పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వలే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడిస్తాయి. ఈ మొక్కలు పొడవైన మరియు బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అందుకే పండ్ల మొక్కల్లో పటిష్టమైన వేరు వ్యవస్థ ఏర్పడటానికి అవసరమైన భూమి తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే మొక్కలు ఆశించిన మేర పెరగక అధిక దిగుబడులను ఇవ్వవు. పండ్ల తోటల పెంపకానికి భూమిని రెండు స్థాయిల్లో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మొదటిది రైతు స్థాయిలో, రెండోది పరీక్షా కేంద్రాల్లో..
రైతు స్థాయిలో భూమి పరీక్షలు
పంట్ల తోటలను సాగు చేయదలచిన మొత్తం భూమిని ఒకే రకంగా ఉన్న భాగాలు లేదా బ్లాకులుగా విభజించుకోవాలి. తర్వాత ఒక్కోరకం భూమి నుంచి సుమారు ఎకరాకు ఒక చోట చొప్పున, భూమి లోతును బట్టి 4 నుంచి 6 అడుగుల లోతు వరకు గుంతను తీయాలి. ఈ గుంతలో పై భాగం నుంచి కింది వరకు నేలను అధ్యయనం చేసి కొన్ని విషయాలను రైతులు పరిశీలించాలి. దీన్ని రైతు స్వయంగా లేదా ఉద్యాన అధికారుల సహకారంతో కానీ చేయవచ్చు.
నేల లోతు
పండ్ల తోటను పెంచదలిచిన భూమిలో నేల లోతు తెలుసుకోవడం ద్వారా ఈ భూమిలో ఏ రకమైన పండ్ల జాతిని పెంచుకోవచ్చో అర్థమవుతుంది. భూ పరీక్షకు తవ్విని గుంత పైభాగం నుంచి కిందివరకు ఎలాంటి గట్టి కంకర లేదా రాతి పొరలు లేకుండా మంచి మట్టి ఉంటే ఆ లోతును నేల లోతుగా పరిగణించవచ్చు. భూమి లోపల గట్టి కంకర లేదా రాతి పొర ఉంటే మొక్కల వేర్లు కిందకి పెరగవు. కాబట్టి నేల లోతును బట్టి అనువైన పండ్ల జాతిని ఎన్నుకోవాలి. కొన్ని సందర్భాల్లో మొక్కల వేరువ్యవస్థ పెరుగదలకు ఆటంకం కలిగించని విధంగా చిన్న చిన్న గులరాళ్లు కలిగిన నేలల్లో కూడా పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి. కొన్నిచోట్ల భూమి కింద భాగంలో గట్టి పొరలు ఉన్నప్పుడు జేసీబీ యంత్రాల సాయంతో 3-4 అడుగల లోతు వరకు మట్టిని తీసేసి ఆ గుంతలో మంచి మట్టిని నింపి పండ్ల మొక్కలను నాటేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో మొదటి 3-4 సంవత్సరాలు మంచి మట్టి ఉన్నంత వరకు మొక్కల వేర్లు బాగా పెరిగి గట్టి పొరలు రాగానే వేర్ల పెరగుదల నిలిచిపోయి మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది. కాబట్టి నేల లోతును బట్టి సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సాగు చేయదలచిన పొలమంతా ఒకే రకం పండ్ల జాతికి అనుకూలంగా ఉండి కొంత భాగంలో మాత్రం భూమి లోతు తక్కువగా ఉండి తప్పని పరిస్థితుల్లో అదే జాతి పండ్ల మొక్కలను పెంచవలసి వచ్చినప్పుడు మొక్కల మధ్య దూరం తగ్గించి ఎక్కువ మొక్కలను నాటుకోవచ్చు. అయితే ఈ ప్రదేశంలో మంచి ఫలితాల కోసం మంచి పోషకాల యాజమాన్యం చేయాల్సి ఉంటుంది.
నేల లోతును బట్టి పండ్ల మొక్కల ఎంపిక
నేల లోతు( సెం.మీ) అనువైన పండ్ల జాతులు
90 సెం.మీ. మించి మామిడి, సపోట, పనస, నేరేడు
60-90 సెం.మీ. జామ, దానిమ్మ, రేగు, చీని, నిమ్మ, ఉసిరి
45-60 సెం.మీ. అరటి, బొప్పాయి, సీతాఫలం
సున్నపు పొరల ఉనికి
మొక్కల వేర్లు పెరిగే లోతు వరకు భూమిలోపల సున్నపు పొరలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని రైతులు ప్రత్యేకంగా పరిశీలించాలి. పండ్ల మొక్కల వేర్లు పెరిగే ప్రాంతంలో సున్నపు పొరలు ఉంటే పండ్ల మొక్కల వేర్లు సరిగాపెరగవు. మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది. అది బలహీనపడి పేలగా ఉంటాయి. భూమి లోపల సున్నం అధికంగా ఉండటం వల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మపోషకాలు అందకుండా పోతాయి. దీని వలన మొక్కలలో ఆకులు గిడసబారి పసుపు రంగులోకి మారి పల్లాకు తెగులుకు గురై క్షీణిస్తాయి. కాబట్టి పండ్ల తోటల పెంపకానికి ఎంచుకున్న పొలంలో సున్నపు పొరలు లేకుండా ఉంటేనా రైతులు వీటి సాగును చేపట్టాలి. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీపడకూడదు. సున్నపు పొరలు ఉన్న భూముల్లో నాటిన పండ్ల మొక్కలు 2-3 సంవత్సరాల్లోనే క్షీణిస్తాయి.
నేల స్వభావం
నేలలోని మట్టి రేణువుల పరిమాణాన్ని బట్టి అది ఇసుక నేలా, ఒండ్రు నేలా లేదా బంక నేలా అని తెలుసుకోవచ్చు. సాధారణంగా నీరు సులభంగా ఇంకిపోయే ఎర్రగరప నేలలు, ఒండ్రు భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలం. నీరు సరిగా ఇంకని బరువైన బంక భూములు పండ్ల తోటల పెంపకానికి అనువైనవి కావు. నేల రకాన్ని బట్టే భూమిలో గాలి ప్రసరణ, నీరు ఇంకే స్వభావం, వేర్ల పెరుగుదల మారుతూ ఉంటుంది. నేల రకాన్ని బట్టి పెంపకానికి అనువైన పండ్ల జాతులను కింది పట్టికలో ఇవ్వడం జరిగింది.
నేల రకం అనువైన పండ్ల జాతులు
ఇసుక వరుస కలిగిన తేలిక భూములు కొబ్బరి, జీడి మామిడి, రేగు, అత్తి, వెలగ,
ఖర్జూరం, తాటి
మధ్య రకమైన గరప నేలలు మామిడి, సపోట, పనస, అరటి, బొప్పాయి,
ద్రాక్ష, చీని, నిమ్మ, దానిమ్మ, జామ
బరువైన బంక భూములు సాధారణంగా ఇవి పండ్ల మొక్కల సాగుకు
అనుకూలం కావు. కాని పనస, నేరేడు, జామ
వంటి రకాలను మంచి యాజమాన్యంతో పెంచవచ్చు.
నీరు ఇంకే గుణం- వేర్ల దగ్గర నీటి మట్టం
ఎక్కువ కాలం నీరు నిలవకుండా త్వరగా ఇంకిపోయే గుణం కలిగిన భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనువైనవి. చెట్ల వేరు ప్రాంతంలో నీరు ఎక్కువగా కాలం నిల్వ ఉంటే మొక్కల వేర్లకు గాలి ప్రసరణ సరిగా లేక ఎదుగుదల క్షీణించి తెగుళ్లకు గురై చనిపోతాయి. అందుకే పండ్ల తోటల పెంపకాన్ని ఎంచుకున్న భూముల్లో ఎల్లప్పుడూ నీటిమట్టం 2 మీటర్ల కిందనే ఉండాలి. పండ్ల మొక్కలు నీటి ముంపును తట్టుకోలేవు. రేగు చెట్లు మాత్రం కొంత వరకు నీటి ముంపును తట్టుకుంటాయి. తోటల పెంపకానికి ఎంచుకున్న భూమిలో పై విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా వరకు భూమి పండ్ల మొక్కల సాగుకు అనువైనదా లేదా అనే విషయం రైతు స్థాయిలోనే తెలిసిపోతుంది.
భూసార పరీక్షా కేంద్రాల్లో..
పండ్ల తోటల పెంపకానికి ఎంచుకున్న నేల రసాయన స్థితి తెలుసుకునేందుకు మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. ఇందుకు ముందుగా భూమి పరిశీలనకు తవ్వని గుంతలలో పైభాగం నుంచి ప్రతి అడుగుకు ఒక మట్టి నమూనా చొప్పున గుంత కింది వరకు నేల లోతును బట్టి 4-5 నమూనాలను సేకరించాలి. ప్రతి నమూనాను ప్రత్యేకమైన పాలిథీన్ కవరులో ఉంచి పూర్తి వివరాలు కలిగిన చీటిని అందులో ఉంచి పరీక్షల కోసం భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. పండ్ల తోటల పెంపకానికి భూమి అనుకూలతను తెలుసుకోవడానికి మొదట నేల ఉదజని సూచిక(PH)ను మరియు లవణ సూచిక(EC) తెలుసుకుంటే సరిపోతుంది. ఇక భూమిలోని పోషకాల లభ్యతను గురించి పండ్ల మొక్కల నాట్లు పూర్తైన తర్వాత తెలుసుకొని తగిన విధంగా యాజమాన్యం చేపట్టవచ్చు.
ఉదజని సూచిక
భూమి యొక్క ఆమ్ల, క్షార గుణాన్ని ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 మధ్య ఉన్న భూములను తటస్థ భూములుగా చెప్పవచ్చు. సాధారణంగా ఈ రకం భూముల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను ఆరోగ్యంగా పెంచవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఉదజని సూచిక 5.5 నుంచి 8.0 వరకు ఉన్న భూముల్లో కూడా పండ్ల తోటలను లాభదాయకంగా సాగు చేయవచ్చు. సేంద్రియ ఎరువులను అధికంగా వాడి ఈ భూముల ఉత్పాదకత పెంచవచ్చు. మరీ ఎక్కువ ఆమ్ల మరియు క్షార భూముల్లో పండ్ల మొక్కలు సరిగా పెరగవు.
ఉదజని సూచిక 6.0 కంటే తక్కువగా ఉన్న ఆమ్ల భూముల్లో పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే సూక్ష్మజీవుల చర్య తగ్గిపోతుంది. పలితంగా నత్రజని, భాస్వరం, సున్నం, గంధకం, మాలిబ్డినం పోషకాలు మొక్కలకు సరిగా అందవు. ఇలాంటి భూముల్లో మొక్కల వేర్లు సరిగా వృద్ధిచెందవు.
ఇక ఉదజని సూచిక 8.5 కంటే అధికంగా ఉన్న క్షార భూముల్లో గాలి ప్రసరణ మరియు నీరు ఇంకే గుణం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే బాస్వరం, సున్నం, మెగ్నిషియం, పొటాషియం పోషకాలు మొక్కలకు ఈ భూముల్లో సరిగా అందవు. సాధారణంగా ఉదజని సూచిక 8.0 మించి తేలిక ఎర్ర భూములు మరియు 8.5 మించి నల్ల బరువు భూములు పండ్ల తోటల పెంపకానికి పనికిరావు.
మంచి యాజమాన్య పద్ధతులతో నేల ఉదజని సూచికను అనుసరించి సాగు చేయదగిన పండ్ల మొక్కలను కింద పట్టికలో ఇవ్వడం జరిగింది.
ఉదజని సూచిక అనువైన పండ్ల జాతులు
5.0 నుంచి 7.0 పనస, అనాస
6.0 నుంచి 7.5 వరకు మామిడి, చీనీ, నిమ్మ, అరటి, జామ, అత్తి, బొప్పాయి, సీతాఫలం, జీడిమామిడి
7.5 నుంచి 8.5 వరకు జామ, రేగు, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఖర్జూరం, చింత, ఉసరి
లవణ సూచిక
నేలలో, నీటిలో కరిగే లవణాల స్థాయిని లవణ సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. నీటిలో కరిగే లవణాలు భూమిలో ఒక పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కలకు హాని కలిగిస్తాయి. లవణ సూచిక ఎక్కువగా ఉన్న భూములను పాల చౌడు భూములుగా పరిగణిస్తారు. పాలచౌడు భూముల్లో చాలా వరకు పండ్ల మొక్కలు ఎదగవు. లవణ సూచిక 4 మీ.మోస్/సెం.మీ కంటే తక్కువ ఉన్న భూముల్లో అన్ని రకాల పండ్ల జాతులు బాగా పెరుగుతాయి. కొన్ని పండ్ల జాతులు అధిక లవణాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. నేలలో లవణాలు అధికంగా ఉండడం వల్ల మొక్కలు పోషకాలను, నీటిని గ్రహించడంలో ఇబ్బందిపడతాయి. మరియు వేర్లు సరిగా అభివృద్ధిచెందవు. ఫలితంగా మొక్కలు ఎదగక క్షీణిస్తాయి. నేల యొక్క లవణ సూచిక ఆధారంగా పెంచదగిన పండ్ల జాతులను కింది పట్టికలో ఇవ్వడమైంది.
లవణ సూచిక అనువైన పండ్ల జాతులు
4.0 మి.మోస్/సెం.మీ కంటే తక్కువ అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి, అనాస
4.0 – 6.0 మి.మోస్/సెం.మీ దానిమ్మ, జామ, చింత, కొబ్బరి, సీతాఫలం, జీడిమామిడి
6.0 – 8.0 మి.మోస్/సెం.మీ రేగు, సపోటా, చింత, ఉసిరి, అత్తి
8.0 మి.మోస్/సెం.మీ కంటే ఎక్కువ నేరేడు, రేగు, ఖర్జూరం
వివిధ పోషకాల అందుబాటు మరియు ఎరువుల సిఫారసు
భూసార పరీక్షా ఫలితాల కార్డులో నేల స్వభావం, ఉదజని సూచిక, లవణ సూచిక తర్వాత నేలలో అందుబాటులో ఉన్న పోషకాలమోతాదును తెలుపుతారు. వీటి ఆధారంగా రైతు సాగుచేయదలచిన పంటకు ఎరువులను సిఫార్సు చేయడం జరుగుతుంది. మట్టి నమూనాలో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను లభ్యతను బట్టి తక్కువ, మధ్యస్థం లేదా ఎక్కువ అని తెలియజేయడం జరుగుతుంది. పట్టిక-4లో తెలిపిన ఫలితాల ఆధారంగా భూసార పరీక్షా కేంద్రంలోని అధికారులు రైతులకు ఎరువులను సిఫార్సు చేయడం జరుగుతుంది.
పట్టిక-4 ప్రధాన పోషకాల అందుబాటు వివరాలు
నత్రజని(కి/హె) భాస్వరం (కి/హె) పొటాష్(కి/హె)
తక్కువ 280 కంటే తక్కువ 10 కంటే తక్కువ 120 కంటే తక్కువ
మధ్యస్థం 280-560 మధ్య ఉంటే 11-25 మధ్య ఉంటే 120-280 మధ్య ఉంటే
ఎక్కువ 560 కంటే ఎక్కువ 25 కంటే ఎక్కువ 280 కంటే ఎక్కువ
మట్టి నమూనాలలో పోషకాల లభ్యత మధ్యస్థంగా ఉంటే పంటకు రాష్ట్ర వ్యవసాయ విద్యాలయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదును యథాతదంగా సిఫారసు చేస్తారు. పోషకాల లభ్యత తక్కువగా ఉంటే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదుకు 33 శాతం అదనంగా సిఫార్సు చేస్తారు. లభ్యపోషకాలు ఎక్కువగా ఉంటే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదులో 33 శాతం తగ్గించి స్థానిక వ్యవసాయ అధికారులు సిఫారసు చేస్తారు.
ఇక సూక్ష్మపోషకాల విషయంలో మట్టి నమూనాలను విశ్లేషించినప్పుడు లభ్యతను బట్టి ఈ పోషకాలు లోపించినట్లు లేదా లోపం లేనట్లు పేర్కొంటారు. లోపం ఉన్న సూక్ష్మపోషకాలకు మాత్రం వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు సూక్ష్మపోషకాల ఎరువులను సిఫార్సు చేయడం జరుగుతుంది.
భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఇంచుమించు అన్ని వ్యవసాయ, ఉద్యాన పంటలకు సిఫార్సులను పైవిధంగానే చేయడం జరుగుతుంది. దీర్ఘకాల పంటలైన పండ్ల తోటల్లోని మొక్కల్లో కూడా భూమి నుంచి పోషకాలు, నీరు తీసుకునే వేళ్లు చాలా వరకు నేల పైభాగాన ఒక అడుగు లోతులోనే ఉంటాయి. నాటిన పండ్ల తోటల్లో వ్యవసాయ పంటలకు చేసే విధంగానే భూసార పరీక్షలు చేసి ఎరువుల యాజమాన్యం చేసుకుంటే సరిపోతుంది. కానీ దీర్ఘకాలిక పండ్ల మొక్కలను నాటే ముందు మాత్రం పొలంలో 4-5 అడుగుల లోతు వరకు నేలను పరిశీలించి భూసార పరీక్షలు చేసుకోవాలి. ఫలితాల అనుకూలతను బట్టి పండ్ల మొక్కలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి.
భూసార పరీక్షా ఫలితాలపై సూచనలు
సాగు భూములలో మట్టిని పరీక్షలు చేసుకోవడం ద్వారా భూమి ఆరోగ్యం, భూసార స్థితిని తెలుసుకోవచ్చును. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకొంటే రైతుకు మంచి పంట దిగుబడులు వస్తాయి. సాగు భూములలో మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షలు చేయించి, ఫలితాలను రైతులకు వ్యవసాయ శాఖ అందిస్తున్నది. ఈ ఫలితాలను సరియైన రీతిలో అర్థం చేసుకొని ఎరువులు యాజమాన్యం చేస్తేనే ఈ పరీక్షలకు అర్థం ఉంటుంది. కేవలం భూసార పరీక్షలు చేయించినంత మాత్రాన రైతులకు ఏమి వరగదనే విషయాన్ని రైతులు గుర్తించాలి.
పంట మొక్కలకు భూమిలోని పోషకాల అందుబాటు ఆ భూమి యొక్క స్వభావము, ఉదజని, సూచిక మరియు భూమిలోని ఇతర పోషకాల నిల్వలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ అధకారులు క్రింది పేర్కొన్న విషాయలను పరిగణలోనికి తీసుకొని రైతులకు ఎరువుల యాజమాన్యంలో సలహాలు ఇస్తుంటారు.
ఇసుక వరుస కలిగిన తేలిక భూముల్లో నత్రజని, పొటాష్ పోషకాలు సులభంగా నీటిలో కరిగి, భూమి లోపలి పొరల్లోకి వృధాగా పోతుంటుంది. తేలిక భూమిల్లో నత్రజని, పొటాష్, జింకు, బోరాన్ వంటి పోషకాల లోపాలు ఎక్కువగా కన్పిస్తాయి. కాబట్టి తేలిక భూముల్లో ఈ పోషకాల యాజమాన్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంక వరుస కలిగి బరువు నేలల్లో భాస్వరం పోషకం స్థిరికరించబడి మొక్కలకు అందుబాటు తగ్గిపోతుంది. కాబట్టి బరువు నేలల్లో అధికంగా భాస్వరం ఎరువులను వినియోగించాల్సి ఉంటుంది.
డ్రిప్ ద్వారా ఈ మధ్య రైతులు నీటిలో కరిగే ఎరువులను అధికంగా వాడుతున్నారు. ఈ ఎరువులన్నీ ఆమ్ల గుణం కలిగినవి కాబట్టి భూముల్లో ఉదజని సూచిక తగ్గిపోతుంది. ఈ సమస్య రాకుండా రైతులు అధికారుల సిఫారసు మేరకే డ్రిప్లలో నీటిలో కరిగే ఎరువులను వాడాలి.
నేల ఉదజని సూచిక పెరుగుతున్న కొద్ది, మొక్కలకు భాస్వరం, జింకు, ఇనుము మరియు బొరాను పోషకాల అందుబాటు తగ్గుతుంది. కాబట్టి చౌడు వరస భూములలో ఈ పోషకాలను, నానో ఎరువుల రూపంలో మరియు చీలేటెడ్ ఎరువుల రూపంలో పంటపై స్ప్రే చేయడం మంచిది. సేంద్రియ పదార్థం అధికంగా కలిగిన భూముల్లో గాలి ప్రసరణ, మురుగు నీటి పారుదల, సూక్ష్మ జీవుల చర్యలు బాగుండి మొక్కలకు అన్ని పోషకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. పొలాలలకు పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు విరివిగా వాడకంతో భూమికి సేంద్రియ పదార్థ అధికంగా లభిస్తుంది.
ఈ మధ్య కాలంలో రైతులు దుక్కిలో వేయుటకు మాత్రమే సిపార్సు చేసే కాంప్లెక్ ఎరువులను, పంటలకు పైపాటుగా కూడా విరివిగా వాడుతున్నారు. దీని వలన భూములలో భాస్వరం అధికంగా ఉంటున్నది. భూమిలోని భాస్వరాన్ని మొక్కలు 25-30 శాతం మాత్రమే వినియోగించుకొంటాయి. మిగతా మొక్కలకు అందని రూపంలో భూమిలో స్థిరీకరించబడిపోతుంది. భాస్వరం అధికంగా గల భూముల్లో, భాస్వరం మొక్కలకు సులభంగా అందేందుకు సహాయపడే పాస్పో బ్యాక్టీరియా (పి.యస్.బి.) జీవన ఎరువును, ఎకరాకు 2 కిలోలు సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. దీనివలన భూమిలో ఎక్కువగా ఉన్న భాస్వరం మొక్కలకు కొంత వరకైనా అందుబాటులోనికి వస్తుంది.
భాస్వరం అధికంగా ఉన్న భూముల్లో మొక్కలకు జింకు ఇనుము అందుబాటు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి భూముల్లో జింకు మరియు ఇనుము లోప నివారణ చీలేటెడ్ రూపంలో సూక్ష్మ పోషకాలను పంటపై స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
సున్నం (కాల్షియం) లేదా మెగ్నీషియం అధికంగా ఉన్న భూముల్లో పొటాషియం పోషకం అందుబాటు తక్కువగా ఉంటుంది. సేంద్రియ ఎరువులు విరివిగా వాడి ఇలాంటి భూములను కొంత వరకు బాగు చేసుకోవచ్చును.
లవణం సూచిక అధికంగా గల భూముల్లో (పాలచౌడు) భాస్వరం, జింకు, ఇనుము పోషకాల లోపాలు ఎక్కువగా కన్పిస్తాయి. ఇలాంటి భూములకు మంచి నాణ్యత గల నీరు పెట్టి, బాగా దున్ని, నీటిని బయటకు పంపి, సిపారసుల మేరకు ఎరువులు వాడాలి.
ఈ రకంగా, నేల గుణగణాలు, భూమి ఆరోగ్యం పైనే కాకుండా, మొక్కల ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన వివిధ పోషకాల అందుబాటు పైన కూడా త్రీవ ప్రభావం చూపుతాయి. కాబట్టి, భూసార పరీక్షా ఫలితాలలోని ప్రతి అంశాలన్ని క్షుణ్ణంగా పరిశీలించి రైతులు సాగులో సక్రమంగా ఎరువులను వినియోగించుకోవాలి. ఈ విషయంలో వ్యవసాయ లేదా ఉద్యాన అధికారులు మరియు శాస్త్రవేత్తలు రైతులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరముంది. రైతులు, భూసార, పరీక్షా ఫలితాల కార్డును సంబంధిత అధికారులకు చూపి వారి సలహా మేరకు ఎరువులు వాడి పంటలు మంచి దిగుబడులు పొందాలి.
మెరుగు భాస్కరయ్య,
జిల్లా ట్రైనింగ్ కో ఆర్డినేటర్,
జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.


























