. నిలబడి ఉన్న నీరు ప్రత్యక్షంగా చెఱకు గడకు తగలదు. మట్టి ఎగద్రోయుట గడ్డిని తగ్గిస్తుంది, గడలను పడిపోకుండా నిలుపుతుంది, ఆలస్యంగా వచ్చే గడలను రానివ్వదు వీటి వలన చెరకు రసం నాణ్యత తగ్గకుండా చేస్తుంది. ఇది చెరకు పడిపోకుండా, వర్షాల వలన జరిగే భూమి కోతను మరియు ఆలస్యంగా వచ్చే గడలను తగ్గిస్తుంది. భారీగా మరియు అధికంగా మట్టి ఎగద్రోయుట చేస్తే అధిక వర్షాల ద్వారా వచ్చే నీటిని బయటకు పంపిస్తుంది. ఈ మట్టి ఎగద్రోయుట ఎరువులను కప్పి ఉంచడమే కాకుండా వేరు వ్యవస్థను అభివ్రుద్ధి చేస్తుంది. మట్టి ఎగత్రోయుటతో పాటు జడచుట్టు పద్దతిని కూడ పంట ఎరుగుదలను బట్టి 2-3 సార్లు చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన చెరకు సుమారుగా 30-35 ఆకులను కలిగి ఉంటుంది. గడ పెరిగే కొద్ది క్రింది ఆకులు ఎండి పొతాయి, వీటిని చెరకు చెత్త అని అంటారు. చెరకు పై 8-10 ఆకులు ఉంచి మిగతా క్రింది ఎండిపోయిన ఆకులను తీసివేయడాన్ని డీ ట్రాపింగ్ అంటారు. ఈ డీ ట్రాపింగ్ను 5 మస్రియు 7 నెలలో చేస్తారు. ఈ డీ ట్రాపింగ్ వలన గాలి మరియు వెలుతురు చెరకు గడకు బాగా తగులుతాయి మరియు చెరకు రసం పీల్చు పురుగులను తగ్గిస్తుంది. అంతే కాకుండా రైతు పొలంలోకి వెళ్లి సులువుగా నీరు పెట్టడం, కీటక పురుగు నాశినిలను పిచికారి

జడచుట్లు :-

మొదటి జడచుట్టు చెఱకు సుమారు 1.5 మీటర్లు ఎత్తు పెరిగిన తరువాత చేసుకోవాలి. తోట పెరుగుదలను బట్టి డిసెంబర్ మాసంలో నాటిన చెఱకు తోటలకు మొదటి జడచుట్టు ఆగస్ట్ మొదటి వారం లోను, రెండవ జడచుట్టు సెప్టెంబర్ చివరి వారంలోను మరియు ఎదుగుదలను బట్టి ఆఖరు జడచుట్టు అక్టోబర్ మొదటి వారంలో వేసుకోవాలి. జడచుట్టు వేయడం వలన గట్టిదనం మరియు పడిపోకుండా ఉండి జడ అల్లిక కూడా క్రమబద్ధంగా ఉండి, చూడటానికి కూడా చెఱకు తోటలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో దగ్గరగా ఉన్న నాలుగైదు దుబ్బులను మెలివేసి జడ చుట్టుతుంటారు.

అయితే జడచుట్టు వేసుకునేటప్పుడు, అడుగు భాగాన మరియు ప్రక్కన ఉన్న ఆకులను మెలివేసి 5 సెం.మీ. వ్యాసం గల గడలకు వరుస పొడవున జడచుట్లు వేయాలి. దీని వలన మొక్కకు సూర్యరశ్మిని ఉపయోగించుకునే సామర్థ్యం ఇతర పంటలైన వరి, గోధుమ, పప్పుదాన్యముల కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువలన చాళ్ళలో గల గడలను వరుసగా కలిపి జడచుట్లు వేసుకున్నట్లయితే మొక్కలకు చేకూరే లాభం ఎక్కువగా ఉంటుంది.

జడచుట్టేటపుడు చెఱకు పైన కనీసం ఆరు నుంచి ఎనిమిది పచ్చని ఆకులను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని రెల్చివేసి, తోట 120 మరియు 240 రోజుల వయస్సు (తోట ఏపుగా పెరిగే దశ) ఉన్నప్పుడు పరిశీలించగా గడపై ఎనిమిది బాగా ఏర్పడిన పచ్చని ఆకులు ఉన్న చెఱకు నుంచి మంచి దిబడులు వస్తాయి. అందువలన రైతాంగం జడచుట్టునప్పుడు చెఱకు పంటను ఆశించే రసం పీల్చుపురుగులు, తెల్లనల్లి, తెల్లపేను (ఊలి ఎఫిడ్), దూదేకుల పురుగు (పైరిల్ల), పిండి నల్లి, పొలుసు పురుగు మరియు పసుపు నల్లి ఉదృతి తక్కువగా ఉండటానికి తప్పనిసరిగా పై 8 ఆకులు వదిలి, పురుగులు ఆశించిన ఆకులను రెంచి వేయడం లేదా జడ చుట్టుకోవడం వలన ఈ పురుగుల ఉదృతి తగ్గుతుంది. అంతేకాకుండా పిండి నల్లి, పొలుసు పురుగు ఎండకు, గాలికి బహిర్గతం కావటం వలన వాటి ఉదృతి కొంత వరకు తగ్గుతుంది. ఈ జడచుట్లు వేయటం వలన గాలి, వెలుతురు తగిలి రసం పీల్చు పురుగులు ఆశించే స్థాయి తగ్గటమే కాకుండా, పురుగు మందుల పిచికారి చేయడం సులభతరం అవుతుంది.

కొన్ని సందర్భాలలో రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడుతుంటారు. అలాంటి తోటలు ఏపుగా పెరిగి పడిపోయి, త్రుప్పు తెగులు, దూదేకుల పురుగు ఉదృతి ఎక్కువగా ఆశిస్తుంది. అందువలన మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక పదార్ధాలను సమానంగా అందించి జడచుట్లు వేసుకొన్నట్లయితే తోటల దిగిబడి పెరగటమే కాకుండా రస నాణ్యత కూడ పెరుగుతుంది. అందువలన రైతాంగం భూసారాన్ని బట్టి సమగ్ర యాజమాన్య పద్దతులను పాటించి, సకాలంలో చెఱకులో మట్టి ఎగుత్రోయుట మరియు జడచుట్టు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొంది నాణ్యమైన చక్కెర ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారముంటుంది.

జి. రాకేష్, ఎం. సాయి చరణ్, ఏ. కృష్ణ చైతన్య, సమతా పరమేశ్వరి, బి. మంజు భార్గవి మరియు రమ్య రాథోడ్, ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూర్ నిజామాబాద్.

Leave Your Comments

రైతున్నకో ప్రశ్న

Previous article

సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపోందించడంలో మత్స్య ఉత్పత్తుల ప్రాముఖ్యత

Next article

You may also like