Minister Niranjan Reddy: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన తొలి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలలో సాగు అంచనా వేయవచ్చని, మరో 14 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు పండించవచ్చని దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ సమాయత్తం కావాలి అని అన్నారు.
పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలి. అందుబాటులో వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పొందుపరచామని సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
నానో యూరియా, నానో డీఎపీ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ అవసరాలలో డ్రోన్ వినియోగంపై యువతకు అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఆయిల్ పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలని మంత్రి చెప్పారు.
రైతులకు ఇచ్చే సాంకేతిక సూచనలు, సమాచారం సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిరంతరం రైతులకు శిక్షణ, వ్యవసాయ సాంకేతిక సమాచారం, ప్రకటనలపై దృష్టిపెట్టాలని వానాకాలం సాగు సమయంలోనే యాసంగి వరిసాగు నారుమళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని మంత్రి అన్నారు.
మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుండి నష్టాన్ని నివారించవచ్చు. తక్కువ కాలంలో అధిక దిగుబడులు ఇచ్చే నూతన వరి వంగడాలను రైతులకు అందేలా చూడాలి. వరిలో నారుమడి కాకుండా నేరుగా విత్తనాలు వేసే పద్దతులను ప్రోత్సహించాలి .. దీనివల్ల వరి సాగులో 10 నుండి 15 రోజుల వరకు సమయం ఆదా అవుతుంది. బాన్స్ వాడ, బోధన్, హుజూర్ నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు.
నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఫాస్ఫేట్ సాల్యుబుల్ బ్యాక్టీరియా వాడకాన్ని ప్రోత్సహించాలని వానాకాలానికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లాల వారీ అవసరాన్ని బట్టి ఎరువుల పంపిణీ చెయ్యాలని రైతువేదికలలో నిరంతర సమావేశాల ద్వారా వ్యవసాయ విస్తరణలో రైతులను విరివిగా భాగస్వామ్యం చేయాలని నకిలీ విత్తన పంపిణీ దారులపై కఠినచర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమానికి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు కొండబాల కోటేశ్వర్ రావు, మార గంగారెడ్డి, కొండూరు రవీందర్ రావు, సాయిచంద్, తిప్పన విజయసింహారెడ్డి, మచ్చా శ్రీనివాస్ రావు, రాజావరప్రసాద్ రావు, రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంత్ కొండిబ, వీసీ నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి,,రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ఎండీలు కేశవులు, యాదిరెడ్డి, సురేందర్, జితేందర్ రెడ్డి, రాములు, మురళీధర్, అరుణ, జేమ్స్ కల్వల తదితరులు హాజరయ్యారు.