తెలంగాణ

Minister Niranjan Reddy: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి

0
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ విధానాలు వారికి చేరవేయడం వంటి అంశాలపై వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖలు, వర్శిటీలు, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు అయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి నిరన్జన్ రెడ్డి అన్నారు. పంటల వైవిధ్యీకరణతో పాటు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో పరిశోధనలు జరుపుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉందన్నారు.

Minister Niranjan Reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ లో తెలంగాణ పత్తి పరిశోధనా కేంద్రం తక్షణం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మౌళిక వసతుల కల్పనకు, పరిశోధనకు తెలంగాణ సర్కారు సహకారం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే నాణ్యమైన, అధిక దిగుబడులు ఇచ్చే తెలంగాణ కంది పంట అభివృద్ధికై తాండూరులో కంది విత్తన పరిశోధనా కేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో తెలంగాణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా గతంలో కేసీఆర్ చెప్పినట్లుగా పంటకాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ మరియు ఇతర కూరగాయల సాగుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు.

హైదరాబాద్ చుట్టూనే కాకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, కార్పోరేషన్ల పరిధిలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయిల్ పామ్ సాగులో నారు మొక్కల నుండి నాటే వరకు శాస్త్రీయ పద్దతులలో నాణ్యతను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఖమ్మంలో ఉన్న అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా ఖమ్మం జిల్లా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థల సేకరణకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి. ఇక బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా మార్చేందుకు అయిల్ ఫెడ్ కు ఆదేశాలు జరీ చేశారు. సిద్దిపేటలో 60 ఎకరాలలో, మహబూబాబాద్ లో 84 ఎకరాలలో ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు మంత్రి. రాబోయే ఆరు నెలల్లో ఈ నాలుగు ఫ్యాక్టరీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Minister Niranjan Reddy

రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలన్న లక్ష్యంలో భాగంగా వివిధ జిల్లాలలో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలు ఇదివరకే ప్రారంభించారు. రాబోయే వానాకాలంలో లక్షల ఎకరాలలో నాటేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రాంత నేలలు, వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల ఆలుగడ్డ తెలంగాణలో వినియోగిస్తుండగా కేవలం 5 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నదని గుర్తు చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేయకపోవడం మూలంగా వెయ్యి కోట్ల ధనం ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి కోసం వెచ్చించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులకు ఉన్న ఆలుగడ్డ విత్తన సమస్యను అధిగమించడానికి, ఆలుగడ్డ విత్తన నిల్వకు అవసరమైన వసతుల కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని అధికారులతో చెప్పారు.

కోహెడ మార్కెట్ లోని పది ఎకరాలను కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి వేర్ హౌసింగ్ కార్పోరేషన్ కు అప్పగించాలని, దాని నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దీని ద్వారా ఆలుగడ్డతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవకాశం ఉందని చెప్పారు. రైతువేదికలను మరింత ఆధునీకరించి సాగుకు అవసరమైన సమాచారం రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని వ్యవసాయంలో మరింత ఎక్కువగా వాడుకునేందుకు ఐటీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణ సోన వరి; మహబూబాబాద్, ఖమ్మం మిరప; తాండూరు కంది; పాలమూరు వేరుశనగ; నిజామాబాద్ పసుపు; తెలంగాణ పత్తి; జగిత్యాల, కొల్లాపూర్ మామిడి వంటి ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలన్నారు.

Minister Niranjan Reddy

తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడేవిధంగా ఎదగాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.లక్షన్నర కోట్ల వినియోగం. రూ.83 వేల కోట్లతో కాళేశ్వరం నిర్మాణం. ఏటా రూ.10,500 కోట్లతో వ్యవసాయానికి 26 లక్షలకు పైగా పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్, గత నాలుగు సంవత్సరాలలో దాదాపు 42 వేల కోట్లు వినియోగం. వ్యవసాయ రంగ సంబంధిత విద్యుత్ మౌళిక సదుపాయాల కోసం పెట్టిన ఖర్చు రూ.28,473 కోట్లు . రైతుబంధు పథకం ద్వారా ఎనిమిది విడతలలో ప్రతి సీజన్ లో దాదాపు 65 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రూ.50,448.15 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి.

ఇప్పటి వరకు 40 లక్షల మంది రైతులకు సుమారు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభీమా పథకం ద్వారా 73,902 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.3695.10 కోట్లు పరిహారం చెల్లింపు. పత్తి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రైతాంగం .. 60 లక్షల ఎకరాలలో పత్తి సాగు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.573 కోట్లతో రాష్ట్రంలో 2601 రైతువేదికల నిర్మాణం. తెలంగాణ ప్రభుత్వ సాగు అనుకూల విధానాల మూలంగా 2014 నాటికి కోటి 31 లక్షల ఎకరాలలో ఉన్న పంటలసాగు 2021 నాటికి రెండు కోట్ల మూడు లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగింది. 45 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చే వరి ధాన్యం నేడు మూడు కోట్ల టన్నులకు పెరగడం తెలంగాణ సాధించిన ఘన విజయమని సంతోషం వ్యక్తం చేశారు మంత్రి. జాతీయ వృద్ది రేటు 8.5 శాతం కాగా తెలంగాణ వ్యవసాయ వృద్ది రేటు 15.8 శాతం కావడం గమనార్హం అని అన్నారు.

ఈ సమీక్షలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, వీసిలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్, వివిధ సంస్థల చైర్మన్లు కొండూరి రవీందర్ రావు, మార గంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సాయిచంద్, కొండబాల కోటేశ్వర్ రావు, ఉన్నతాధికారులు లక్ష్మీభాయి, యాదిరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments

Agriculture Jobs: అగ్రికల్చర్ రీసెర్చ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022

Previous article

CM Jagan: ఏపీ వ్యవసాయరంగంపై సీఎం జగన్ రివ్యూ మీటింగ్

Next article

You may also like