Narendra Singh Tomar: భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక వంటిదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అభిప్రాయపడ్డారు. అటువంటి రంగానికి పూర్తి తోడ్పాటు అందించి బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు పూర్తి సమన్వయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని “విస్తరణ విద్యాసంస్థ”(EEI) లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. EEI స్వర్ణోత్సవాల సందర్భంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 200 మంది కూర్చునే విధంగా ఈ ఆడిటోరియంని నిర్మించారు. స్వతంత్ర భారతం అనేక పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలలో ప్రథమ శ్రేణిలో ఉందన్నారు.
దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసుకునే స్థాయికి దేశం ఎదిగిందని మంత్రి వివరించారు. అన్ని పంటల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు పనిచేయాలన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలని తీర్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. పరిశోధనా ఫలాల్ని మారుమూల ప్రాంతాలలో ఉండే సన్న, చిన్న కారు రైతాంగాలకి సైతం అందుబాటులోకి తీసుకురావాలని తోమర్ సూచించారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్ని అధికం చేయడానికి, నష్టాల్ని తగ్గించడానికి, మార్కెట్ అనుసంధానం చేయడానికి టెక్నాలజీలని విరివిగా వినియోగించుకోవాలన్నారు. కిందిస్థాయి రైతాంగం వరకు శిక్షణని అందించాలన్నారు. సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాలకి కేంద్రం ప్రోత్సాహం ఇస్తుందన్నారు.

Ts Agriculture Minister Niranjan Reddy Garu
రైతాంగ సంక్షేమం కోసం కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కలిసి పనిచేస్తాయన్నారు. G-20 కి నాయకత్వం వహించే అవకాశం మన దేశానికి రావడం గర్వకారణం అని నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతరం ఉచిత విద్యుత్తు, రైతుబంధు, వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారుల నియామకం, వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్రం కూడా ఇతోధిక సాయం అందించాలని కోరారు.
అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వ్యవసాయం చేసే రైతుకి ఎంత సాయం చేసినా తక్కువేనని నిరంజన్ రెడ్డి అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా నూతన వంగడాలని రూపొందించాలని, డిజిటల్ టెక్నాలజీలని విరివిగా వినియోగంలోకి తేవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా సూచించారు. PJTSAU ఏర్పాటైన నాటినుంచి విధ్య, పరిశోధన, విస్తరణ, రంగాలలో అనేక చర్యలు తీసుకుంటుందని ఇన్చార్జి ఉపకులపతి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు అన్నారు. వివిధ పంటల్లో 61 నూతన వంగడాలని రూపొందించామని 9 కళాశాలలని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, రిజిస్ట్రార్ ఎస్. సుధీర్ కుమార్, వర్సిటీ అధికారులు, EEI డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, శాస్త్రవేత్తలు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Telangana Rice Varieties: తెలంగాణలో పండిరచడానికి అనువైన వరి రకాలు- వాటి దిగుబడులు`ఇతర లక్షణాలు.!
Agricultural Works: ప్రస్తుత పరిస్థితులలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు.!


























