ఉద్యానశోభతెలంగాణ

కీరదోసను ఆశించు చీడ పురుగుల నివారణ

0
              తెలంగాణా రాష్ట్రంలో కీరదోసను వేసవిలోసాగు చేయడానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. కీరదోసకు వేసవిలో మంచి గిరాకీ లభిస్తుంది. కాని ఈ పంటకు  ఆశించే పురుగుల వల్ల దిగుబడి తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సకాలంలో సస్య రక్షణ చర్యలు తీసుకోవడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. సాధారణంగా కీర దోస విత్తిన  15-45 రోజుల వరకు రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగులు,తెల్ల దోమ మరియు ఎర్రనల్లి  ఆశించేవి కాని మారుతున్న వాతావరణ పరిస్తితులు వలన  ఈ రసం పీల్చేపురుగుల తీవ్రత అధికంగా ఉంటుంది.
తెల్ల దోమ :-
  ఈ తెల్ల దోమ పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల పాలిపోయి పసుపు చారలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఆకుల గిడస భారీ మందంగా తయారవుతాయి. మొక్క పెరుగుదల ఆగిపోతుంది. తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6 పిల్ల పురుగులు 20 ఉన్న యెడల పంటకు నష్టం అధికంగా ఉంటుంది.
నివారణ చర్యలు 
 4 గ్రాములు థయోమిథాక్సoతో విత్తన శుద్ధి చేసి విత్తితే మొదటి 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బెడదను నివారించవచ్చు.
ఉధృతి ఎక్కువగా ఉంటె ఎల్లో స్టికి ట్రాప్(పసుపు రంగు జిగురు అట్టలను) అమర్చితే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అంటుకొంటాయి.
తొలి దశలో 1500ppm వేప నూనె 5మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం వల్ల తెల్లదోమ గుడ్డు దశ
సమర్థవంతంగా నివారించబడుతుంది.
తెల్లదోమను అదుపులో ఉంచటానికి లీటరు నీటికి 2 మి.లీ. పైరోఫ్రోక్సిఫెన్ లేదా ఫ్లోనికామిడ్ 0.5గ్రా. లేదా డైఫెన్థియురాన్0.5 గ్రా. కలిపి పిచికారి చేయాలి. పురుగు తీవ్రతని బట్టి 15 రోజుల వ్యవధిలో పురుగు మందులను మార్చి పిచికారి చేసుకోవాలి.
తామరపురుగులు :-
 ఈ పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీల్చివేసి  తామర రంగు మచ్చలను ఏర్పరుస్తాయి. తీవ్రత అధికమైనపుడు ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని, మొక్కలు గిడస బరతాయి. తామర పురుగులు తల్లి పురుగులు ఆకుకు 10 ఉండటం వలన పంటకు నష్టం అధికంగా ఉంటుంది.
నివారణ :-
ఈ పురుగు నివారణకి తొలి దశలో 1500ppm వేప నూనె 5మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
లీటరు నీటికి 2 మి.లీ. ఫిప్రోనిల్  లేదా ఇమిడాక్లోప్రిడ్0.5మి.లీ. లేదా ఇమామేక్టిమ్ బెంజోయేట్1మి.లీ లేదా థయోక్లోప్రిడ్ 1.5 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. తామర పురుగు తీవ్రతని బట్టి పైన తెలిపిన మందులను 15 రోజుల వ్యవధిలో మార్చి పిచికారి చేసుకోవాలి.
ఎర్రనల్లి :-
ఈ పురుగు ఆశించిన ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చటం వల్ల మొదట ఆకులు పాళీ పోయినట్లు అవుతాయి. నల్లి తీవత్ర ఎక్కువైనపుడు ఆకుల అడుగు భాగాన ఎరుపు మచ్చలు కన్పిస్తాయి. ఈ పురుగు తీవ్రత సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు అధికంగా ఉంటుంది.
నివారణ :-
నివారణకి ముందుగా ఆశించిన భాగాలు కత్తిరింపులు చేసుకోవాలి
ఈ పురుగు నివారణకి లీటరు నీటికి స్పైరోమేసిఫెన్ 1మి.లీ. లేదా ప్రాపరగైట్ 2.5 మి.లీ.  లేదా ఇతియాన్2మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
ఆకు తొలిచే పురుగు :-
తొలి దశలో పిల్ల పురుగులు ఆకు పొరలలోనికి పోయి తొలిచి తినడం వల్ల ఆకులపై తెల్లని చారలు వంకర టింకరగా ఏర్పడతాయి, దీనినే పాము పొడ తెగులు అంటారు. ఈ పురుగు ఉధృతి అధికమైనపుడు ఆకులు పూర్తిగా పాలిపోయి ఎండి పోతాయి.
నివారణ :-
స్పైనోటోరం 0.25 మి.లీ.  లేదా ప్రోఫినోఫాస్ 2 మి.లీ.  లేదా స్పైనోసాడ్0.4 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు తీవ్రతని బట్టి 15 రోజుల వ్యవధిలో పురుగు మందును మార్చి రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.
పొగాకు లద్దె పురుగు :-
ఈ లద్దె పురుగు ఆకుల క్రింది భాగంలో చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. తర్వాత దశలో ఆకులపై రంద్రాలను ఏర్పరచి జల్లెడ ఆకులుగా మారుస్తాయి. పురుగు తీవ్రత అధికమైనపుడు పూత రాలిపోవును.
నివారణ :-
లద్దె పురుగు ఉదృతి, ఉనికిని గమనిచడానికి లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. ఎరలను మాత్రం 25 రోజులకొకసారి మార్చాలి.
విషపు ఎర కోసం 500 మి.లీ. క్లోరిపైరిఫాస్, 500గ్రాముల బెల్లంతో తగినంత నీటిని కలిపి చిన్నచిన్నగుళికలు తయారు చేసుకోవాలి.ఈ విధంగా తయారు చేసిన గుళికలు సాయంత్రo పంటలో చల్లితే నేర్రలలో దాగి ఉన్న పురుగులు రాత్రులందు బయటకు వచ్చి తిని చనిపోతాయి.
లీటరు నీటికి ఇమామేక్టిమ్ బెంజోయేట్ 1మి.లీ లేదా నోవల్యురాన్1.5 మి.లీ లేదా డైప్లుబెంజురాన్ 2.0గ్రాముల లాంటి మందులతో పిచికారి చేయడం వల్ల  గ్రుడ్ల నుండి అప్పుడే బయటికి వచ్చిన పిల్ల పురుగులను అరికట్ట వచ్చు.

సి. అశ్విని, హార్టికల్చర్ పాలిటెక్నిక్,డా.వి.మురళి, ఉద్యాన పరిశోధనా స్థానం, ఆదిలాబాద్ .

Leave Your Comments

ఇంటి పంటకు సేంద్రియ విత్తనం – “సీడ్‌బాస్కెట్ “

Previous article

పామ్ ఆయిల్ రైతులతో ముచ్చటించిన మంత్రులు

Next article

You may also like