Mango మరో నెలలో ఎండాకాలంతోపాటే ‘ఫలాల రాజు’ మామిడి పండ్ల సీజనూ రాబోతోంది. పోయిన ఏడాది కేజీ మామిడి ధర సిటీల్లోనైతే రూ.100పైమాటే. ఈసారి కూడా ధరలు దాదాపు అంతే ఉండొచ్చని అంచనా. అయితే మామిడి పండ్ల కంటే వాటి ఎండిన ఆకులకు ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది. దాని చుట్టూ లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం..
మనిషి జీవితంలో, అందునా భారతీయ జీవన విధానంలో మామిడి చెట్టుకుండే ప్రాధాన్యం తెలిసిందే. పండ్లు తినడం, పచ్చడి పెట్టుకోవడంతోపాటు శుభకార్యాలకు ఇళ్లు, గుళ్లలో మామిడాకులు కట్టడం తప్పనిసరి. గ్రామాల్లో, పట్టణాల్లో ఫ్రీగా దొరికే మామిడాకులను సిటీల్లోనైతే కొనాల్సిందే.
ఆకుపచ్చని మామిడాకులు కొన్ని సార్లు ఆన్ లైన్ లోనూ లభ్యమవుతుండటం అతిశయోక్తికాదు. కాగా, ఇటీవల కాలంలో ఎండిన మామిడాకులకు కూడా డిమాండ్ ఏర్పడింది. ఒక కేజీ ఆకులకు మామిడి పండ్ల కంటే ఎక్కువ ధర లభిస్తోంది.
మామిడి ఆకుల్లో ఔషధ గుణాలున్న సంగతి తెలిసిందే. ఎండిన మామిడాకుల నుంచి పళ్లపొడిని తయారు చేస్తోంది కేరళకు చెందిన ఓ కంపెనీ. మామిడాకుల పళ్లపొడి తయారీ కోసం రైతుల నుంచి భారీ ఎత్తున ఎండిన మామిడాకులను కొంటున్నారు.
లోని కాసర్గోడ్ జిల్లాలో ఎండిన మామిడాకుల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎండిన మామిడి ఆకులకు కిలో దాదాపు రూ. 150 పలుకుతోంది. ఇది కిలో మామిడిపండుకంటే ఎక్కువ ధర.
కేరళకు చెందిన ఈనో వెల్నెస్ నికా అనే సంస్థ ఎండిన ఆకులతో ఆర్గానిక్ పళ్లపొడిని తయారు చేస్తున్నది. కేరళలోని కన్నూర్, కాసర్ గోడ్ ప్రాంతాల్లోని గ్రామాలన్నింటి మామిడి ఆకుల సేకరణ ప్రారంభించింది.
మామిడి ఆకులు నుంచి పళ్లపొడి చేసేందుకు వెల్నెస్ నికా సంస్థకు పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయట. టూత్ పౌడర్ తయారీ కోసం ఈ సంస్థ మామిడి ఆకులు కొంటామని ప్రకటన ఇచ్చింది. త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి రెడీ అవుతోంది.
మామిడి ఆకులను పరిశుభ్రమైన పరిసరాల్లో.. సహజంగా శుభ్రంగా ఎండబెట్టాలి అనే కండిషన్ పెడుతున్నారు. ఇలా సహజంగా మామిడి ఆకులకు కిలోకి రూ. 150 లు చెల్లిస్తోంది. డబ్బులు వద్దు అనుకునే రైతులకు కంపెనీలో వాటాలు కూడా ఇస్తున్నారు.
ప్రతి రెండు కిలోల మామిడి ఆకులకు ఆ సంస్థ ఒక షేరు ఇస్తుందట. ఇప్పటికే తాము కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లోని అన్ని పంచాయతీల నుంచి ముడిసరుకును కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని. తమ సిబ్బందిని పంపి ఎండిన మామిడి ఆకులు సేకరిస్తున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అబ్రహం తెలిపారు.