“గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం”– మంత్రి తుమ్మల
– జూన్ లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం – మంత్రి తుమ్మల
– రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యం – మంత్రి తుమ్మల
– సుమారు 40,000 మంది రైతులకు, 2500 నుండి 3000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ – మంత్రి తుమ్మల
ఈ రోజు సచివాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డా॥ బి. గోపి మరియు ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, “గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం” అనే నూతన కార్యక్రమాన్ని జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించతగినట్లు అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అనేక రకాల కొత్త వంగడాలను అభివృద్ధి పరిచారని, వాటిలో ప్రాముఖ్యం పొందిన విత్తనాలను రైతాంగానికి అందించటం ద్వారా రైతులను నాణ్యమైన విత్తనాలను వారి స్థాయిలోనే ఉత్పత్తి చేసుకొనే విధంగా ప్రోత్సహించవచ్చన్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి, అన్ని రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించిన విత్తనాన్ని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,000 గ్రామాలలోని ప్రతి గ్రామం నుండి మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథక కింద పంపిణీ చేస్తామన్నారు.
ఈ పథకంలో సుమారుగా 2500-3000 క్వింటాళ్ళ ఐదు ప్రధాన పంటల విత్తనాన్ని (వరి, కంది, పెసర, మినుము మరియు జొన్న) దాదాపు 40,000 మంది రైతులకు అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు వెల్లడించారు. ఈ పథకం ద్వారా నాణ్యమైన విత్తనం పొందిన రైతులు తిరిగి ఆయా పంటలలో పండిన విత్తన పంటను ఆయా గ్రామాలలో తమతోటి రైతాంగానికి తక్కువ ధరకు అందజేయటం ద్వారా వచ్చే మూడు సంవత్సరాలలో గ్రామంలోని రైతులందరకి నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంటుందన్నారు. దీని ఫలితంగా రైతాంగం నకిలీ విత్తనాల మోసాల బారినుండి రక్షించబడటమే కాకుండా నాణ్యమైన విత్తనం ద్వారా 10-15% దిగుబడి అదనంగా దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయన్నారు. దీంతో పాటు రైతు నికరాదాయం కూడా పెరుగుతుందని మంత్రిగారు తెలియజేశారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకులు డా॥ బి. గోపి మరియు వారి సిబ్బంది ఉపకులపతి ప్రొ॥ అల్టాస్ జానయ్య గారిని మరియు విత్తన సంచాలకులు డా॥ నగేష్ కుమార్ గారు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనం -రైతన్నకు నేస్తం

Leave Your Comments