జీవ వ్యర్ధాల నుంచి ఆరు గంటల్లో జీవ ఎరువులు
వియత్నాం సంస్థతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక అవగాహన ఒప్పందం
హాజరు అయిన వియత్నాం డిప్యూటీ అంబాసిడర్ Tran Thanh Tung
యూరియాకు రానున్న ఏళ్లలో ఇదే ప్రత్యామ్నాయం – ఉపకులపతి అల్దాస్ జానయ్య
భారతదేశంలోని వియత్నాం రాయబార కార్యాలయం డిప్యూటీ రాయబారి TRAN THANH TUNG, వియత్నాం దేశానికి చెందిన BIOWAY-VIETNAM, CEO LE THI CAM TIEN లు తమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పరిపాలన భవనంలో ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తో భేటీ అయ్యారు. రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH విద్యాసాగర్, ఇతర విశ్వవిద్యాలయ అధికారులు ఈ భేటిలో పాల్గొన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల వ్యర్ధాలు, మాంసం వ్యర్ధాలు, గుర్రపు డెక్క తదితర అన్ని జీవ వ్యర్ధాల నుంచి జీవ ఎరువుల్ని ఆరు గంటల్లో తయారు చేసే పరిజ్ఞానాన్ని మరియు యంత్ర పరికరాన్ని BIOWAY VIETNAM సంస్థ నుంచి PJTAU కి ఉచితంగా అందించే అవగాహన ఒప్పందంపై రెండు సంస్థలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణకు చెందిన PJTAU తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం భారతదేశంలోనే తొలిసారి అని భారత దేశంలోని వియత్నం డిప్యూటీ అంబాసిడర్ TRAN THANH TANG మరియు BIOWAY VIETNAM CEO LE THI CAM TIEN తెలిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఇది 13వ ఒప్పందం అని వివరించారు. ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత ఈ పరిజ్ఞానాన్ని ఈ సంస్థ కనుగొన్నదని ఉపకులపతి జానయ్య అన్నారు. జీవ వ్యర్ధాల నుంచి జీవ ఎరువులు ఇప్పటికే తయారు చేస్తున్నారనీ కానీ ఆ ఎరువుల తయారీకి అనేక రోజుల సమయం పడుతుందనీ ఈ సంస్థ అందించే పరిజ్ఞానంతో 6 గంటల్లోనే జీవ ఎరువులు తయారవుతాయని జానయ్య వివరించారు. రాష్ట్రంలో యూరియా వినియోగం చాలా అధికమయ్యిందని.. ఆ వినియోగం తగ్గించవలసిందిగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో రైతులలో అవగాహన తీసుకురావడానికి విశ్వవిద్యాలయం కృషి చేసిందని ఆయన తెలిపారు. అయితే రైతులు యూరియాకు ప్రత్యామ్నాయం అడుగుతున్నారని జానయ్య తెలిపారు. ఈ జీవ ఎరువులు అందుకు తగిన ప్రత్యామ్నాయం అని జానయ్య వివరించారు. విశ్వవిద్యాలయంలో BIOWAY VIETNAM రెండేళ్ల పాటు ఉచితంగా యంత్రాలు ఏర్పాటు చేస్తుందని జానయ్య పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ఈ జీవ ఎరువులు ఉత్పత్తులని అన్నీ కోణాల నుంచి విశ్వవిద్యాలయం మదింపు చేసి రైతాంగానికి పెద్ద ఎత్తున అందించడానికి కృషి చేస్తామని జానయ్య తెలిపారు. జీవ వ్యర్ధాలను జీవ ఎరువుల తయారీకి వినియోగించడం వల్ల ప్రకృతిలో కాలుష్యం తగ్గుతుందని, రైతులు రసానిక ఎరువుల వాడకం తగ్గిస్తారని జానయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వాలపై రాయితీల భారం తగ్గుతుందని భూసార క్షీణత తగ్గుతుందని జానయ్య తెలిపారు.
Leave Your Comments


























