PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (TAFE) సంయుక్తంగా రాజేంద్రనగర్ లో ఏర్పాటుచేసిన జె ఫార్మ్ అండ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ సెంటర్” ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ ఎం. రఘునందన్ రావు, PJTSAU ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు, TAFE లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్ లు దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశ్రమల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిని ప్రారంభించడం చాలా మంచి పరిణామమని ప్రవీణ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాలానుగుణంగా వ్యవసాయ విధానాలు, యాజమాన్య పద్ధతులు మారాలని ఆయన అన్నారు.
Also Read: PJTSAU: ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి ప్రారంభించిన PJTSAU ఉపకులపతి.!
రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గించవలసిన అవసరముందన్నారు. రిస్క్, ఖర్చులు తగ్గించేలా సాగు విధానాలు ఉండాలన్నారు.యాంత్రీకరణ, సమర్థ యాజమాన్య విధానాలు, పంటల మార్పిడి లను విరివిగా ప్రోత్సహించాలని ప్రవీణ్ రావు అన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సాగునీటి వసతిని కల్పిస్తోందన్నారు. ఆ వనరుల సమర్థవినియోగం ప్రస్తుతం అవసరమని అన్నారు. సమాచార, సాంకేతికత, నైపుణ్య ఆధారిత వ్యవసాయం వైపు వెళ్ళవలసి ఉందని వివరించారు.
గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, వర్సిటీ సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించడం వల్లనే PJTSAU ని అంతర్జాతీయ సంస్థల సరసన నిలబెట్టగలిగానని ప్రవీణ్ రావు అన్నారు. పూర్తి సంతృప్తితో తన పదవీ కాలం ముగిసిందని తన తరువాత APC VC గా బాధ్యతలు చేపట్టనున్నారని ప్రవీణ్ రావు ప్రకటించారు.
గత 40 ఏళ్లుగా వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రవీణ్ రావు అసమాన సేవలు అందించారని రఘునందన్ రావు అభినందించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వర్సిటీని ముందుకు తీసుకెళ్ల వలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తుందని వివరించారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి ఎన్నింటినో అమలు చేస్తూ తెలంగాణ రైతు గర్వంగా తలెత్తుకునేలా చేశామన్నారు. అయితే యువతని వ్యవసాయం వైపు ఆకర్షితుల్ని చేయడం పైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసర ముందన్నారు. ప్రెసిషన్ ఫార్మింగ్, డేటా టెక్నాలజీలతో కూడిన వ్యవసాయ పద్దతుల్ని ప్రోత్స హించాలని రఘునందన్ రావు సూచించారు.
వ్యవసాయ రంగం విషయంలో తెలంగాణ భారతదేశంలో ప్రత్యేక స్థానం సంపాదించింది అని మల్లికా శ్రీనివాసన్ అన్నారు. ప్రభుత్వం ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. రైతులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు మరింత సమన్వయంతో పనిచేయాలని మల్లికా శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. రోబోటిక్స్, డ్రోన్లు, డిజిటల్ టెక్నాలజీ ల పాత్ర వ్యవసాయ రంగంలో మరింత పెరగాలన్నారు. తమ సంస్థ తరఫున ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇన్నేళ్లుగా వర్సిటీ అభివృద్ధికి ప్రవీణ్ రావు బాగా శ్రమించారని మల్లికా శ్రీనివాసన్ అభినందించారు. ఈ వేదిక మీదుగా PJTSAU కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రవీణ్ రావు ని సభ్యులు అందరూ కరతాళధ్వనులతో అభినందించారు. సన్మానించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.