సాగు చేయని భూయజమానులకు ముందుగా అన్నదాత సుఖీభవ పథకం (పెట్టుబడీ సాయం) ఇచ్చి సాగు చేసే కౌలురైతులకు రెండో విడతలో ఇస్తామని చెప్పటం దుర్మార్గమని, వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలురైతులేనని కాబట్టి భూమి లేని కౌలురైతులకు కూడ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తేదీన అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతులసంఘం రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత ఆధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు రెండో తేదీన అన్నదాత సుఖీభవ పథకం మరియు ‘‘పి.యం. కిసాన్’’ పథకాల డబ్బులు మొదటి విడత విడుదల చేస్తున్నామని చెప్పారు. కానీ అందులో కౌలురైతుల గురించి మాట్లాడుతూ రెండో విడత ఇస్తామని చెప్పటం సిగ్గుచేటని, భూమిలేని కౌలు రైతులు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కాటయ్య, పి.జమలయ్య ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మారిన పరిస్థితులను పరిగణలో తీసుకున్నట్లు లేదు. వెబ్ల్యాండ్లో నమోదైన భూమీ ఆధారంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించడం అంటే భూ యజమానులకు అనుకూలంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం సాగు భూమిలో పంటల పండిస్తున్నది కౌలురైతులే. రాష్ట్రం మొత్తంగా 32 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. ఇందులో 10లక్షల మంది భూములేని గ్రామీణ పేదలే కౌలు వ్యవసాయం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కౌలురైతులకు కూడా తక్షణమే అందించాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు వారికి గుర్తింపుకార్డులు జారీ కాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయకుండా ఎవరు అడ్డు తగిలారని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు చట్టాన్ని సవరించి సులభంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చి ఆచరణలో తుంగలోతొక్కారని ద్వజమెత్తారు.
ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుండే కౌలురైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసేవారు. ఈసారి జూన్ రెండో వారంలో కౌలుగుర్తింపు కార్డులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించడంవల్ల వాస్తవ సాగుదారులైన కౌలురైతులు గుర్తింపు కార్డులు పొందలేక పోయారన్నారని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కార్డులు ఇవ్వకుండా 70 రోజులు కాలయాపన చేసి కౌలరైతులను మోసం చేశారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఇచ్చే రూ.20వేల ఆర్థిక సాయాన్ని పెట్టుబడి సాయం అంటారు. అంటే పంటల పండించే వాళ్ళకి ఆర్థిక సాయం అందాలి. అలా కాకుండా సాగు చేయ్యకుండా భూమి కలిగినటువంటి వారికి ఇస్తే ఫలితం ఏముంటుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. అందుకనే సొంత భూమి కలిగి సాగు చేసుకునే వారికి ఇస్తే ఫలితం ఉంటుంది కానీ సాగు చేయకుండానే భూమి పేరుతో అన్నదాత సుఖీభవ పథకం కింద వేల కోట్ల రూపాయలు తీసుకోవడం అనేది అన్యాయమైందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మాత్రం అవగాహన లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నిధులు తగ్గించుకోవటానికి వడపోత కార్యక్రమంలో భాగంగా కౌలు గుర్తింపు కార్డులు సకాలంలో జారీ చేయలేదని ఇప్పుడేమో కార్డులు లేవనే సాకు చూపించి రెండో విడతలో ఇస్తామని చెప్పటం సరైనదికాదు. కార్డులు జారీ చేసి, ఇ- పంట నమోదులో చేసి అర్హత కలిగిన కౌలురైతుల జాబితాలు తయారు చేసిన తరువాతే ఇస్తామని పేర్కొనటం ఇంతకన్న అన్యాయం ఏమి ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఎంపిక చేసిన వారందరూ సాగు చేస్తున్నారా? సాగు చేయని వారి జాబితా ఏమైనా తయారు చేశారా అంటే అదేమీ లేదు. అర్హత లేని వారికే ఈ పథకం ఎక్కువ శాతం అందుతుందని సంఘం నిర్వహించిన సర్వేలో తేలింది. “దున్నపోతుకు మేత వేసి గేదెను పాలు ఇయ్యమన్న చందగా” రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కౌలురైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ఆగస్టు రెండో తేదీనే సాగు భూమి లేని కౌలురైతుల అందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ఎ.కాటయ్య, పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పి.జమలయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం
94900 98050.
Leave Your Comments


























